పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత పకడ్బందీగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్టు సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు మరణించారన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో మన సైన్యానికి ఎటువంటి నష్టం జరగలేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకే)లో, పాకిస్తాన్లోనూ ఉగ్రవాద శిబిరాలను, వాటి మౌలిక సదుపాయాలను దెబ్బతీసే లక్ష్యంతో సాయుధ దళాలు ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేేశించుకుని వాటిపై కేంద్రీకృతంగా దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది. దాడుల అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. పిఓకెేలోని 5, పాకిస్తాన్లోని 4 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడంతో పాటు, గతంలో పూంచ్లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు శిక్షణ పొందిన కోట్లీలోని గుల్పూర్ స్థావరంపై చేసిన దాడి దృశ్యాల వీడియోను కూడా వారు ప్రదర్శించారు. ఇదొక్కటే కాదు. లాహోర్కు 40 కి.మీల దూరంలోని మురిద్కేలోని లష్కరే తోయిబాకు చెందిన స్థావరాన్ని కూడా ధ్వంసం చేసినట్లు, ఇక్కడ 26-11 ముంబాయి దాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ శిక్షణ పొందినట్లు వారు చెప్పారు. మొత్తం 21 స్థావరాలను గుర్తించగా, అందులో తొమ్మిది స్థావరాలను లక్ష్యాలుగా చేసుకుని, విజయవంతంగా దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది.
ఇరవై ఆరుమంది పర్యాటకుల ప్రాణాలు బలిగొన్న పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ దాడికి కారకులైన ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల, మతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా ప్రజానీకం డిమాండ్ చేసింది. ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఉగ్రవాదులు లక్ష్యంగా తీసుకునే అన్ని చర్యలకు మద్దతు ప్రకటించింది. ఉగ్రవాదులపైనా, వారికి సహకరించే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశానికి హాజరైన అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. తాజాగా ‘ఆపరేషన్ సిందూర్’లో ఉగ్రవాదులపైనే గురిపెట్టి లక్షిత దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది. ఆ కారణంగానే పాకిస్తాన్లోని సాధారణ ప్రజానీకానికిగాని, సైన్యానికిగాని ఎటువంటి హాని జరగలేదని వివరించింది.
పహల్గాం ఉగ్రదాడికి ముందే కాశ్మీర్లో ఆ తరహా సంఘటనలు చోటుచేసుకునే అవకాశం గురించి నిఘా వర్గాలు హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని వార్తా కథనాలు వస్తున్నాయి. ఆ హెచ్చరికల నేపథ్యంలోనే ప్రధాని కాశ్మీర్ పర్యటన రద్దయ్యిందని, అయితే, పహల్గాంలో పర్యాటకుల భద్రతను మాత్రం గాలికొదిలేశారన్నది ఈ కథనాల సారాంశం! వీటిపై వివరణ రాలేదు. మరోవైపు పహల్గాంలో నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. వారిని ప్రాణాలతో అప్పచెప్పేలా పాకిస్తాన్పై కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలి. అంతేకాదు, తమ భూభాగం నుండి ఒక్క ఉగ్రవాద స్థావరానికి కూడా ఆశ్రయమియ్యమన్న హామీని పాకిస్తాన్ ప్రభుత్వం నుండి పొందాలి. పహల్గాం ఉగ్రదాడి తరువాత, దేశ వ్యాప్తంగానూ, అంతర్జాతీయంగానూ లభిస్తున్న మద్దతును ఇందుకోసం కేంద్రం వినియోగించాలి. అంతేకాదు, పహల్గాం ఉగ్రదాడి తరువాత ఒక మతానికి, ప్రాంతానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న సంఘటనలు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఈ తరహా దాడులు దేశ సమైక్యతకు తీరని నష్టం చేస్తాయి. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజల ఐక్యతను, దేశ సమైక్యతను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి.
