గత ప్రభుత్వం 6100 బోధనా స్థానాల కోసం జారీ చేసిన ఎ.పి డిఎస్సీ నోటిఫికేషన్-2024లో చాలా లోపాలు ఉన్నాయి. ఈ నిర్ణయాలు నిరుద్యోగుల్లో గణనీయమైన ఆందోళనలు కలిగించాయి. తక్కువ పోస్టులతో టీచర్స్ నోటిఫికేషన్ విడుదల చేయడమే కాకుండా నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు రెండు సంవత్సరాల బోధన, శిక్షణ కాలంలో కేవలం నామమాత్రపు భృతిని మాత్రమే పొందేలా గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల వలన అనేకమంది నిరుద్యోగుల ఆశయాలకు అన్యాయం జరిగింది. అనేక ఉపాధ్యాయ ఉద్యమాలు, పోరాటాలు ద్వారా సాధించుకున్న హక్కు ఈ ”అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయడం”. ఈ విషయాన్ని విస్మరించిన గత ప్రభుత్వం టీచర్స్ రిక్రూట్మెంట్లో అప్రెంటిస్ విధానాన్ని తెర మీదకు తెచ్చి షాక్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఈ షరతులను పున:సమీక్షించి, గత నోటిఫికేషన్ అప్రెంటిస్ నిబంధనలను రద్దు చేసి, ఈ అభ్యర్థుల గౌరవాన్ని, హక్కులను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా, మెగా డిఎస్సీ ద్వారా ప్రాథమిక విద్యారంగాన్ని కాపాడాలి. మాతృభాషలోనే బోధన ద్వారా ప్రాథమిక విద్యారంగాన్ని బలపరచాలి. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ప్రిన్సిపాళ్ల పాత్ర విస్తృత అనుభవం, నైపుణ్యాలను డిమాండ్ చేస్తుంది. కనుక ఈ ప్రిన్సిపాళ్ల స్థానాలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 164 ఎ.పి మోడల్ పాఠశాలల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల ఖాళీలు ప్రభుత్వ మేనేజ్మెంట్ ద్వారా డిఎస్సీ-2024లో చేర్చాలి. ప్రస్తుతం పాఠశాల విద్యా విభాగం పరిధిలో ఈ మోడల్ పాఠశాలలు ఉన్నాయి.
– బడగల సురేష్,
అరసవల్లి, శ్రీకాకుళం జిల్లా.
