రాష్ట్రంలో 1000 ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ మేనేజ్మెంట్ పాఠశాలల్లో ప్రస్తుతం అమలవుతున్న సిబిఎస్ఇ, ఈ విద్యా సంవత్సరంలో (2025) అమలు చేయబోయే పదవ తరగతి సిబిఎస్ఇ పబ్లిక్ పరీక్షలు, పరీక్షా విధానంపై, పరీక్షల అసెస్మెంట్, ఇంటర్నల్ అసెస్మెంట్, మూల్యాంకన విధానంపై ప్రభుత్వం సమీక్ష చేయాలి. సిబిఎస్సి పాఠశాలల్లో ఒకే పాఠశాలలో కొన్ని తరగతులకు స్టేట్ అకడమిక్ క్యాలెండర్, మరికొన్ని తరగతులకు సిబిఎస్ఇ క్యాలెండర్ అమలు చేయాలంటే కష్టతరం. సిలబస్ అందరికీ ఒకటే అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఒక పరీక్ష విధానం, సిబిఎస్ఇ గుర్తింపు ఉన్న పాఠశాలకు మరొక పరీక్ష విధానం సరైన నిర్ణయం కాదు. మరోవైపు ఇంటర్ బోర్డ్తో జూనియర్ ఇంటర్ తరగతులు ఉన్న సిబిఎస్ఇ పాఠశాలలైతే, ఒకే పాఠశాలలో మూడు వివిధ రకాలైన అకాడమిక్ క్యాలెండర్లు నడిపించాలి. ఇంతటి గందరగోళాన్ని సృష్టిస్తున్న ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలో ఉన్న 1000 సిబిఎస్ఇ పాఠశాలలో జరిగే పరీక్ష విధానంపై, ఇంటర్నల్ అసెస్మెంట్పై స్పష్టతనివ్వాలి. ఈ గందరగోళానికి తెర వేయాలి.
– బి. తిలక్, ఆదిత్య నగర్, శ్రీకాకుళం జిల్లా.