చైనాలో తాజాగా వైరస్ వ్యాప్తితో ఊపిరి తిత్తుల సంబంధిత వ్యాధి రోగులు తామరతంపగా పెరుగు తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హ్యూమన్ మెటా న్యూమో(హెచ్.ఎమ్.పి) వైరస్ కారకంగా తెలియ వస్తోంది. అదే వైరస్ కేసులు ఇతర ప్రపంచ దేశాల్లో కూడా రిపోర్ట్ అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. భారత్లో బెంగుళూర్లో రెండు కేసులు బయటపడ్డాయి. అయితే వాటికీ, చైనాలో కేసులకు సంబంధం లేదని ఐసీఎమ్మార్ ప్రకటించింది. అది ఊరట. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండడం అవసరం. కోవిడ్ వ్యాప్తిలో జరిగిన అనుభవాల ఆధారంగా కొంత జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వైరస్ వ్యాప్తి పట్ల సమాచారం వెంటవెంటనే అందజేసేటట్లు చూడాలి. చైనా, ఇతర దేశాల్లో పరిస్థితుల్ని దగ్గరగా గమనించాలి. ప్రజారోగ్య విభాగాల్ని, సంబంధిత యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలి. ఆక్సిజన్ నిల్వలు, సిబ్బంది, సపోర్ట్ సిస్టమ్లను సిద్ధం చెయ్యాలి. వీటన్నింటి కన్నా ముఖ్యంగా వ్యాప్తి నివారణ అంశాలపై దృష్టి పెట్టాలి. మాస్కుల వినియోగం, చేతుల శుభ్రత, గుంపుల నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కలిగించాలి. కరోనా సమయంలో పాటించిన జాగ్రత్తలను ప్రజా సమూహాలు మళ్లీ అలవర్చుకోవాలి. ముఖ్యమైన విషయమేమిటంటే ఈ హెచ్.ఎమ్.పి వైరస్ కొత్తది కాదు. ప్రమాదకరమైనదీ కాదు. 2001 నుండి తెలిసిందే. పిల్లల్లో శ్వాస సంబంధిత వ్యాధుల్లో 12 శాతం దీని వల్లే వస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళలో ప్రమాదకరంగా మారవచ్చు అన్న ఉద్దేశ్యంతో జాగ్రత్త పడాలి. శీతాకాలంలో సహజంగానే వైరస్ వ్యాప్తి ఎక్కువ. కాబట్టి కేసులు ఎక్కువ కనబడతాయి. నివారణ జాగ్రత్తలతో వ్యాప్తిని వీలైనంత తగ్గిస్తే వ్యాధి భారం సమాజంలో తగ్గుతుంది. ఆ కోణం లోనే ఆలోచించి, తదనుగుణంగా ఆచరిస్తే సరిపోతుంది.
– డా.డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ, విజయనగరం.