‘పూలే’ అరుదైన గొప్ప చిత్రం. సెన్సార్ వారు మోకాలడ్డినా, పరిమిత థియేటర్లు లభించినా ఆ సినిమా విజయ యాత్రను అడ్డు కోవడం అసాధ్యం. చరిత్రను కలుషితం చేసే, వక్రీకరించే సినిమాల పరంపర సాగుతున్న దశలో ‘ఫూలే’ గొప్ప ఉపశమనం. కాచిగూడ చౌరస్తాలోని ఐనాక్స్లో సినిమా చూసినప్పుడు నాకు ఒక సంతోషదాయక అనుభవం ఎదురైంది. సినిమా ముగిసి దర్శకుడు అనంత్ మహదేవన్ పేరు తెరపై కనబడగానే ప్రేక్షకులు చప్పట్లు చరిచారు. స్టేజీ మీద ఒక నృత్యాన్ని చక్కగా ప్రదర్శించినప్పుడు, మంచి నాటకానికీ ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. అక్కడ ప్రేక్షకులు, కళాకారులతో ప్రత్యక్ష సంబంధంలో ఉంటారు. అలాగే సినిమాల్లో హత్తుకొనే డైలాగులకు, హీరో ప్రవేశానికి, అతని స్టంట్లకు చప్పట్లు కొట్టొచ్చు. కాని అలాంటి అరుదైన స్పందనకు కారణం ఫూలే దంపతుల పోరాటం. ఆ పోరాటాన్ని చక్కగా తెరకెక్కించింది అనంత్ మహదేవన్, ఆయన టీమ్.
‘మహాత్మా ఫూలే’ పేర 1954లో మరాఠీలో ఒక బ్లాక్ అండ్ వైట్ చిత్రం విడుదలైంది. దాన్ని హిందీలోకి కూడా డబ్ చేశారు. మరాఠీ సినిమా ‘మహాత్మా ఫూలే కు’ నేటి ‘ఫూలే’ చిత్రానికి ఒక తేడా కన్పిస్తుంది. సినిమా పేరుతోనే ఆ తేడా స్ఫురిస్తుంది. మరాఠీ చిత్రంలో జోతిరావుది ప్రధాన పాత్ర. నేటి ‘ఫూలే’ చిత్రంలో దంపతులిద్దరిదీ సమాన భాగస్వామ్యం. నిజానికి సావిత్రిబాయికి రవ్వంత ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఈ సినిమా మొదటి సీన్ సావిత్రిబాయితో ప్రారంభమవుతుంది. ఆమె మృతితో సినిమా ముగుస్తుంది. ఫూలే దంపతులు స్త్రీీ విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. అనంత్ మహదేవన్ స్త్రీ విద్య పట్ల ఫూలే దంపతుల దృఢ నిశ్చయాన్ని, తెగువను చక్కగా చూపారు. జోతిరావు ఫూలే 1890లో మరణించారు. దానికి ముందే పక్షవాతం వల్ల ఆయన కుడి కాలు, కుడి చేయి చచ్చుబడ్డాయి. ఆ దశ నుండి తాను చనిపోయే దాక సావిత్రిబాయి సత్యశోధక్ సమాజ్ బాధ్యతలను చేపట్టారు. 1897, మార్చి 10న సావిత్రిబాయి చనిపోయారు.
19వ శతాబ్దంలో మహిళలు ఇంటి నుండి బయటికి అడుగు పెట్టడమే పాపంగా భావించే వారు. ఆరోజుల్లో సావిత్రిబాయి, ఆమె స్నేహితురాలు ఫాతిమా చూపిన ధైర్యం అసమానం. మహిళల అణిచివేత హిందువుల్లోనే కాదు, ముస్లింలలో కూడా ఉందని, మత పెద్దలు ఆచరణలో ఖురాన్ బోధనలను వక్రీకరి స్తున్నారని చూపెట్టడంలో దర్శకుడు మెలుకువ చూపాడు. ఫూలే దంపతులు స్త్రీ విద్య కోసం వెలిగించిన కాగడా దేశమంతటా వెలుతురు పరిచింది. ఆ పాయింట్ మీద సినిమా ముగుస్తుంది.
ఫూలే స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వామి కాలేదన్న విమర్శకు కూడా దర్శకుడు తగిన విధంగా సమాధానం ఇచ్చాడు. విద్య విషయంలో సైతం బ్రిటిష్ పాలకుల చిత్తశుద్ధిపై ఫూలేకు పెద్ద నమ్మకం లేదు. వారు భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చారని సినిమాలో చాలాసార్లు ఫూలే చేత చెప్పించారు.
ఫూలేను నాస్తికుడని చెప్పలేము. అదే మాట సావిత్రిబాయి చేత చెప్పిస్తాడు దర్శకుడు. ఫూలే ఆంగ్లేయుల ఏజెంట్ అని, శూద్రులకు ఆంగ్ల భాష నేర్పించి సంస్కృతానికి ప్రమాదం తెచ్చిపెడుతున్నారని బ్రాహ్మణులు వాపోతారు. ఒక సన్నివేశంలో సావిత్రిబాయి ఎవరైనా డాక్టర్, ఇంజనీర్ కావాలంటే సంస్కృత భాషతో సాధ్యమౌతుందా అని ప్రశ్నిస్తుంది. జోతిబా సంస్కృత భాషను పరాయి భాషగా భావించాడు. తెలుగులో వ్యవహారిక భాషా ఉద్యమానికి ఆద్యుడు గిడుగు రామ్మూర్తి, కాగా మరాఠీలో ఆ పని ఆయన కంటే ముందే ఫూలే చేపట్టారు.
బ్రాహ్మణుడు లేకుండా జరిగే పెళ్లిపై బ్రాహ్మణులు భౌతిక దాడి చేస్తారు. కోర్టుకు ఎక్కుతారు. హిందూ ధర్మ శాస్త్రాలకు భిన్నంగా జరిగే పెళ్లి పెళ్లే కాదని వాదిస్తారు. చివరికి అలాంటి పెళ్లిళ్ల వల్ల తమకు చేరాల్సిన డబ్బు చేరడం లేదని, సాంప్రదాయం ప్రకారం ఆ డబ్బునయినా ఇప్పించమని న్యాయస్థానాన్ని అడుగుతారు. ఫూలే జోక్యం చేసుకొని పిటీషన్దారు న్యాయవాదిని ”మీరు రోజూ గడ్డం చేసుకుంటారు. గడ్డం మీరే చేసుకున్నారు సరే, ఆ డబ్బు సాంప్రదాయం ప్రకారం క్షురకులకు ఇస్తున్నారా?” అని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్న విన్న న్యాయమూర్తి కేసు కొట్టేస్తాడు.
రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చిన వారిని ఇప్పుడు దళితులు అని అంటున్నారు. ఫూలే తన రచనల్లో శూద్రులు, అతిశూద్రులు అన్నారు. సినిమాలో మాత్రం సావిత్రిబాయి సోదరులందరూ దళితులే అని అన్నట్లు చెప్పారు.
అంబేద్కర్ అనుయాయులమని చెప్పుకునేవారు తరచూ ఒక గందరగోళాన్ని ప్రదర్శిస్తుంటారు. అంబేద్కర్ను దళితుల నాయకుడిగా, ఫూలేను వెనుకబడిన కులాల నాయకుడిగా చూపెడ్తారు. అది వాస్తవ విరుద్ధ భావన. ఫూలే సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలు వేర్వేరు అన్న భావన ఆయన రచనల్లో, ఉద్యమంలో కనిపించదు. సినిమాలోనూ ఆ జాగ్రత్త తీసుకున్నారు.
మానవ హక్కుల కోసం ఫూలే దంపతులు చేసిన పోరాటాన్ని సంభాషణ రూపంలో సినిమాలో చక్కగా చూపెట్టారు. ఫ్రెంచి విప్లవం, అమెరికాలో లింకన్ బానిస విధానాన్ని రద్దు చేయడం వంటి ప్రస్తావనలు తెచ్చారు. అలాంటి పోరాటాలు చేసి విజయం సాధించిన వివిధ దేశాల ఉద్యమాలను ప్రస్తావిస్తారు. ప్రపంచ ఉద్యమాలపై అవగాహనలో సావిత్రిబాయి వెనుకబడలేదని చూపెడ్తారు. ఫూలేపై ప్రముఖ జీవిత చరిత్రల రచయిత ధనంజయ ఖీర్ రాసిన పుస్తకంలోని అంశాలు కూడా సినిమాలో కనిపిస్తాయి. చారిత్రక ఇతివృత్తాలను, జీవిత చరిత్రలను సినిమాగా తీస్తునప్పుడు భావోద్వేగ సన్నివేశాలను సృష్టించడం పరిపాటి. అయితే అవి మూల కథను దెబ్బతీసేవి కారాదు. ఆ విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ సినిమా గురించి సాధారణ ప్రేక్షకుడికి చెప్తే నటీనటులు ఎవరు? హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అని అడుగుతున్నారు. ఈ సినిమాలో గోవిందరావు ఫూలే పాత్రను మినహాయిస్తే పాపులర్ నటీనటులు ఎవరూ లేరు. రూ.వందల కోట్లు హీరోకు పారితోషకంగా చెల్లిస్తే ఇక సినిమాకు మిగిలేదేముంది! మట్టి తప్ప. కథా బలం లేకుండా టెక్నాలజీతో చేయగల జిమ్మికులపై ఆధారపడిన, తీసిన బరువైన హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర నేడు చతికిలబడుతున్నాయి. బడా కార్పొరేట్ కంపెనీలు ఈ రోజుల్లో సినిమాలు నిర్మిస్తున్నాయి, ప్రదర్శిస్తున్నాయి. ఆ సినిమాలకు ఆశించిన లాభాలు రాకపోయినా ప్రజలను నిద్రపుచ్చడంలో, మతపర భావోద్వేగాలు రెచ్చగొట్టడంలో మాత్రం అలాంటి సినిమాలు చాప కింద నీరు లాంటి పాత్ర పోషిస్తున్నాయి. కార్పొరేట్లకు అంతకంటే కావాల్సింది ఏముంది? సినిమా ముగింపులో భారతీయులు భావోద్వేగాలకు ఎంతగా లోనవుతారో జోతిబా చేత చెప్పించారు. ఈ దేశంలో కులం, మతం పేరుతో జనాన్ని రెచ్చగొట్టడం చాలా సులభం. ఆ పనే ఇప్పుడు జరుగుతున్నది. భవిష్యత్ లోనూ జరుగుతుంది-అంటూ జోతిబా చెప్పినప్పుడు కూడా థియేటర్లో కాసిన్ని చప్పట్లయినా వినిపించడం శుభసూచకం, ఆశావహం.
– రచయిత : ఎస్. వినయ్ కుమార్, ‘ప్రజాశక్తి’ పూర్వ సంపాదకులు,
సెల్ : 9989718311