కాలిపోయింది నోట్ల కట్టలా? న్యాయమా?

ఢిల్లీ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికార నివాసంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు కట్టలకొద్ది కాలిపోయిన నోట్లు కనిపించాయనే కథనాలు దేశంలో సంచలనం కలిగించాయి. న్యాయ వ్యవస్థలో అవినీతి పెరిగిపోతున్నదనే అభిప్రాయాలు అనేక సార్లు వ్యక్తమవుతున్నా కొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నా కోర్టు ధిక్కారం గురించిన సంకోచాలు, వ్యవస్థపై గౌరవం కారణంగా ఒక పరిధికి మించి అది చర్చకు రాలేదు. కానీ ఇప్పుడు మీడియాలో ఒక్కసారిగా ఈ ఉదంతం బయటికి రావడం, దానిపై నేరుగా భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా జోక్యం చేసుకుని ముగ్గురు హైకోర్టు సిజెలతో కమిటీని నియమించి విచారణ ప్రక్రియ ప్రారంభించడం, తగలబడినట్టు చెప్పబడే నోట్ల కట్టలను అత్యున్నత న్యాయస్థానమే పోస్టు చేయడం ఇవన్నీ సంచలనం కలిగించాయి. ఈ తరహా ఘటనలు గతంలో ఎప్పుడూ జరిగి వుండలేదన్నది వాస్తవం. ఇది న్యాయవ్యవస్థలో, నివేదించే మీడియాలో, పార్లమెంటులో రాజకీయ వర్గాల్లో అన్ని విధాల చర్చనీయమైంది. ఎప్పుడూ న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యల్లో ముందుండే రాజ్యసభ చైర్మన్‌ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధంకర్‌ దీనిపైనా తీవ్రంగా స్పందించడమే గాక అన్ని పార్టీలతో చర్చించే బాధ్యత బిజెపి అద్యక్షుడూ కేంద్రమంత్రి జె.పి. నడ్డాకు అప్పగించారు. అయితే గమనించాల్సినదేమంటే ఇప్పటికీ ఈ విషయమై న్యాయ వ్యవస్థ అంతర్గత పరిధిలో విచారణ ప్రక్రియ తప్ప మరే దర్యాప్తు మొదలు కాలేదు. జస్టిస్‌ వర్మపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని కోరుతూ మాథ్యూ జె.నెడుంపర అనే సీనియర్‌ న్యాయవాది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఓకా ధర్మాసనం కొట్టి వేసింది. విచారణ గురించిన వివరాలు తెలియరాకుండా దీన్ని చేపట్టడం తొండరపాటే అవుతుందని వ్యాఖ్యానించింది. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఒక మీడియా సదస్సులో పాల్గొంటూ సిజెఐ అనుమతి లేకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే ప్రశ్న ఉత్పన్నం కాదని ప్రకటించారు. మరోవైపున సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు కేంద్రం జస్టిస్‌ వర్మను ఆయన మాతృ స్థానమైన అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేసింది. కాని వర్మకు న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని అంతకు ముందు ఢిల్లీ హైకోర్టు సిజెను ఇప్పుడు అలహాబాద్‌ హైకోర్టు సిజెను కూడా ఆదేశించారు. సంచలన వార్తలు వచ్చాక అత్యున్నత జోక్యం తర్వాత కూడా జరుగుతున్నదేమిటనేది గానీ, ఏం చేయబోతున్నారనేది గాని స్పష్టత లేని పరిస్థితి ఏర్పడింది.

తప్పులకు రక్షణలు

జస్టిస్‌ వర్మ ఉదంతంలో కోర్టుల మల్లగుల్లాలు ఒకటైతే పాలక బిజెపి స్పందనలు మరో కోణంలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే గతంలోనూ కొన్ని అవినీతి ఆరోపణలూ, తీవ్ర వివాదాలు వచ్చిన ఉదాహరణలు వున్నాయి. కానీ నేరుగా చర్య తీసుకున్న సందర్భాలు దాదాపు లేవు. ఎందుకంటే పైకి ఏమి చెప్పినా పాలక వర్గాలు ఎప్పుడూ న్యాయ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే పాకులాడతాయి. చట్టం వ్యవస్థపై ఆధారపడి వుంటుంది గానీ వ్యవస్థ చట్టంపై ఆధారపడి వుండదని కారల్‌ మార్క్స్‌ చెప్పిన మాట ఎప్పుడూ మర్చిపోకూడదు. దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ హయాంలో ఒక విధంగా న్యాయ వ్యవస్థ ఒత్తిడికి గురైతే బిజెపి హయాంలో అది మరింత బాహాటంగా కళ్లకు కడుతున్నది. నిబద్ధ న్యాయ వ్యవస్థ (కమిటెడ్‌ జ్యుడిషియరీ) వుండాలనేది ఇందిరా గాంధీ తరచూ చెప్పిన మాట. ఆఖరుకు ఆమె ప్రకటించిన ఎమర్జెన్సీ రాజ్యానికి కూడా అప్పటి సుప్రీం కోర్టు ఆమోద ముద్ర వేసింది. ఎప్పుడూ ఆ విషయాన్ని వల్లించే బిజెపి హయాంలో ఇది మరింత దారుణంగా తయారైంది. పి.వి నరసింహారావు హయాంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామస్వామిని అభిశంసించేందుకు పార్లమెంటు చర్యలు తీసుకున్నా నాటి ప్రభుత్వం బయటపడేసింది. సిజెఐగా పనిచేసిన జస్టిస్‌ బాలకృష్ణన్‌పై ఆరోపణలు వస్తే కేంద్రం ఏ చర్యా తీసుకోలేదు. తర్వాత ఆయనకు మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ పదవి దక్కింది. బిజెపి హయాంలో కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సౌమిత్ర ఛటర్జీని కూడా అభిశంసించిన పరిస్థితి ఏర్పడితే ఆయన రాజీనామా చేసి బయటపడ్డారు. సిజెఐగా వుండగానే జస్టిస్‌ రంజన్‌ గొగోరు పాలనా నిర్వహణ తీరుపై సహచర న్యాయమూర్తులే తీవ్రంగా తిరగబడినా-ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు వచ్చినా సురక్షితంగా పదవీ కాలం పూర్తి చేసుకుని కొద్ది రోజులలోనే మోడీ సర్కారు నామినేషన్‌తో రాజ్యసభకు వెళ్లారు. ఇప్పటికే కార్పొరేట్‌ శక్తులు కాషాయ నేతలూ న్యాయ వ్యవస్థను అదుపులోకి తెచ్చుకోవాలని చూస్తున్న నేపథ్యంలో ఉన్నత న్యాయమూర్తులే ఆరోపణలకు గురవుతున్న స్థితిలో రాజ్యాంగ స్ఫూర్తితో ఈ సవాలును ఎదుర్కొనవలసి వుంటుంది.

కేంద్రానికి తాళాలివ్వాలా?

వివిధ పాలక పార్టీల నేతలూ ప్రభుత్వాలు ఆ యా సమయాల్లో తమ అనుకూలతను బట్టి న్యాయవ్యవస్థ క్రియాశీలతపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. లేదా కొనియాడుతుంటారు. న్యాయమూర్తులు కూడా పరిపరి విధాల స్పందిస్తుంటారు. నీతివంతమైన న్యాయమూర్తులు అనేకమంది ప్రజాస్వామిక స్ఫూర్తి, విశ్వసనీయత, ప్రజల పట్ల నిబద్ధత కోసం కృషి చేస్తుంటారు కూడా, అయితే పాలకవర్గ వ్యవస్థ తన వ్యూహాలకు అనుగుణంగానే అడుగులు వేస్తుంటుంది. ఇదే రాజ్యాంగ మౌలిక స్వభావం గురించిన ప్రస్తావన వచ్చినపుడు ఇదే థంకర్‌ కోర్టులపై దాడి చేయడం చూశాం. ఎప్పుడు ఎలాంటి వివాదం వచ్చినా న్యాయమూర్తుల నియామకం కేంద్రం చేతుల్లోకి తీసుకోవడమే పరిష్కారమన్నట్టు మాట్లాడేవారిని చూస్తుంటాం. చూడటమే కాదు, నిజంగానే న్యాయమూర్తుల నియామకం జాప్యం చేస్తూ ముప్పుతిప్పలు పెట్టడం వాస్తవం. ఈ విషయంలో మాజీ సిజెఐ డి.వై.చంద్రచూడ్‌ ధర్మాసనం గత సెప్టెంబరులో చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు కోర్టు ఆగ్రహాన్ని వెల్లడించాయి సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను పక్కన పెట్టడానికి కారణం ఏమిటి అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఎడతెగని ఆలస్యం చేసి గుండు గుత్తగా వెనక్కు పంపితే ఏమని అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టుకు జస్టిస్‌ సురేష్‌ కుమార్‌, పంజాబ్‌-హర్యానా హైకోర్టుకు జస్టిస్‌ శాంతాబాయి, జమ్మూ కాశ్మీర్‌ లడక్‌ హైకోర్టుకు జస్టిస్‌ తషి రబ్సాన్‌ను పంపించాలంటూ చేసిన సిఫార్సులను వెనక్కు తీసుకోవడానికి కూడా న్యాయస్థానం సిద్ధపడింది. మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా జాన్‌ సత్యంను సుప్రీంకోర్టు కొలీజియం 2022 ఫిబ్రవరిలో సిఫార్సు చేసింది. 2023 జనవరిలో పునరుద్ఘాటించింది. అయినప్పటికీ ఇవి జరగలేదు. జార్ఖండ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.సారంగి పేరును ఆలస్యంగా ఖరారు చేయడంవల్ల ఆయన 15 రోజులు మాత్రమే సిజెగా పని చేసి దిగిపోవాల్సి వచ్చింది! 2024 ప్రారంభంలో కొలీజియం పి.ఎం.మాధవన్‌ను కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక చేస్తే ఆయన సిపిఎం అభిమాని అనీ, రెండుసార్లు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఆయనను ప్రభుత్వ న్యాయవాదిగా నియమించిందనీ కేంద్రం సిఫార్సు వెనక్కు పంపింది. అయితే ఆయన సిపిఎం అభిమాని అనే వాదన అస్పష్టమైందని, లంకేశ్‌ చంద్రగౌరి బిజెపి లో ఆఫీసుబేరర్‌గా వున్నా 2023 ఫిబ్రవరిలో ఆమెను మద్రాసు హైకోర్టు న్యాయమూ ర్తిగా నియమించిన సందర్భాన్ని పేరు తీయకుండా కొలీజియం గుర్తుచేసింది. న్యాయ వ్యవస్థలో సంఘ పరివార్‌ పట్టు పెరిగిపోవడం, న్యాయమూర్తులు నిబంధనలను ఉల్లంఘించేలా వ్యాఖ్యలు చేయడం కూడా చాలాసార్లు చూశాం. కనుక న్యాయమూర్తుల నియామక అధికారం కేంద్రానికి అప్పగించడమే పరిష్కారమన్న వాదనలోనూ వాస్తవికత లేదు.న్యాయ విషయాలన్నిటిపైనా ఒక కమిషన్‌ ఆధ్వర్వం వహించాలన్న మౌలిక ప్రతిపాదనను కేవలం న్యాయమూర్తుల నియామకాలకు పరిమితం చేస్తూ ఎన్‌జాక్‌ (నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ జుడిషియల్‌ అపాయింట్‌మెంట్స్‌) మోడీ సర్కారు తీసుకొచ్చిన బిల్లును సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతనూ ప్రజాస్వామిక నియామక ప్రక్రియనూ సమతుల్యం చేయడం చాలా అవసరమనేది నిర్వివాదాంశం.

కింకర్తవ్యం?

న్యాయమూర్తులలో యాభై శాతం మంది అవినీతిపరులున్నారని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఖట్జూ ఒకసారి వ్యాఖ్యానించారు. దానికి ఆయన విచారణకు కూడా హాజరైనారు. ఇదే అలహాబాదు హైకోర్టు నుంచి వచ్చిన ఖట్జూ అవినీతిపరుల జాబితా ఒకటి అప్పటి సిజెఐ లహోటీకి ఇచ్చానని కూడా చెప్పారు. వారి అవినీతిని తాను వెల్లడిస్తానంటే సిజెఐ వద్దని వారించారని ఖట్జూ పేర్కొన్నారు. తాజాగా ఒక కార్పొరేట్‌ సంస్థకు అనుకూలంగా తీర్పులు చెప్పినట్టు ఆరోపణలకు గురైన ఒక న్యాయమూర్తిపై లోక్‌పాల్‌ విచారణకు ఆదేశాలిస్తే నిబంధనలు ఒప్పుకోవంటూ సుప్రీం కోర్టు అడ్డుపడింది. ఇక్కడ లోక్‌పాల్‌గా వున్నది కూడా సుప్రీం మాజీ జడ్జి ఖాన్విల్కర్‌ కావడం గమనించదగింది. కనుక జస్టిస్‌ వర్మపై ఆరోపణలు గానీ, వాటిపై విచారణ ప్రహసనం గానీ ఆశ్చర్యం కలిగించదు. ఈ వ్యవహారంలో ఇప్పటికే అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అసలు ప్రమాదం, అగ్నిమాపక బృందాలు వెళ్లడం మార్చి 14 రాత్రి జరిగితే వారికి కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయన్న అనధికారిక కథనాలు 21న గానీ బయటకు రాలేదు. ఆ తర్వాత అగ్నిమాపక అధికారులు నోట్ల కట్టలు కనిపించినట్టు తాము చెప్పలేదని తమతో చెప్పినట్టు పిటిఐ వార్త ఇచ్చింది. తర్వాత సదరు అధికారి అతుల్‌ గార్గ్‌ తాము ఆ మాట తను చెప్పింది కాదని వివరణ ఇచ్చారు. ఇక నోట్ల కట్టలు పెట్టిన గదులు అందరూ వాడుకునేలా వుంటాయని జస్టిస్‌ వర్మ వివరణ ఇస్తే అందుకు భిన్నంగా దానికి ఎప్పుడూ తాళాలు వేసి వుంటాయని భద్రతా సిబ్బంది చెప్పారు. వర్మను బదిలీ చేయడానికి ఈ విచారణకూ సంబంధం లేదని ఆగమేఘాల మీద స్పష్టత విడుదల చేసిన సుప్రీంకోర్టు కేంద్రం ఒప్పుకున్నాకే బదిలీ ఖరారు చేసి న్యాయ విధులకు దూరం పెట్టింది. మరోవైపున ఆయనను తమ మీద మళ్లీ ఎందుకు రుద్దుతున్నారని అక్కడ బార్‌ అసోసియేషన్‌ ఆందోళనకు దిగింది. ఏమైనా విచారణ జరిపే న్యాయమూర్తుల బృందం నివేదిక అందేవరకూ ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేసే అవకాశం కనిపించడం లేదు. ఈ లోగా జస్టిస్‌ వర్మ న్యాయవాదుల సలహాలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఆయన రాజీనామా వంటివి చేస్తారేమో తెలియదు. కనుక ఈ ఉదంతంలో చివరకు జరిగేదేమిటో వేచి చూడవలసిన అంశాలు చాలా వున్నాయి. న్యాయమూర్తుల మంచి చెడ్డల చర్చగా గాక న్యాయ వ్యవస్థలో రావలసిన మౌలిక సంస్కరణలు, మరో వైపు దాని స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడం ఇక్కడ కీలకం. వ్యక్తిగతంగా న్యాయమూర్తుల లేదా న్యాయాధికారుల అవినీతి ఒకటైతే క్విడ్‌ ప్రోకో తరహాలో పాలకులు ఆ వ్యవస్థతో అనధికార అవగాహనకొచ్చే పరిస్థితిని నివారించడం మరింత ముఖ్యం. జస్టిస్‌ వర్మ ఉదంతం చివరకు ఎలా ముగుస్తుందో చూశాక మరింత లోతైన చర్చ చేయవలసి వుంటుంది.

తెలకపల్లి రవి

➡️