కాలుష్య కాసారం

Mar 13,2025 05:55 #Articles, #edit page, #India, #Pollution

దేశం కాలుష్య కాసారంగా మారుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. స్విస్‌ ఎయిర్‌ టెక్నాలజీకి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ‘ఐక్యు ఎయిర్‌’ తాజాగా విడుదల చేసిన ‘ది వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌-2024’ ప్రకారం ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా ఢిల్లీ కొనసాగుతూనే ఉంది. అస్సాం-మేఘాలయ సరిహద్దుల్లోని బైర్నిహట్‌ పట్టణం వాయు కాలుష్యంలో ఢిల్లీని మించిపోయి, అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో నిలవడం మరింత ఆందోళనకరం! మేఘాలయకు చెందిన ఈ చిన్న నగరంలో అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా పరిశ్రమలు ఏర్పాటు చేయడమే ఈ పరిస్థితికి కారణం. ఈ నివేదిక ప్రకారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బహమాస్‌, బార్బడోస్‌, గ్రెనడా, ఎస్టోనియా, ఐస్‌లాండ్‌ దేశాలు మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాల మేరకు వాయు కాలుష్యాన్ని నియంత్రించగలిగాయి. భారత్‌ 2023తో పోలిస్తే అత్యధిక కాలుష్య ర్యాంకుల్లో మూడవ స్థానం నుండి ఐదవ స్థానానికి చేరి కొంత మెరుగైన ఫలితాలు సాధించినట్టు నివేదిక పేర్కొంది. పి.ఎం 2.5 స్థాయిని 7 శాతానికి తగ్గించగలిగింది. అయినప్పటికీ, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల సరసన డేంజర్‌ జోన్‌లోనే కొనసాగుతుండటం, కాలుష్య నగరాల సంఖ్య పెరుగుతుండటం పొంచిఉన్న ముప్పునకు నిదర్శనం.

చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ 2023 లోనే కాలుష్య స్థాయి ఇదే మాదిరి కొనసాగితే ఢిల్లీ ప్రజానీకం తమ జీవిత కాలంలో 11.9 సంవత్సరాలు కోల్పోతారంటూ హెచ్చరిక చేసింది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలకు మించిన కాలుష్యంలో దేశంలోని మొత్తం జనాభా మగ్గుతోంది. ప్రతి క్యూబిక్‌ మీటర్‌కు 40 మైక్రోగాముల కాలుష్యానికి అనుమతి ఇస్తూ మన దేశం రూపొందించుకున్న సొంత నాణ్యతా ప్రమాణాలు సైతం ఆచరణలో అమలు కావడం లేదు. జాతీయ పరిమితి కన్నా అధికంగా కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో దేశంలోని 67.4 శాతం జనాభా జీవనం సాగిస్తోంది. 2023లోనే విడుదలైన ‘ది లాన్‌సెట్‌ ప్లానెటరీ హెల్త్‌’ నివేదిక ప్రకారం మన మహా నగరాలన్నీ వాయు కాలుష్యంతో అతలాకుతలమౌతున్నాయి. కాలుష్యంతో నిండిన గాలిని పీల్చడం ద్వారా దేశం మొత్తం మీద ప్రజానీకం సగటున 5.2 సంవత్సరాల జీవితాన్ని కోల్పోతున్నారు. వాయు కాలుష్య సంబంధిత రోగాల ద్వారా ప్రతి సంవత్సరం 15 లక్షల మంది మరణిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న వాటిలో వాయు కాలుష్యం ఐదవ స్థానంలో నిలుస్తోంది. ఈ కారణంగా ఢిల్లీలో 50 శాతం మంది చిన్నారుల ఊపిరితిత్తులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే 2019 నవంబర్‌లో అత్యున్నత న్యాయస్థానం ‘నరకానికన్నా అధ్వాన్నంగా ఢిల్లీ నగరం తయారైంది’ అని వ్యాఖ్యానించింది. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్‌ మిశ్రా ‘పేలుడు పదార్ధాలు అమర్చి ప్రతి ఒక్కరినీ చంపేయడం మంచిది.’ అని అన్నారంటే అప్పటికే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు. అయినా, పాలకులలో స్పందన లోపించడంతో, ఆ దుస్థితి దేశమంతా విస్తరిస్తోంది.

వాయు కాలుష్యానికి, వాతావరణ మార్పులకు దగ్గర సంబంధం ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ల పేరుతో కార్పొరేట్లకు ఎరత్రివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు దేశ వ్యాప్త వాయు కాలుష్యంలో 51 శాతానికి పరిశ్రమలు వెదజల్లే విష వాయువులే కారణమని తేలినా నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరచడం ద్వారా వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ స్పందన శూన్యం. స్వర్ణాంధ్ర విజన్‌ 2047 పేరుతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పలు పాలసీల్లోనూ కాలుష్య నియంత్రణ చర్యల ప్రస్తావన లేకపోవడం తీవ్రమైన లోపం! కార్పొరేట్ల లాభాల కోసం సామాన్యుల ప్రాణాలను సమిధలుగా చేసే ఈ తరహా విధానాలను ప్రభుత్వాలు ఇప్పటికైనా విడనాడాలి. తక్షణం కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలి. అడవులను పరిరక్షించడంతో పాటు, వీలైన అన్ని ప్రాంతాల్లోనూ చెట్లను పెంచాలి. ఈ తరహా చర్యలే కాలుష్య కోరల నుండి ప్రజానీకాన్ని కాపాడుతాయి.

➡️