పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో పలువురు సిబ్బంది, ప్రయాణికుల మరణించడం, గాయాల పాలవడం బాధాకరం. సరిగ్గా ఏడాది కిందట చోటుచేసుకున్న అత్యంత ఘోరమైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో 296 మంది మరణించి 1100 మందికి పైగా గాయపడిన ఘటనను మరువక ముందే దేశవ్యాప్తంగా పలు దుర్ఘటనలు జరిగాయి. కచ్చితంగా చెప్పుకోవాలంటే ఒడిషా రైలు ప్రమాదం నుండి తేరుకోకముందే 40 ప్రమాదాలు జరిగాయి. నిర్వహణా లోపాల కారణంగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాక్లపై ఒత్తిడి పెరుగుతున్నదని, భద్రతా చర్యలు చేపట్టడం లేదని నిపుణులు ఎన్నిమార్లు మొత్తుకున్నా పాలకులు పెడచెవిన పెడుతున్నారు. పాఠాలు నేర్వడానికి, చర్యలు తీసుకోవడానికి సిద్ధపడడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదానికి కూడా సిగల్ వ్యవస్థ పని చేయకపోవడం, కవచ్ రక్షణ వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణాలు కావడం పాలకుల నిర్లక్ష్యంగాక మరేమిటి? ప్రజల ప్రాణాల పట్ల పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో దీనినిబట్టే తెలిసిపోతోంది.
రైల్వేలు ప్రజల ఆస్తి. ప్రజల సొమ్ముతో భారత కార్మికుల శ్రమతో భారతీయ రైల్వేలు నిర్మితమయ్యాయి. రైళ్ళు, రోడ్లు సామాన్య ప్రజలకు సరసమైన రవాణాను అందించడానికి ఉద్దేశించినవి. ఏ ప్రభుత్వమైనా తన పౌరులకు సరసమైన ధరలకు భద్రతతో అందించాల్సిన సేవలివి. అంతేగాని ప్రైవేటు కార్పొరేట్లకు లాభాలను ఆర్జించి పెట్టేలా భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించకూడదు.
‘కాగ్’ నివేదికను పట్టించుకోరే!
రైళ్ళు ప్రయాణించే ట్రాక్లు, సిగలింగ్ వ్యవస్థను నియంత్రించే ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో పొరపాటు కారణంగా బాలాసోర్ ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డు, రైల్వే మంత్రి పేర్కొన్నారు. 2017-21 మధ్య కాలంలో రైళ్ళు పట్టాలు తప్పిన ఘటనలపై కాగ్ ఇచ్చిన నివేదిక ఆ వ్యవస్థలో ఉన్న కొన్ని ప్రమాదకరమైన లోపాలను ప్రముఖంగా ఎత్తిచూపింది. రైల్వే ట్రాక్లలోని నిర్మాణపరమైన లోపాలను, అలాగే పాయింట్లు, లైన్లు, కర్వ్లు వంటి అంశాలను తనిఖీ చేసి అంచనా వేసే ట్రాక్ రికార్డింగ్ కార్ల సోదాలు 30-100 శాతం తగ్గాయని ఆ నివేదిక పేర్కొంది. పట్టాలు తప్పిన 1129 ఘటనల్లో 422 ఘటనలు ఇంజనీరింగ్ సమస్యలు (ట్రాక్ల నిర్వహణ సరిగా లేకపోవడం (171 కేసులు), ట్రాక్ ప్రామాణికాలు పాటించకపోవడం (156 కేసులు) వల్లే జరిగాయని పేర్కొంది. బోగీల చక్రాల్లో లోపాల వల్ల జరిగిన ప్రమాదాలు 182 ఉండగా, పాయింట్లు సరిగా నిర్దేశించక పోవడం, ఇతర పొరపాట్ల కారణంగా 275 ప్రమాదాలు జరిగాయని నివేదిక పేర్కొంది.
జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) రికార్డుల ప్రకారం గడిచిన పదేళ్లలో జరిగిన రైలు ప్రమాదాల్లో 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 70 శాతం మంది 2017- 21 మధ్య కాలంలో మరణించారు.
‘భద్రత’కు భరోసా ఏదీ?
ప్రారంభించిన రైలునే ప్రధాని మోడీ అట్టహాసంగా మళ్ళీ ప్రారంభించే బదులు సామాన్యులు ప్రయాణించే రైళ్ల బాగోగులు పట్టించుకోవాలి. కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణే అన్నింటికీ పరిష్కారం అనే మానసిక స్థితి నుండి బయటపడి వాస్తవాలను గమనించి ప్రజల భద్రతకు ఏం చేయాలో తెలుసుకుని ఇప్పటికైనా పూనుకోవాలి. బాధితులకు ఓదార్పునివ్వాలి. ప్రతి వందేభారత్ రైలు కోసం రైల్వే రూ.115 కోట్లు పైగా వెచ్చిస్తున్నది. 2027 తర్వాత ప్రారంభమయ్యే బుల్లెట్ ట్రైన్ వంటి అసాధారణ రేట్లుండే రైళ్ళతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగేదేముంటుంది? గతంలో రైల్వే అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించేవారు. ఇప్పుడు ఆ పద్ధతీ నిర్వీర్యమైపోయింది. వీటన్నింటి ఫలితంగా ప్రజల భద్రత మరింత ప్రమాదంలో పడింది.
2011-12లో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్’ను నెలకొల్పకపోవడం, సిగలింగ్ టెలీ కమ్యూనికేషన్ కింద కేటాయించిన బడ్జెట్ లోంచి…అత్యధికంగా ట్రాఫిక్ ఉన్న రైల్వే మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగలింగ్, సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ కంట్రోల్ తదితరాలకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయకపోవడం, రైల్వే లైన్లు-సిగల్ వ్యవస్థ-ట్రాకుల ఆధునీకరణ చేపట్టకపోవడం శోచనీయం.
ఖాళీ పోస్టుల భర్తీ
రైల్వేలలో కనీస అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రయాణికుల భద్రత ఎలా సాధ్యం? సాధారణ ప్రయాణికుడిని విస్మరిస్తూ ఆదాయాన్ని గడిస్తున్న రైల్వే శాఖలో ఖాళీగా వున్న 3.11 లక్షల గ్రూప్ సి పోస్టులు, గెజిటెడ్ క్యాడర్కి సంబంధించి శాంక్షన్ అయిన 3,018 పోస్టులు భర్తీకి నోచుకోలేదు. దీంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో మిగిలిన ఉద్యోగులపై విపరీతమైన పని భారం పడుతున్నది. ఈ కారణంగా అనేక మంది మహిళా లోకో పైలట్లు, ఇతర సిబ్బంది రోజుకు 12 గంటలకు మించి సెలవు/విశ్రాంతి లేకుండా నిద్ర లేమితో, బిజీ షెడ్యూళ్లతో పని చేయాల్సి వస్తోంది. రైల్వేలో పని చేస్తున్న సుమారు 8 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు, సురక్షిత పని పరిస్థితులు, చట్టబద్ద హక్కులను కోల్పోయారు. ప్రశ్నిస్తే సస్పెన్షన్లు, బదిలీలు, శిక్షలు వంటి సమస్యల మధ్య రైల్వే సిబ్బంది పని చేస్తున్నారు.
దిద్దుబాటు చర్యలు
ప్రభుత్వం చేస్తున్న వాదనలు తన స్వంత ఆడిటర్ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (కాగ్) నివేదికలో చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. ట్రాక్ల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు తగ్గిందనీ, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించడం లేదని కాగ్ పేర్కొన్నది. 2017-2021 మధ్య జరిగిన రైల్వే ప్రమాదాలపై కాగ్ విశ్లేషణ ప్రకారం ఈ కాలంలో మొత్తం 2017 ప్రమాదాలు జరిగాయి. అందులో పట్టాలు తప్పిన ప్రమాదాలు 1392 (69 శాతం). అంటే పట్టాలు తప్పి ఢకొీనటం వంటి రైల్వే ప్రమాదాలే అధికంగా ఉండటం గమనార్హం. అయితే ఈ ప్రమాదాలకు కారణం ‘మానవ తప్పిదం’ అని నిందించటం ఒక ధోరణిగా మారింది. నిజానికి ఈ విధమైన ప్రభుత్వ వాదనలు తప్పని కాగ్ నివేదిక నిరూపిస్తున్నది. ట్రాక్ల నిర్వహణ, బడ్జెట్ కేటాయింపులు, వ్యయం, పోస్టుల ఖాళీలపై కేంద్రానిది తీవ్ర నిర్లక్ష్యమని కాగ్ 2022 సెప్టెంబర్ నివేదికలో అక్షింతలు వేసినా, రైల్వే భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా, లోపాలు ప్రస్తావించినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు.
ట్రాక్ నిర్వహణ లోపాలు
2017-18లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ (ఆర్.ఆర్.ఎస్.కె) రైల్వే భద్రతా నిధి గురించి కాగ్ ఉటంకించింది. దీని ప్రకారం 1127 పట్టాలు తప్పగా 289 (26 శాతం) మాత్రమే పునరుద్ధరణ పనులకు నోచుకున్నాయి. ట్రాక్ పునరుద్ధరణ పనులకు 2018-19లో నిధుల కేటాయింపు రూ.9607.65 కోట్ల నుంచి 2019-20లో రూ.7417 కోట్లకు తగ్గింది. అత్యంత రద్దీగా ఉండే పశ్చిమ రైల్వే కోసం 2019-20లో మొత్తం వ్యయంలో ట్రాక్ పునరుద్ధరణ కోసం ఖర్చు చేసినది 3.01 శాతమే కావటం గమనార్హం. భద్రతకు సంబంధించిన పనులకు ఆర్థిక సాయం అందించటానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్న ఏకైక లక్ష్యం కూడా నెరవేరలేదు. పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం ట్రాక్ నిర్వహణ లోపాలేనని వివరించింది. భారత రైల్వే లక్షలాది పోస్టుల ఖాళీలతో, నామ మాత్రపు అవుట్ సోర్సింగ్తో కార్యకలాపాలను నిర్వహించిందని కాగ్ వెల్లడించింది.
ట్రాక్ల సమర్థవంతమైన నిర్వహణ, సిగలింగ్ వ్యవస్థ…మొదలైన వాటితో పాటు తగిన సంఖ్యలో నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించడాన్ని నిర్లక్ష్యం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా రైల్వే వ్యవస్థ నిర్వహణ వివిధ విధుల మధ్య సమర్థవంతమైన సమన్వయంపై ఆధారపడి వుంటుంది. ఇది కూడా నిర్లక్ష్యానికి గురైంది. భద్రతపై 2017లో సమర్పించిన టాస్క్ఫోర్స్ సిఫార్సులను అమలు చేయలేదు. పాత ట్రాక్ను యుద్ధ ప్రాతిపదికన మార్చాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక వనరుల లేమి సాకుతో చేయకపోవడంతో బ్యాక్ లాగ్ పెరుగుతూనే ఉన్నది. అదే సాకుతో పాతబడిపోయిన సిగల్ గేర్ను కూడా మార్చటం లేదు.
తక్షణం చేయాల్సినవి…
రైల్వే భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించాలి. వ్యవస్థాగత లోపాలను సరిదిద్దాలి. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐ.ఆర్.ఎమ్.ఎస్) పేరిట ప్రవేశపెట్టిన స్కీం గురించి పునరాలోచన చేయాలి. కాగ్, పార్లమెంటరీ ప్యానెల్, నిపుణుల సిఫార్సులను అమలు పరచాలి. భద్రతకు విఘాతం కలిగించే విధానాలను విడనాడాలి. రైలు ప్రమాదాలపై సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో స్వతంత్ర విచారణ జరిపించాలి. రైల్వేలో శాంక్షనై ఖాళీగా ఉన్న 3,15,780 పోస్టులను భర్తీ చేయాలి. రైల్వే బడ్జెట్లో కోతలు పెట్టకూడదు. అంతేగాక, చార్జీల పెంపు, స్లీపర్ కోచ్ల తగ్గింపు, రైళ్ళలో రద్దీ, జాప్యం, రాయితీల ఎత్తివేత, శానిటేషన్, పార్కింగ్ దోపిడీ తదితర సమస్యలను సైతం సత్వరం పరిష్కరించాలి.
– వ్యాసకర్త : వి.కృష్ణమోహన్, జాతీయ చైర్మన్,
కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సిసిజిజిఒఒ)
సెల్ : 9182189533, /