సోషలిస్టు క్యూబాకు సంఘీభావంగా… ఇంటికో కేజీ బియ్యం

ఫైడల్‌ కాస్ట్రో క్యూబా అధ్యక్షునిగా ఉన్న సమయమది.
క్యూబాలో వరి పంట పండదు. దేశమంతా కేవలం చెరకు తోటలే. అందువల్ల అక్కడ పంచదార ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతో క్యూబా ప్రభుత్వం ప్రతి సంవత్సరం తమ పంచదారను భారతదేశానికి పంపిస్తుంది. భారత్‌లో చెరకు తోటలకన్నా వరి పంట ఎక్కువ. దేశంలో ఎటు చూసినా వరి పొలాలే మనకు కనిపిస్తాయి. అందువల్ల క్యూబా, మన దేశం నుండి బియ్యం తీసుకెళ్లి, వాళ్ల పంచదార మనకు పంపిస్తుంది. అమెరికా ప్రభుత్వం, క్యూబా మీద కక్షతో…క్యూబాకి బియ్యం పంపిణీ ఆపేయాలని భారత ప్రభుత్వం మీద ఆంక్షలు విధించింది. దానికి మన ప్రధాని పి.వి.నరసింహారావు బియ్యం సప్లయి ఆపేశారు.
ఆ సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) దేశంలోని ప్రజా సంఘాలన్నిటికీ ఒక గొప్ప కార్యక్రమం ప్రకటించింది. అదేమిటంటే దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాలలోనూ, పార్టీ, ప్రజాసంఘాల కార్యకర్తలందరూ… ఒకే ఒక రోజు ఇంటింటికి తిరిగి …ఒక కేజి బియ్యం సేకరించాలి. ఆ కార్యక్రమం ఎంతో ఉత్సాహంతో జయప్రదమైంది. లక్షల క్వింటాళ్ల బియ్యం సేకరించింది కమ్యూనిస్టు పార్టీ.
పశ్చిమ గోదావరి జిల్లా మహిళాసంఘంగా మేం కూడా భీమవరంలో, మా మహిళా నాయకురాలు అమరజీవి సావిత్రమ్మ నాయకత్వాన నలభై మందిమి నాలుగు దళాలుగా ఏర్పడి ఒకే ఒక్క రోజు 40 క్వింటాళ్ల బియ్యం సేకరించాం. ఎంతో ఉత్సాహంగా ఆ కార్యక్రమం జరిగింది. అప్పుడు మా మహిళా సంఘానికి ఇన్‌ఛార్జి రుద్రరాజు సత్యనారాయణరాజు (ఆర్‌.ఎస్‌) గారు. ఆయనే మాకు ప్లాన్‌ ఇచ్చి ఆ బియ్యం సేకరణ కార్యక్రమం చేయించారు.
అప్పుడు కలకత్తా ఓడరేవు నుంచి రెండు ఓడల నిండా బియ్యం బస్తాలు నింపి జ్యోతిబసు ప్రభుత్వం క్యూబా పంపింది.
సోషలిస్టు క్యూబా, ప్రపంచ దేశాలకే మార్గదర్శిగా, ఏ దేశంలో ఏ కష్టం వచ్చినా మాతృమూర్తిగా ఆదుకుంటుంది. మహనీయుడు కాస్ట్రో అస్తమించినా నేటికీ ఆయన అడుగు జాడలలోనే క్యూబన్‌ ప్రభుత్వం నడుస్తోంది. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు, శత్రుదేశమైన అమెరికాతో సహా అన్ని దేశాలకు మందులను, తమ డాక్టర్లను పంపించి సహకరించింది. క్యూబాలో పదవ తరగతి వరకు విద్య, వైద్యం అందరికీ ఉచితమే. మార్క్స్‌ మహనీయుని కలల పంట క్యూబా. ఆ గొప్ప దేశానికి జేజేలు.

– అల్లూరి మన్మోహిని

➡️