అవినీతికి మూలం బిజెపి

Apr 20,2024 04:02 #editpage

ఎన్నికల బాండ్ల పథకాన్ని కోర్టులో సవాల్‌ చేసిన ఏకైక పార్టీ సిపిఎం. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), పిఎంఎల్‌ఏ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌) లాంటి చట్టాలను రద్దు చేయాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెెక్టరేట్‌ చర్యల్ని నిరోధించాలని సిపిఎం ఎన్నికల మ్యానిఫెస్టోలో పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్యానికి 2024 ఎన్నికలు ఎందువల్ల కీలకమైనవో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి… ఫ్రంట్‌లైన్‌ ప్రతినిధి టి.కె.రాజాలక్ష్మికి వివరించారు.

సాధారణ ఎన్నికలపై సిపిఎం, వామపక్షాల వైఖరి ఏమిటి ?
పదేళ్ల మోడీ పాలనలో ఈ దేశ లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌ ఉనికికే ముప్పు వాటిల్లిన తరుణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యాంగానికి మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, సమాఖ్య వ్యవస్థ, సామాజిక న్యాయాల్ని కూల్చుతున్న తీరును భారతదేశం చూస్తున్నది. పార్లమెంట్‌లో ఆధిక్యత, రాజ్యాధికారాలను దుర్వినియోగపర్చడం ద్వారా శ్రామికుల హక్కుల్ని హరించేందుకు, అసమాన భారతాన్ని సృష్టించేందుకు, ప్రజల్ని మత ప్రాతిపదికన విభజించి, విషపూరిత మతతత్వ భావజాలాన్ని రుద్దడానికి…నిరంకుశ, మతతత్వ మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్‌ విధానాలను ఉపయోగిస్తున్నది. ఈ దేశ ప్రజలమైన మనం ఓటు ద్వారా రాజ్యాంగం నిర్దేశించిన భారత రిపబ్లిక్‌ యొక్క లౌకిక, ప్రజాస్వామిక లక్షణాన్ని రక్షించగలమా లేదా అనేది ఈ ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. భారత రిపబ్లిక్‌ లౌకిక, ప్రజాస్వామిక లక్షణాన్ని…అసహన, ద్వేషపూరిత, హింస ఆధారిత నిరంకుశ, ఫాసిస్ట్‌ హిందూత్వ రాజ్యంగా మార్చడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా భారతదేశ రక్షణ కోసమే ఈ ఎన్నికలు.

అవినీతిని సమర్ధించేందుకే ‘ఇండియా’ బ్లాక్‌ ఐక్యంగా వుందన్న బిజెపి వైఖరిపై మీ స్పందన ఏమిటి ?
ఇది హాస్యాస్పదమైన ఆరోపణ. ‘ఇండియా’ కూటమిలోని కొన్ని పార్టీల నాయకులపై సిబిఐ, ఇ.డి, ఐ.టి సంస్థలు అవినీతి కేసులు బనాయించినప్పుడు సదరు నాయకులు బిజెపిలో చేరిన వెంటనే ఆ ఆరోపణలన్నీ మాయమవుతాయి. దేశంలో అవినీతికి మూలం మోడీ నాయకత్వంలోని బిజెపి అనేది వాస్తవం.

వామపక్షాలు, వాటి ఎన్నికల ఎత్తుగడలు, బిజెపి ఓటమి లక్ష్యంలో తమ వంతు పాత్రను పోషిస్తాయా? కేరళలో వామపక్షాలు, కాంగ్రెస్‌ మధ్య పోటీ, పశ్చిమ బెంగాల్‌లో త్రిముఖ పోటీ ఉంది. ఇవి, బిజెపిని ఓడించే లక్ష్యాన్నెలా నెరవేరుస్తాయి ?
భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, భారత రిపబ్లిక్‌ లౌకిక ప్రజాస్వామిక స్వభావాన్ని కాపాడేందుకు, బిజెపిని ఓడించే లక్ష్యంతో ఇటీవల ‘ఇండియా’ వేదిక, ఢిల్లీ లోని రామ్‌ లీలా మైదానంలో భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ వేదిక లోని కొన్ని పార్టీల మధ్య వైరుధ్యాలున్నాయి. అయితే అలాంటి వైరుధ్యాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా ఇలాంటి వైరుధ్యాల కారణంగానే బిజెపి బలహీనపడి, ఎన్నికల్లో ఓటమి పాలైంది. రాజకీయాలంటే కూడికలు, తీసివేతలు మాత్రమే కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. కేరళలో సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలోని యుడిఎఫ్‌ మధ్యనే పోటీ నెలకొన్న ఫలితంగా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి గెలవడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బిజెపికి మాత్రమే లబ్ధి చేకూర్చుతుంది. త్రిముఖ పోటీలోని వామపక్షాలు-కాంగ్రెస్‌ల కలయిక బిజెపి, తృణమూల్‌ కాంగ్రెస్‌లను ఎదుర్కొంటుంది. ఈ త్రిముఖ పోటీ, బిజెపి లాభపడకుండా అడ్డుకుంటుంది. ఢిల్లీలో, ఇతర చోట్ల ఆప్‌, కాంగ్రెస్‌ల మధ్య అవగాహన ఉన్నప్పటికీ పంజాబ్‌లో ఆప్‌, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు విడిగా పోటీ చేస్తున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ బిజెపి ఓటమికి ఎన్నికల సర్దుబాట్లు జరుగుతున్నాయి.

జెడి(యు), ఆర్‌ఎల్‌డి, పల్లవి పటేల్‌ అప్నాదళ్‌, ప్రకాష్‌ అంబేద్కర్‌ విబిఎల నిష్క్రమణ, ఎన్‌సిపి లోని చీలికను మీరు తిరోగమనంగా చూస్తారా? విపక్షాల కూటమి ఎంత వరకు పుంజుకుంటుంది ?
‘ఇండియా’ బ్లాక్‌ నాయకులంతా కలిసి (చాలా ముఖ్యం అయినప్పటికీ) వుంటేనే ఈ వేదిక ఐక్యంగా వున్నట్టు కాదు. భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ప్రజల మధ్య ఐక్యతే ఈ వేదిక ఐక్యతలోని ముఖ్యమైన అంశం. దీనిని ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో చూశాం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న ప్రజల ఆకాంక్షే, ఎమర్జెన్సీ ప్రతిఘటనను బలోపేతం చేసి, అన్ని పార్టీల నాయకులు ఏకం అయ్యేలా ఒత్తిడి తెచ్చింది. ఆ దృష్టితో చూస్తే, ‘ఇండియా’ బ్లాక్‌ క్షేత్రస్థాయి నుంచి పుంజుకుంటుంది. ”భారత్‌ ఐక్యంగా ఉంటుంది, ‘ఇండియా’ గెలిస్తుంది” అనే ప్రజాదరణ పొందిన నినాదమే దీనికి నిదర్శనం.

‘ఇండియా’ బ్లాక్‌కు ఒక ఉమ్మడి మ్యానిఫెస్టోను తీసుకొచ్చే అవకాశం ఉందా? అత్యంత ధనికుల పైన, సంపద పైన పన్నులు వెయ్యాలనీ, వారసత్వ పన్ను విధించాలనీ…ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలనే సూచనలు మీ మ్యానిఫెస్టోలో చేశారు. ప్రభుత్వ రంగ పెట్టుబడుల ఉపసంహరణ గురించి ప్రస్తావించారు. మీ భాగస్వామ్య పార్టీలు వీటిని అంగీకరించకపోవచ్చేమో?
‘ఇండియా’ బ్లాక్‌ లోని పార్టీలకు ఎవరి మ్యానిఫెస్టోలు వారికి వుండడం సహజం. ఎన్నికలు సమీపించే సమయానికి కేంద్రంలో ఏర్పడబోయే ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వం చేపట్టే కనీస ప్రాథమిక చర్యలతో ఒక ఉమ్మడి ఎజెండాను విడుదల చేస్తారు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌, 1999లో ఎన్డీయే లేదా 2004లో యుపిఎ ప్రభుత్వాలు ఏర్పడినపుడు జరిగిన విధంగానే ఇప్పుడూ రూపొందిస్తారు. ఆ యా పార్టీలకు, కొన్ని సమస్యలపై కొన్ని వైఖరులు ఉన్నప్పటికీ ‘ఇండియా’ బ్లాక్‌ లోని పార్టీలన్నీ కలిసి ఒక అంగీకారానికి వచ్చిన కనీస ఉమ్మడి ఒప్పందం ఒకటి ఉంటుంది.

ఇ.డి చర్యల్ని నిరోధించాలని, పిఎంఎల్‌ఎ, ఉపా చట్టాల్ని రద్దు చేయాలని మీ పార్టీ మ్యానిఫెస్టోలో పిలుపునిచ్చింది. ఈ రెండు చట్టాల్ని యుపిఎ పాలనలో మరింత కఠినతరం చేశారని మీ పార్టీ గుర్తించింది. అవినీతిని, తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మాత్రమే ఈ చట్టాల్ని వినియోగిస్తున్నట్టు బిజెపి చెప్తున్నది. ఈ చట్టాల దుర్వినియోగం గురించి మాత్రమే ‘ఇండియా’ కూటమి ఆందోళన చెందుతున్నదా? లేక దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు వాటిని తొలగించాలని కోరుకుంటున్నదా?
మోడీ ప్రభుత్వం తెచ్చిన సవరణల ద్వారా ఈ రెండింటినీ ఆయుధాలుగా ఉపయోగించారు కాబట్టి ఇ.డి చర్యల్ని నిరోధిస్తూ, పిఎంఎల్‌ఎ, ఉపా చట్టాలను రద్దు చేయాలని సిపిఎం పిలుపునిచ్చింది. ఈ రెండు చట్టాలు (బెయిల్‌ పొందడానికి) అనాగరికమైన నిబంధనలు కలిగి ఉన్నాయి. ఇవి రెండూ కలిసి న్యాయశాస్త్ర సూత్రాన్ని, న్యాయాన్నందించే ప్రాథమిక నియమాన్ని తలకిందులు చేశాయి. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చేంతవరకు, నేరం రుజువు అయ్యేంతవరకు ఒక వ్యక్తి నిర్దోషి అని మనకు న్యాయశాస్త్రం తెలియజేసింది. కాని నేడు, ఒక వ్యక్తి తాను నిర్దోషి అని రుజువు చేసుకునేంత వరకు, దోషిగానే ఉంటాడు. ఈ కారణంగానే ఎలాంటి అభియోగాలు రుజువు కాకుండానే ఎంతోమంది జైళ్ళలో మగ్గుతున్నారు. భీమా కోరేగావ్‌ కేసులో వలె ఛార్జిషీట్‌ వేయకుండానే అనేకమంది సంవత్సరాల తరబడి నిర్బంధంలో ఉంటున్నారు. అందుకే ఈ అనాగరిక చట్టాలు పోవాలి. ఇవి ప్రజాస్వామ్య విరుద్ధమైనవి, ఫాసిస్ట్‌ విధానాలకు అనుకూలమైనవి.
అవినీతిని, తీవ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలో చాలా విస్తృతంగా చర్చించారు. అవసరమైతే చట్టాల్ని రూపొందించవచ్చు. కానీ గత పదేళ్ళలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయడంలో ఉద్దేశపూర్వకంగానే ఎందుకు తిరస్కరించిందో, ఎందుకు విఫలమైందో బిజెపి చెప్పాలి.

దేశంలో 2024 ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయా? ఈ సవాల్‌ను ఎదుర్కోవడంలో ప్రతిపక్షాల వ్యూహం ఏమిటి ?
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్న దాంట్లో కీలకమైన అంశం అందరికీ సమాన అవకాశాలను కల్పించడమే. రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేయడం ద్వారా దానికి ఇప్పటికే తీవ్ర విఘాతం కలిగింది. ఇది బిజెపికి భారీ లబ్ధిని చేకూర్చింది. ఎన్నికల బాండ్లతో పాటు ఎలాంటి లెక్కలు, ఆడిట్‌ లేని, ఏమాత్రం పారదర్శకత లేని ”పి.ఎం.కేర్స్‌” నిధులున్నాయి. ఇది ప్రధాని ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్‌ నిధిగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధి కింద 10 వేల కోట్ల రూపాయలున్నట్లు సమాచారం. ఆ విధంగా బిజెపి అమితమైన లబ్ధి పొందుతున్నది.
ప్రధాని మోడీ అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించినప్పుడు కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోపై చేసిన వ్యాఖ్యలను చూసినట్లయితే…మత విభజనలను తీవ్రం చేసేందుకేనని తెలుస్తుంది. అయితే భారత ఎన్నికల కమిషన్‌ దాని గురించి ఏ మాత్రం పట్టించుకున్నట్లు లేదు. సోషల్‌ మీడియాపై ఆధిపత్యం కలిగి వున్న, మీడియాను తన గుప్పెట్లో ఉంచుకున్న బిజెపి బాగా లబ్ధి పొందుతున్నది.

ఎన్నికల బాండ్ల పథకం ద్వారా నిధులను తీసుకోబోమని మీ పార్టీ ప్రకటించింది. దానికి కారణం ఏమిటి ?
2017లో ఎన్నికల బాండ్ల పథకాన్ని ఆర్థిక బిల్లులో భాగంగా చట్టవిరుద్ధంగా, రహస్యంగా పార్లమెంట్‌ ముందుకు తెచ్చినప్పుడు సిపిఎం వ్యతిరేకించింది. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ఇతరులతో కలిసి నేను రాజ్యసభలో ప్రతిపక్షాన్ని నడిపించాను. ఎన్నికల బాండ్లనేవి రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేయడంగా పరిగణించి, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ఈ ప్రక్రియ ద్వారా నిధులను సమకూర్చుకునే పార్టీ సిపిఎం కాదని ప్రకటించాం.

ఎన్నికల బాండ్ల నిషేధం అందరికీ సమాన అవకాశాల కల్పనకు హామీ ఇస్తుందా? లెక్కల్లో చూపించని డబ్బు కూడా భారీగానే ఉందని వస్తోంది.
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాలి. అయితే ఇంతకు ముందే ఈ తీర్పు వచ్చి వుండాల్సింది. పథకం వివరాలు మూడు అంశాలను స్పష్టంగా నిర్ధారించాయి. ఎ) ఇ.డి, సి.బి.ఐ, ఐ.టి లాంటి ఏజెన్సీల దుర్వినియోగం ద్వారా దోపిడీకి పాల్పడటం. బి) భారీ విరాళాలకు ప్రతిఫలంగా క్విడ్‌ ప్రో కో పద్ధతిలో (నీకు ఇంత నాకు అంత) ప్రాజెక్టులు, అడ్డంకుల తొలగింపులు మంజూరుచేసే ఒప్పందాలు జరగడం. సి) అనేక సంస్థలు తమ ఆస్తులు, అప్పుల పట్టికలో చూపిన లాభాల కంటే అనేక రెట్లు ఎన్నికల బాండ్లు కొనడంతో భారీగా మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డాయి. ఈ మూడు అంశాలపై వీలైనంత త్వరలో స్వతంత్ర సంస్థల ద్వారా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని సిపిఎం కోరుతున్నది.

ఆదాయపు పన్నుల శాఖ మీ పార్టీకి నోటీసులు పంపడం దైనందిన చర్యల్లో భాగమా లేక వేధించే ఉద్దేశమా ?
సిపిఎం త్రిస్సూర్‌ జిల్లా కమిటీ బ్యాంక్‌ ఖాతాను స్తంభింపజేయడం, ఎన్నికల సమయంలో పార్టీని వేధించేందుకు తీసుకున్న ముందస్తు చర్య. ఈ ఖాతా వివరాలు రాష్ట్ర స్థాయిలో ఏకీకతం చేయబడిన దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ ఖాతాల్లో భాగంగా ఉంది. ఇవి జాతీయ స్థాయిలో ఆదాయ పన్నుల శాఖకు, భారత ఎన్నికల కమిషన్‌కు చట్ట ప్రకారం సమర్పించడం జరుగుతుంది. వాటిని వారి వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. సంవత్సరం పొడవునా ఎలాంటి ఆక్షేపణలూ వ్యక్తం కాలేదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో ఇలా జరగడం రాజకీయ ప్రేరేపితంగా అర్థం చేసుకోవాలి. త్రిస్సూర్‌ నియోజకవర్గంలో బిజెపి పోటీ చేయడం యాదృచ్ఛికమా? ఖాతా స్తంభింపచేయడాన్ని ఖండిస్తూ…ఎన్నికల సమయంలో ఇలాంటి చర్యలకు అనుమతించి, ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాల కల్పనకు ఎలా విఘాతం కలిగిస్తారని అడుగుతూ భారత ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాశాం.

➡️