ఢిల్లీ నడిబొడ్డున పేరు మోసిన ఒక కోచింగ్ సెంటర్లో వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. సివిల్ సర్వీసు పరీక్షలకు మంచి కోచింగ్ సెంటర్గా ఆ సంస్థకు దశాబ్దాల చరిత్ర ఉంది. రాజధాని నగరంలో ఉన్న ఆ సెంటరు నిబంధనలకు వ్యతిరేకంగా భవనం బేస్మెంట్లో లైబ్రరీ నిర్వహిస్తోంది. విద్యార్ధులు ముగ్గురూ అందులో చిక్కుకుని మరణించిన వారే. ఎన్నో ఆశలతో, ఫీజులకు ఎంతో ధనం వెచ్చించి ఆ సంస్థలో చేరిన విద్యార్ధులు…సంస్థ నిర్వాహకుల అత్యాశ, అధికారుల అలసత్వం, అవినీతి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జీవితాల్ని కోల్పోయారు. బేస్మెంట్ని పార్కింగు కోసం లేదా స్టోర్రూమ్గా మాత్రమే వినియోగించాలని ఒక నిబంధన. దాన్ని లైబ్రరీగా మార్చి సొమ్ము చేసుకోవడం ఆ సంస్థ కక్కుర్తి. అలా ప్రాణాపాయం కలిగే అవకాశం ఉన్నా, నిబంధనల్ని అతిక్రమించినా పట్టనట్టు వ్యవహరించడం, లేదా లంచాలు తిని ఉపేక్షించడం నగర పాలక సంస్థ నిర్వాకం. ఆ సెంటరులోకి వరద నీరు ఒక్క ఉదుటున చేరడానికి కారణం యథేచ్ఛగా అక్రమ కట్టడాల్ని అనుమతించడం. డ్రయినేజీ వ్యవస్థ పూడుకునేంత వరకూ వదిలేయడం. అయితే ఈ సమస్య ఆ ఒక్క కోచింగ్ సెంటర్కో, ఆ ప్రాంతానికో పరిమితం కాదు. పుట్టగొడుగుల్లా నగరమంతా వ్యాపించిన కోచింగ్ సెంటర్లు, వాణిజ్య సముదాయాలు, అక్రమ కట్టడాలు…ఇలా పట్టణ ప్రణాళికల్ని తుంగలో తొక్కేవి కోకొల్లలు. అలాగే ఢిల్లీ ఒక్కటే ఇలా దయనీయంగా లేదు. దేశంలో ప్రతీ పట్టణమూ ఇలా అఘోరిస్తున్నవే. కొంచెం ఎక్కువ వర్షం పడితే చాలు. డ్రయినేజి పొంగి మునిగిపోయేవే. కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు వారు చేయాల్సిన పనులు వారు చేస్తే చాలు. ప్రమాద రహిత పట్టణాలు తయారవుతాయి. పట్టణ ప్రణాళికలు ఎలాంటి పరిస్థితిలోనూ అతిక్రమించ కూడదు. దురదృష్టవశాత్తూ నిబంధనల్ని అతిక్రమించడానికి రాజకీయాలు ప్రాతిపదిక అవుతున్నాయి. వాటి సాకు చెప్పి అధికారులు తప్పించుకోవడమో, సొమ్ము చేసుకుని పరిస్థితిని వాడుకోవడమో జరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితి మారనంత వరకూ నగరాలు నరకాలుగానే ఉంటాయి. స్మార్ట్ నగరాలు, ఆధునిక నగరాలు అన్నవి ఆదర్శంలోనే మిగిలి పోతాయి. రాష్ట్రాలకు పెరుగుతున్న ఒత్తిడి మేరకు కేంద్రం నిధులు, మార్గదర్శకాలు ఇవ్వాలి. రాష్ట్రాలు పట్టణాల అభివృద్ధిని దగ్గరగా పర్యవేక్షించాలి. నగర పాలక సంస్థలు సమర్ధవంతంగా వ్యవహరించాలి. అయితే అలాంటి రోజులు దగ్గరలో కనబడడం లేదు. ఢిల్లీ విషాదానికి స్పందనగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం రాజకీయ దాడులు చేసుకుంటున్నాయి. ఒక వ్యక్తిని అరెస్టు చేశారట. ఆయన ఆ కోచింగు సెంటరు ముందు కారు నిలిపి ఉంచడం వల్ల వరద నీరు అటువైపు మళ్లి బేస్మెంట్లో చేరి ప్రమాదానికి కారణమైనందుకు. సంస్థ నిర్వాహకులైన పెద్ద తలకాయల జోలికి ఎవరూ వెళ్ళలేదు. ఇదీ ప్రస్తుత స్థితి.
– డా.డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం, విజయనగరం.