సేవా తత్పరతకు నిలువెత్తు మానవ రూపం… నర్సులు. ఒక వైద్యుడు ప్రాణాలను రక్షిస్తాడు, కానీ ఒక నర్సు ఆ ప్రాణాలకు ధైర్యాన్ని పోస్తుంది. ప్రిస్క్రిప్షన్లో లేకపోయినా దయ, కరుణ, ఓదార్పు, భరోసా ఇచ్చే సంరక్షకులు వీరు. ‘నర్సులు ఆరోగ్య సంరక్షణకు గుండెకాయ లాంటివారు’ అంటారు నర్సింగ్ నిపుణుడు డోనా విల్క్ కార్డిల్లో. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ తమ కుటుంబాలకు దూరంగా వుంటూ, ప్రాణాలకు తెగించి వారందించిన సేవలు వెల కట్టలేనివి. నిద్రలేని రాత్రులలోనూ… నిస్వార్థంగా, రోగుల వెన్నంటి వుండే అలుపెరుగని సేవికలు నర్సులు. వారు శరీరానికి ఔషధాన్నివ్వడమే కాదు, హృదయాలకు సాంత్వననూ అందిస్తారు. వారి వైద్య నైపుణ్యం కంటే ముందు నిలిచేది… వారి మానవతా స్పర్శ. చికిత్స కోసం చేరిన నాటి నుంచి… కోలుకుని తిరిగి వెళ్లేవరకూ వెన్నంటే వుండి సేవలందిస్తారు. రోగులతో ఎక్కువ సమయం గడుపుతారు. చికిత్స ప్రక్రియ అంతటా అవసరమైన సంరక్షణ, సౌకర్యం, భరోసాను అందిస్తారు. ‘నర్సింగ్ అనేది లలిత కళలలో ఒకటి; లలిత కళలలో అత్యుత్తమమైనదని నేను భావిస్తాను’ అంటారు ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగెల్.
డబ్ల్యుహెచ్ఓ నివేదిక ప్రకారం… నర్సింగ్ వర్క్ఫోర్స్ ప్రపంచ ఆరోగ్యరంగంలోని అతిపెద్ద రంగాలలో ఒకటి. ప్రపంచంలోని మొత్తం ఆరోగ్య కార్యకర్తలలో సగానికిపైగా నర్సులు వున్నారు. అయినప్పటికీ నర్సుల కొరత వుంది. ఇంకా 5.9 మిలియన్ల మంది నర్సులు అవసరం వుందని డబ్ల్యుహెచ్ఓ చెబుతోంది. ‘నర్సింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదు…అదొక జీవన విధానం’ అంటారు ప్రముఖ నర్సింగ్ నిపుణుడు జీన్ వాట్సన్. జననమైనా… మరణమైనా, సంతోషమైనా… విషాదమైనా రోగుల పక్కనే వుంటారు. మానసికంగా, భావోద్వేగంగా, కుటుంబ సభ్యుల్లా చివరి నిమిషం వరకూ తోడుగా వుంటారు. రోగి స్వస్థతకు వైద్యం కీలకం. ఆ వైద్యం అందించే క్రమంలో నర్సుల పాత్ర కూడా అంతే ముఖ్యం. ఆపరేషన్ల సమయంలో డాక్టర్లకు చేదోడుగా వుండేది నర్సులే. రోగి కోలుకొని ఆరోగ్యంగా ఆసుపత్రి దాటేవరకూ అవసరమైన అన్ని వైద్యసేవలు అందించేది నర్సులే. మందులకంటే ఎక్కువగా… వీరు చెప్పే ధైర్యం, అందించే ప్రేమ… రోగిని త్వరగా కోలుకునేలా చేస్తుంది. తెల్లని దుస్తుల్లో దేవదూతల్లా… శాంతిమూర్తుల్లా కనిపించే నర్సులు వృత్తిపరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంటువ్యాధులనే మహమ్మారులపై పోరాడటంలో ముందంజలో వుండే వీరు… అధిక పనిగంటలు, తక్కువ వేతనాలు… మరీ ముఖ్యంగా లైంగిక వేధింపులు వంటి వాటినీ ఎదుర్కోక తప్పడంలేదు. నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు లేకుండా సార్వత్రిక ఆరోగ్యం అన్న లక్ష్యాన్ని ఏ దేశమూ సాధించలేదు. ఇందుకనుగుణంగా… వీరికి వృత్తిపరమైన భద్రత, వ్యక్తిగత రక్షణ కల్పించడంలో ఆయా ఆసుపత్రులు, ప్రభుత్వాలు కచ్చితమైన చర్యలు తీసుకోవాలి.
ఈ క్రమంలోనే… ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజైన మే 12ను ‘ప్రపంచ నర్సుల దినోత్సవం’గా జరుపుకుంటున్నారు. ‘నర్సుల సంరక్షణ ఆర్థిక వ్యవస్థలను బలపరుస్తుంది’ అన్న ఇతివృత్తంతో ఈ ఏడాది నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది వారి వృత్తిగత, వ్యక్తిగత శ్రేయస్సు, ఆరోగ్య సంరక్షణ కోసం మాత్రమే కాకుండా…ఆర్థిక స్థిరత్వంలో కూడా నర్సుల కీలకమన్న విషయాన్ని ఈ ఇతివృత్తం నొక్కి చెబుతోంది. ముఖ్యంగా నర్సుల మానసిక ఒత్తిడిపై దృష్టి పెట్టడం, వాటిని ఎదుర్కొనే మార్గాలను అన్వేషించడం ద్వారా నర్సులకు సరైన సౌకర్యాలు అందించి, వారికి వెన్నుదన్నుగా నిలవాలి. అప్పుడే నర్సింగ్ ఫోర్స్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది రోగులకు, సమాజానికి మెరుగైన ఫలితాలను అందిస్తుంది. ‘నేను సైతం/ ప్రపంచాబ్జపు/ తెల్ల రేకై పల్లవిస్తాను’ అంటారు మహాకవి శ్రీశ్రీ. మేము సైతం అంటూ… ప్రత్యక్షంగా ఆరోగ్య వ్యవస్థల సంరక్షణలో, పరోక్షంగా ఆర్థిక పురోభివృద్ధిలో భాగమౌతున్న మానవతా మూర్తులు నర్సులు. వారి సేవ, త్యాగం, ప్రేమ, కరుణ ప్రపంచానికి వెలుగు దివ్వెలు.
