అమరావతి-విశ్వశ్రేణి కార్పొరేట్‌ రాజధాని!

మే రెండవ తేదీన అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభం పేర రూ.49 వేల కోట్ల విలువైన 74 పనులను మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రచార ఆర్భాటంతో ఈసారైనా రాజధాని నిర్మాణానికి మోడీ నిధులు ప్రకటిస్తారని ప్రజలు భావించారు. కానీ మాటలతోటే సరిపెట్టారు. వాస్తవంగా ఆంధ్ర ప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అమరావతి రాజధాని నిర్మాణానికి ముఖ్యంగా శాసనసభ, సచివాలయం, హైకోర్టు, వివిధ విభాగాల కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, గృహ కల్పన సదుపాయాలు మొదలగు వాటికి అవసరమైన నిధులు కేంద్రం ఇవ్వాలి. కానీ ఈ పదకొండేళ్ల కాలంలో రాజధాని నిర్మాణానికి కేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చింది. రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. కేవలం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హడ్కో ద్వారా రూ. 31 వేల కోట్లు రుణం ఇప్పించి చేతులు దులుపుకుంది.
ప్రధాని రాజధాని పనులు పున:ప్రారంభం ఎలా ఉన్నా అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం నిధులివ్వక పోవటాన్ని నయా ఉదారవాద విధానాల అమలులో భాగంగా మనం చూడాలి. ఈ విధానాలకు నమూనాగా అమరావతి రాజధాని నిర్మాణం రూపుదిద్దుకోబోతున్నదనేది అర్థం చేసుకోవాలి. ఇప్పటికే భారత దేశంలో అక్కడక్కడా ఈ విధానాల్లో భాగంగా కొన్ని చిన్న చిన్న నగరాలు నూతనంగా నిర్మాణం కాబడ్డాయి. లావాస, ధోలేరా, గిఫ్ట్‌ వంటివి ముఖ్యమైన చిన్న నగరాలు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కార్పొరేట్‌ పెట్టుబడితో నిర్మించబడ్డ ప్రైవేట్‌ నగరాలివి. ప్రభుత్వం కేవలం కొన్ని నామమాత్ర పరిపాలనా కార్యక్రమాల్లో మాత్రమే వీటిలో భాగం పంచుకుంటుంది. ఇక పెద్ద పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీలను పెద్ద పెద్ద నగరాల్లో మనం చూస్తున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక కేంద్రాలు, కారిడార్లకు అనుసంధానంగా సమీకృత టౌన్‌షిప్‌ల నిర్మాణానికి కూడా ప్రయత్నం చేస్తున్నది. ఇవన్నీ ప్రైవేట్‌ పెట్టుబడితో నిర్మాణం జరుగుచున్నవే. భూమి దగ్గర నుండి అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం బాధ్యతగా వీటికి కల్పిస్తుంది. పరిపాలనా వ్యవస్థ మొత్తం ప్రైవేట్‌ వారి ఆధీనంలోనే ఉంటుంది.
భారత దేశంలో గత రెండు దశాబ్దాల నుండి పట్టణ సంస్కరణల పేర ఇప్పటికే ఉన్న అన్ని పౌర సేవలు, మౌలిక సదుపాయాలలోకి ప్రైవేట్‌ పెట్టుబడులను అనుమతించే విధానాల అమలుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేశంలో ఇప్పటివరకు ఎక్కడా ఒక రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం పూర్తిగా నయా ఉదారవాద విధానాల మార్గదర్శకత్వంలో జరగలేదు. ఇప్పుడు అమరావతి రాజధానే దేశంలో తొలి కార్పొరేట్‌ రాజధాని కాబోతున్నది.
అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ పద్ధతే ఈ విధానం ప్రారంభానికి తొలి పక్రియగా పేర్కొనవచ్చు. దీనికి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎ.పి సి.ఆర్‌.డి.ఎ), అమరావతి కార్పొరేషన్‌ సంస్థ (ఎ.డి.సి)లను ఏర్పాటు చేశారు. మొత్తం ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా 34,390 ఎకరాలను సుమారు 28,740 మంది రైతుల నుండి సేకరించిన విషయం తెలిసిందే. ఇదికాక చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం 53 వేల ఎకరాల భూమిని మొదటి దశలో సమీకరించారు. ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ క్రీడా మైదానాలు ఇలా మరికొన్ని ప్రాజక్టుల పేర రెండో దశలో మరో 44 వేల ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. రాజధాని నిర్మాణంలో భూసేకరణకు అంతం ఉండదు. ప్రైవేట్‌ పెట్టుబడుల ప్రయోజనాల కోసం నిరంతరం విస్తరించుకుంటూ పోతారు.
రాజధాని నిర్మాణంలో భూమి మొత్తం ఒక వ్యాపార సరుకుగా మార్చబడుతుంది. దీనికి అనుగుణంగానే రాజధాని 12 జోన్లుగా విభజించబడింది. పరిపాలన, నివాస, న్యాయ, వ్యాపార, ఎలక్ట్రానిక్స్‌, నాలెడ్జ్‌, ఆరోగ్య, క్రీడా, పర్యాటక ఇలా నవనగరాల పేర్లతో భూమి ప్రైవేట్‌ పెట్టుబడులకు కేటాయించబడుతున్నది. ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన రాజధాని పరిధి 217 చ.కి మీటర్లలో ముఖ్యమైన సీడ్‌ క్యాపిటల్‌ కేవలం 17 చ.కి మీటర్లు మాత్రమే. రెండో దశలో సేకరించాలనుకుంటున్న భూమిని కూడా పరిగణనలోకి తీసుకుంటే రాజధాని పరిధి రెట్టింపు అవుతుంది. దీనిని బట్టి రాజధాని భూమి ఏ స్థాయిలో మార్కెట్‌ సరుకుగా మారిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు సి.ఆర్‌.డి.ఎ పరిధిని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలో సుమారు 8,352 చ.కి మీటర్లకు విస్తరించారు.
కనుక అమరావతి పూర్తిగా మార్కెట్‌ ఆర్థిక నమూనాతో నిర్మాణం అవుతున్న కార్పొరేట్‌ రాజధాని. ఆర్థిక వృద్ధిని పెంచాలనే నయా ఉదారవాద దృక్పథం నుండి ఇది రూపుదిద్దుకొంటున్నది. అందువల్ల రాజధాని నిర్మాణానికి… కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ల నుండి నిధులు కేటాయించే దానికన్నా అంతర్జాతీయ ఫైనాన్స్‌ సంస్థల నుండి రుణ రూపంలో నిధులు సేకరించాలనేదే వ్యూహంగా వున్నది. దాంతో రాష్ట్ర విభజన చట్టం హామీలో పేర్కొన్న రాష్ట్ర రాజధాని నిర్మాణ వ్యయ బాధ్యత నుండి కేంద్రం తప్పుకున్నది. నిర్మాణ ప్రారంభమైన తొలి దశ (2018) లోనే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అమరావతి బాండ్స్‌ పేర రూ.2 వేల కోట్లు 10.32 శాతం వడ్డీతో సమీకరించిన విషయం తెలిసిందే. ఇలా అనేక రూపాల్లో ఈ అప్పుల సేకరణ కొనసాగుతుంది. అలాగే భూముల అమ్మకం ద్వారా పెద్ద ఎత్తున నిధులు సేకరించి నిర్మాణానికి వినియోగించడం మరో ముఖ్యమైనది. అయితే తీసుకొచ్చే రుణాలు తీర్చడం మాత్రం రాష్ట్ర ఖజానా బాధ్యతగా ఉంటుంది. అంటే ప్రజలు దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పుడు అమరావతి రాజధాని భూ కేటాయింపులు మొత్తం ప్రైవేట్‌ పెట్టుబడుల చుట్టూ వారి ప్రయోజనాలకు అనుగుణంగా కేటాయింపులు జరుగుచున్నాయి. వీటికి అనేక కొత్తకొత్త పేర్లు, సిటీలు సృష్టిస్తున్నారు. కోట్ల రూపాయల భూ రాయితీలు ఇస్తున్నారు. భూ చట్టాలను సరళతరం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు జరుగుతున్న పట్టణ ప్రణాళికకు నేడు రాజధాని ప్రాంతంలో అమలు చేస్తున్న దానికి ఏమాత్రం సంబంధం లేదు. దీనిని పూర్తిగా ప్రైవేటు పెట్టుబడుల ఆర్థిక ప్రయోజనాలు, రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాల విస్తరణ కేంద్రంగా అమలు చేస్తున్నారు. నగర జోనింగ్‌ నిబంధనలను రాజధాని నిర్మాణ విషయంలో మార్చేశారు. ఈ జోనింగ్‌ విధానం వ్యాపార వాణిజ్య పారిశ్రామిక కార్యకలాపాలను నియంత్రించదు. వీటి విచ్చలవిడి అరాచక చర్యలలో జోక్యం చేసుకోకుండా అచేతనంగా ఉంటుంది. అంతేకాకుండా పౌరుల జీవన కోణం, పర్యావరణం వంటి వాటికి ఈ జోనింగ్‌ వ్యవస్థలో ప్రాధాన్యత లేదు. కేవలం పెట్టుబడి ప్రయోజనాలతో పాటు ధనిక, ఉన్నత మధ్య తరగతి, వారి అవసరాలు, ప్రయోజనాల చుట్టూ పట్టణ ప్రణాళిక, జోనింగ్‌ విధానం మారింది. ప్రతి ప్రాజెక్టును ఈ విధానంతోనే రూపొందిస్తున్నారు. అమలులోకి తీసు కొస్తున్నారు.
ప్రభుత్వ పాత్ర, దాని స్వభావం కూడా పూర్తిగా మారిపోతున్నది. మార్కెట్‌ సూత్రాలను అమలులోకి తీసుకు రావడం, వాటిని ప్రోత్సహించడం, ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు, వాటితో పెనవేసుకొని అక్రమ బంధం కొనసాగించేందుకు చాలా చురుగ్గా పనిచేస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రైవేట్‌ పెట్టుబడికి పూర్తిగా రక్షకుడిగా మారిపోతున్నది.
అమరావతి నమూనాలోనూ, ప్రభుత్వ పాత్రలోనూ ప్రజల జీవనోపాధి, సామాన్యుల గృహ వసతి, సామాజిక అభివృద్ధి, సమ న్యాయం, ఆర్థిక అసమానతల నిర్మూలన వంటి వాటికి ప్రాధాన్యత లేదు. అటువంటి వాటికి అక్కడ స్థానమే ఉండదు. పేదవాడికి నివాస హక్కు ఉండదు సరికదా పౌరుల హక్కులు నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం శత్రుపూరిత వైఖరి తీసుకొని తలపడుతుంది. ప్రైవేట్‌ పెట్టుబడులకు శ్రామిక వర్గాల నుండి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సహించదు. అలాంటివి రాకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతూ, అడుగడుగునా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది.
వినియోగ ఆధారిత అభివృద్ధిగా సంపన్నులకు, ఉన్నతి మధ్యతరగతి వర్గాలకు అత్యంత విలాసవంతమైన ఆకాశహర్మ్యాలు నిర్మించబడుతున్నాయి. వీరికి అవసరమైన విధంగా అన్ని రకాల సౌకర్యాలు, పార్కులు, క్రీడా, రిక్రియేషన్‌ వంటివి చేపడుతున్నారు. ఇవన్నీ వ్యాపార సరుకులుగా నడపబడతాయి. మోడీ పున:ప్రారంభ సభలో ముఖ్యమంత్రి ఈ భావనతోనే అమరావతి స్వయంచాలక రాజధానిగా ఉంటుందని ప్రకటించారు.
అలాగే మంచి నీరు, పారిశుధ్యం, రవాణా, విద్యుత్‌, పౌర సేవలు, మౌలిక సదుపాయాలు వంటివి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పట్టణాల్లో వలే ఉండవు. ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడవు. ఇవి పూర్తిగా ప్రైవేటు శక్తుల అధీనంలో నిర్వహించబడతాయి. కొద్దిమంది గుత్తాధిపత్యంలోకి మారతాయి. వీటికి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పి.పి.పి), జాయింట్‌ వెంచర్‌, ప్రత్యేక ఉద్దేశ సంస్థ (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌) ఇలా అనేక పేర్లతో ముసుగులు తొడుగుతారు. ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
అయితే అమరావతిలో మున్సిపల్‌ స్థానిక పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంటుందనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. అమరావతి రాజధాని అనేది విశాఖపట్నం, విజయవాడ లేదా హైదరాబాద్‌ వలె అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అమలులోకి తీసుకొస్తారా? లేదా? అనేది ప్రభుత్వం చెప్పటం లేదు. ఒకవేళ మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మార్చినా ఇది ఆచరణలో నామమాత్రంగానే ఉంటుంది. పరిమితమైన అధికారాలు మాత్రమే కలిగి కేవలం పన్ను వసూళ్లకే పరిమితం కావొచ్చు. ఎందుకంటే భూమిపై అమరావతి కార్పొరేషన్‌కి ఎలాంటి అధికారం ఉండదు. ఈ భూమి మొత్తం ఇప్పుడు సి.ఆర్‌.డి.ఎ ఆధీనంలో ఉంది. నివాసాలన్నీ స్వయం పాలనతో భారీ గేటెడ్‌ కమ్యూనిటీలుగా రూపొందుతున్నాయి. ఇక మిగిలినవి గ్రామాలు. ఈ గ్రామాలు భవిష్యత్తులో ఇలానే కొనసాగుతాయని చెప్పలేం. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ వ్యవస్థ ఏర్పడితే అది కేవలం ప్రైవేట్‌ పెట్టుబడికి రక్షకుడుగా ఉంటుంది.
కనుక నయా ఉదారవాద భావజాలంలో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతున్నది. ఇది ఎన్నటికీ ప్రజా రాజధాని కాదు. కాబోదు. అతి కొద్ది మంది సంపన్నులు, మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఇక్కడ జీవించే అవకాశం ఉంటుంది. వీరంతా ఖరీదైన వినియోగదారులు. సామాన్యులు, పేదలు, కింది సామాజిక తరగతులు అమరావతిలో జీవించడం కష్టం. ఇది ప్రభుత్వ కనుసన్నల్లో ఆధునిక పెట్టుబడి విధించే ఒక విధమైన సాంఘిక బహిష్కరణగా భావించవచ్చు. వేగంగా ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు, పౌర సేవలు అన్నీ ప్రైవేట్‌ శక్తుల అధీనంలోకి బదిలీ చేయబడతాయి. పట్టణ పరిపాలనా వ్యవస్థ, ప్రభుత్వ పాత్ర పూర్తిగా ప్రైవేటు పెట్టుబడికి అనుకూలంగా మారిపోతుంది.
ఇప్పుడు మరోసారి ప్రధాని మోడీని అమరావతికి తీసుకురావడం, ఈ పున:ప్రారంభ కార్యక్రమం చేపట్టడం…ప్రైవేట్‌ పెట్టుబడుల కేంద్రంగా అమరావతి నిర్మాణం అనే సంకేతాన్ని మరోసారి జాతీయ, అంతర్జాతీయ బడా పెట్టుబడులకు పరిచయం చేయడమే. దీనిని మోడీ-బాబు ఉమ్మడి పెట్టుబడిదారీ వ్యూహంగా చూడాలి.

 వ్యాసకర్త : డా||బి. గంగారావు

 సెల్‌ : 9490098792 /

➡️