హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా పరాజయం పాలైన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇ.వి.ఎం) గురించి కాంగ్రెస్ తన ఆందోళనా స్వరాన్ని పెంచింది. ఎన్నికల సమగ్రతకు సంబంధించి చాలా అంశాలున్నాయి. వాటి పట్ల భారత ఎన్నికల సంఘం స్వచ్ఛంగా వుండాల్సిన అవసరముంది. ఇ.వి.ఎం లను ఎలక్ట్రానిక్ ట్యాంపరింగ్ చేసే ముప్పు ఈ జాబితాలోకి రాదు. కాంగ్రెస్ ఓ తప్పుడు అంశంపై గొంతెత్తుతోంది. అది కూడా ఎంపిక చేసుకున్న అంశాలపైనే, అందులోనూ ఓడిపోయిన వాటిపైనే మాట్లాడుతోంది. ఇ.వి.ఎం లకు సంబంధించి అవకతవకల ముప్పు వుందని సూచించేలా పరోక్షంగా లేదా ముందుగానే ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా ట్యాంపరింగ్ జరిగి వుంటుందన డానికి ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ నేతలే కొందరు బహిరంగంగా అభిప్రాయపడ్డారు. ఇద్దరు ప్రతిపక్ష నేతలు నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ కూడా ఈ ఆరోపణలతో తమకు సంబంధం లేదని విడగొట్టుకున్నారు. ఇ.వి.ఎం లలో చాలా కచ్చితంగా, తెలివిగా అవకతవకలకు పాల్పడ్డారని భావించేందుకు వీల్లేదు. ఎందుకంటే, కొన్ని రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధించింది, మరికొన్ని రాష్ట్రాల్లో ఓడిపోయింది. కాబట్టి ఇక్కడ ఆ లాజిక్ పని చేయడం లేదు. ఇదంతా కాకపోయినా 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి సంపూర్ణ మెజారిటీని సాధించలేకపోయింది. పైగా, ఈ ఫలితాలన్నీ మరీ ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు సామాజిక, రాజకీయ సమీకరణలు ఎలా పనిచేసినవో సరిగానే వివరించాయి.
ఇ.వి.ఎం లలో అవకతవకల గురించి పదే పదే లేవనెత్తడం ద్వారా ఎన్నికల సమగ్రతకు సంబంధించిన నిజమైన, తీవ్రమైన అంశాలు వెనక్కి పోతున్నాయి. ప్రతిపక్షాల పోలింగ్ ఏజెంట్లు లేని పోలింగ్ బూత్లలో, ఒక పార్టీ ఆధిపత్యమే వున్న చోట ఇ.వి.ఎం లను ఎత్తుకుపోవడానికి గల అవకాశాలనేవి వాటిలో ఒకటి. పోలింగ్ ముగిసే సమయంలో చాలా చోట్ల పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం నమోదు కావడంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇది సందర్భోచితమైన అంశంగా వుంది. ఈ ధోరణిని ఎన్నికల కమిషన్ సంతృప్తికరమైన రీతిలో వివరించడం లేదు. దీనికి తోడు పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు నమోదు కావడం, తొలగించడమనేది కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోన్న ధోరణిగా వుంది. ఎన్నికల కమిషన్ దీన్ని పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో, ముస్లిం ఓటర్ల పేర్లను ఎంపిక చేసి మరీ తొలగించినట్లు ఆరోపణలున్నాయి. యు.పి ఉప ఎన్నికల్లో, బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఊహించిన ఓటర్లను నిలువరించేందుకు పోలీసులు పక్షపాతంతో వ్యవహరించడం వివాదాస్పదమైంది. ఇక ఎన్నికల షెడ్యూలు అనేది మరో తీవ్రమైన అంశం. ఎన్నికల కమిషన్ దీనిపై పారదర్శకంగా వ్యవహరించడం లేదు. దేశంలో, రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న దేశం ఇటీవల మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించింది. దీనివల్ల లబ్ధి పొందింది బిజెపి మాత్రమే. ఈ అంశాల్లో కొన్ని స్థానికమైనవి, మరికొన్ని బిజెపి, ప్రతిపక్షం మధ్య గల సామర్ధ్య అంతరం భారీగా వుండడానికి సంబంధించినవి. మరికొన్ని ఎన్నికల కమిషన్ కోర్టులో వున్నవి. ఎన్నికల సమగ్రతకు సంబంధించిన వాస్తవిక అంశాలపై ప్రతిపక్షం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం వుంది. అంతేకానీ ఇ.వి.ఎం లపై భయాలు ఈ వాస్తవిక అంశాలను మరుగుపరిచేవిగా వుండకూడదు.
డిసెంబర్ 19 ‘హిందూ’ సంపాదకీయం