ఒక లోతైన తాత్విక చింతనతో, నిగూఢమైన భావావేశంతో జలపాతంలా సాగిపోయిన…ప్రసిద్ధ హిందీకవి, పద్మభూషణ్ డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ కావ్యం ‘మధుశాల’ నన్ను ఆకట్టుకుంది. దాన్ని ఎలాగైనా తెలుగు పాఠకులకు అందించాలని తహతహలాడాను. కానీ, నేనేమో భాషా పండితుణ్ణి కాదు. హిందీ మూలంలో ఉన్న ఆ లయలు, హొయలు తెలుగులోకి తెచ్చేదెట్లా? అదే భావాన్ని తెలుగు వచన కవిత్వంలోకి మారిస్తే బావుండదు. తేలిపోతుంది. మరి ఎలా? ఎలా అని కూర్చుంటే లాభం లేదు. శ్రమించాల్సిందే. సాధించాల్సిందేనని కొన్ని నెలలపాటు నేను మధుశాల వెంటపడ్డాను. ఇకనేం, ఆ తర్వాత అదే నా వెంటపడుతూ ఇదిగో ఇలా వచ్చింది.
కోరుకున్న మధువేదైతే ఉందో అందలేదు నాకిప్పటికి / కోరుకున్న మధుపాత్రా అంతే, అందదు కద నాకెప్పటికి / వెర్రివాడి వలె వెంట పడితినా? అయినా అందదు ఆ సాకీ / పిచ్చివాడి వలె ఎంత తిరిగినా అందదు అందని మధుశాల.
మధువు ఇతివృత్తంగా గొప్ప కవిత్వం పండించిన హరివంశ్ రారు తాగుడుకు అలవాటు పడలేదు. అంతేకాదు, ఆయనకు మధువు రుచి కూడా తెలియదన్న విషయం తెలుసుకున్నాక, ఆయనపై ఒక గౌరవభావం కలిగింది. మధుశాల-అంటే ఇక్కడ కేవలం మధుశాల కాదు. ఒక ధ్యేయానికి, ఒక గమ్యానికి అది సంకేతం! ధ్యేయాన్ని బట్టి ఒక్కొకరి మధుశాల ఒక్కో రకంగా మారుతూ ఉంటుంది. నీ హృదయపు లోతెందుందో మధుపాత్రలో లోతంతుంటుంది. నీ మనసున మత్తెంతుందో మధువున మత్తంతుంటుంది. నీ భావుకత అందం ఎంతో సాకీ అంతటి సుందరము.
ఎవ్వడెంతటి రసికుడు అయితే, అంతటి రసమయము మధుశాల. డాక్టర్ హరివంశ్ రారు బచ్చన్ 1907-2003 మధ్యకాలంలో 96 ఏళ్లపాటు జీవించాడు. 30 కవితా సంపుటాలు ప్రచురించాడు. మరో 50 ఇతర గ్రంథాలు రాశాడు. ఆయన ఆత్మకథ నాలుగు సంపుటాలుగా వెలువడింది. 1935లో ప్రకటించిన ‘మధుశాల’ ఆయనకు జగద్విఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆయన ‘మధుబాల’, ‘మధు కలష్’ కావ్యాలు కూడా ప్రకటించాడు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్ సాధించిన మొదటి భారతీయుడీయన. నాటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ప్రేమ పాత్రుడయ్యాడు. లెక్చరర్గా, ఆకాశవాణి ప్రోగ్రాం ప్రొడ్యూసర్గా ఉన్నవాడల్లా నేరుగా భారత విదేశాంగ శాఖలో ఉన్నత పదవికి ఎంపికయ్యాడు. హిందీ మన రాష్ట్ర భాష కావడానికి ముఖ్యమైన భూమికను పోషించాడు. హిందీ సాహిత్య రంగంలో ‘హాలా వాదాన్ని’ (మధువాదాన్ని) ప్రతిపాదించి, పోషించినవాడిగా పేరు గడించాడు.
హిందూ ముస్లిం వేరైనా మధుపాత్ర ఒక్కటే తాగేది/మధువూ ఒకటే సాకీ ‘ఒకటే’ మధుశాల ఒకటే వెళ్లేది /మందిరమైనా మసీదైనా వెళ్లేవరకూ ఇద్దరు-ఒకటే /విడగొట్టేవే మందిర్ మసీద్, మనసులు కలిపేదే మధుశాల.
‘హాలా – అంటే మధువు. మనిషి తనకు కావాల్సిన దాన్ని వెతుక్కోవడంలోనే ఆనందం పొందుతూ ఉంటాడు. ‘మధువు’ అంటే మధువే కానక్కర్లేదన్నది ఆయన చెప్పే అంతరార్థం. ఉమర్ ఖయ్యాం, గాలిబ్, జఫర్, మీర్, కులీ, వలీ వంటి ఉరుదూ మహాకవుల అడుగు జాడల్లో, వారి బాణీలో మధువు – మధుపాత్ర – సాకీ- మధుశాల వంటి పదాలనే వాడుతూ – వారికి భిన్నంగా సమకాలీన జీవితం, తాత్వికత, దేశభక్తి, మత సామరస్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక విషయాలపై ఆయన కవితలల్లారు. ఉదాహరణకు ఈ కింది కవితా చరణాలు గమనించండి. విషయం అర్థమవుతుంది.
హిమశ్రేణులే ద్రాక్షాలతలు హిమజలమే ప్రవహించే మధువు/నదులన్నీ సాకీ హొయలవగా కెరటాలే మధుపాత్రలు కాగా /తాగిన మత్తులో పచ్చగ ఊగెను పంట పొలాలు కాలం గతిలో/ప్రపంచానికిది ఆదర్శం వ్యవసాయ భారతం మధుశాల.
ధీరపుత్రుల హృదయ రుధిరమే అయినది నేడు రక్తపు మధువు/దేశభక్తుల ఆశీస్సుల మధుపాత్ర తీసుకుని ముందుకు నడువు/అతి ఉదారము గుణము భారతిది, త్యాగశీలి సాకీ /బలికోరే స్వాతంత్రమే కాళిక – ఇక బలి వేదిక మధుశాల – ఇలా విషయమేదైనా దాన్ని మధుశాల పరిధిలోకి లాగి, అత్యద్భుతమైన పద చిత్రాలతో రక్తి కట్టించడం-హరివంశ్ రారు సాధించగలిగాడు. విశ్వమానవ కుటుంబాన్ని ఆయన ఇలా ఒకచోట నమోదు చేశాడు.
మనమవుదాం ఇక పరస్పరం, ఒకరికి ఒకరం మధుశాల/ధ్యేయపు దారి పట్టుకు వెళితే గమ్యం కాదా మధుశాల?/కళ్లకు కనబడునది ఏదైనా, ఇక కళ్లలో ఉన్నది మధుశాల/ అంతట కనబడు అన్ని వేళలా- విశ్వవ్యాప్తమిది మధుశాల!
హరివంశ్ రారు బచ్చన్ నవంబర్ 27, 1907న అలహాబాదు దగ్గర్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. వారిది ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం. వారి వంశంలో కొనసాగుతూ వస్తున్న ఆచారం ప్రకారం కాయస్తు పాఠశాలలో ఉరుదూ చదువుకుని, 1925లో మెట్రిక్యులేషన్, 1929లో ప్రథమ శ్రేణిలో బి.ఏ (అలహాబాదు విశ్వవిద్యాలయం), తర్వాత బి.టి, మరికొంత కాలానికి బనారస్ విశ్వావిద్యాలయం నుండి యం.ఎ. పూర్తిచేశాడు. మధ్య కాలంలో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ సమయంలోనే గాంధీజీ అనుచరుడిగా మారి, దేశ స్వాతంత్రోద్యమంలోకి దూకాడు. 1941-52 మధ్య కాలంలో అలహాబాదు యూనివర్సిటీలో ఇంగ్లీషు బోధించాడు. తర్వాత రెండేళ్లు కేంబ్రిడ్జిలోని సెయింట్ కేథరిన్ కాలేజిలో డాక్టరేట్ సాధించి, స్వదేశం తిరిగి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా మధుశాల, మధుబాల, మధుకలష్ వంటి అనేక కవితా సంపుటాలు 1932-1961 మధ్యకాలంలో ప్రకటించాడు.
నిజానికి హరివంశ్రాయ్ సాహిత్య రంగ ప్రవేశం 1930లో కథా రచనతో ప్రారంభమైంది. మూడు నాలుగేళ్లు కథలు రాశాడు. మొదటి కథా సంపుటి రాత ప్రతిని ‘హిందుస్థానీ అకాడెమీ’కి పంపాడు. కానీ, వారు దాన్ని తిరుగు టపాలో తిప్పిపంపారు. ఉక్రోషంతో ఆయన రాతప్రతిని చెత్తబుట్టకు సమర్పించి, కథారచనకు స్వస్తి చెప్పాడు. తర్వాత కవితా ప్రక్రియలో కృషి ప్రారంభించి జనవరి 1932లో ‘తేరా హార్’ తొలి కవితా సంపుటి ప్రకటించాడు. క్యా భూలూ క్యా యాద్ కరూ’ ‘నీడ్ క నిర్మాణ్’, ‘ఫిర్ బసేరేసే దూర్’, ‘దశ్ ద్వార్ సే సోపాన్ తక్’ అనే శీర్షికలతో ఆత్మకథ నాలుగు సంపుటాలలో వెలువరించాడు. ఈ నాలుగింటి సారాంశం క్లుప్తంగా ‘ఇన్ ది ఆఫ్టర్నూన్ ఆఫ్ టైమ్’ శీర్షికతో ఇంగ్లీషులో వెలువడింది. దానికే ఆయనకు సరస్వతీ సమ్మాన్ (1991) లభించింది.
హరివంశ్ రాయ్ తన యాభైయ్యేళ్ల్ల సాహిత్య జీవితంలో కొన్ని ముఖ్యమైన అనువాదాలు కూడా చేశారు. ఉమర్ ఖయ్యాం, వై.బి.ఈట్స్లను హిందీలోకి అనువదించాడు. హిందీ సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషికి సాహిత్య అకాడెమీ అవార్డు, సోవియట్ ల్యాండ్ అవార్డు, ఆఫ్రో ఏసియన్ రచయితల సమాఖ్యవారి లోటస్ అవార్డు, సరస్వతి సమ్మాన్ వంటి అత్యున్నత పురస్కారాలు స్వీకరించిన హరివంశ్ రాయ్ కి 1976లో భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ ప్రకటించి గౌరవించింది. 1966లో రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. 2003లో భారత తపాలా శాఖ పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. ”నా కవిత్వం మోహంతో మొదలై, మోహ బంధంతో ముగిసింది”-అని హరివంశ్ రాయ్ తన ఆత్మకథలో చెప్పుకున్నాడు. 19వ యేట 14 ఏళ్ల శ్యామను పెళ్లాడితే ఆమె టి.బితో చనిపోయింది. అందువల్ల, 14 ఏళ్ల తర్వాత 1941లో తేజి సూరి అనే సిక్కు యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడున్న బచ్చన్లు ఆమె సంతానమే.
(జనవరి 18న హరివంశ్ రాయ్ వర్థంతి)
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత,జీవ శాస్త్రవేత్త /డా|| దేవరాజు మహారాజు