బిజెపి పాలనలో దిగజారిన అట్టడుగు వర్గాల స్థితిగతులు

May 11,2024 05:02 #editpage

పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలలో…మొత్తం 543 స్థానాలకుగాను 400 పైచిలుకు స్థానాల్లో తాము విజయం సాధిస్తామని పాలక బిజెపి ధీమా వ్యక్తం చేస్తున్నది. కాగా, 150 నుంచి 180 స్థానాలకు మించి బిజెపి విజయం సాధించదని కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వం లోని ప్రతిపక్ష పార్టీల ‘ఇండియా’ వేదిక చెప్తోంది.
1925లో స్థాపించబడిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌)కు బిజెపి రాజకీయ అనుబంధ సంస్థ. ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యాలు, దాని ఎజెండా గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపన, దాని మూలాలు చాలా విషయాలు తెలియజేస్తాయి. మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత ప్రజానీకం వలస దోపిడీ సంకెళ్ళను అధిగమిస్తూ బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయమది. భూస్వాములు, మతాచార్యుల (బ్రాహ్మణ) కలయికకు వ్యతిరేకంగా దళితులు (అణగారిన, అట్టడుగు వర్గాలవారు) నిరసనలు తెలియజేస్తున్న సమయం. వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యానికి ముప్పు వాటిల్లిన కారణంగా, 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ను ఏర్పాటు చేసేందుకు అనేక మంది ప్రముఖులు కలిసి వచ్చారు. లౌకిక-ప్రజాస్వామ్య దేశం కోసం ఉద్దేశించిన జాతీయ ఉద్యమానికి భిన్నంగా హిందూ రాష్ట్రమే వారి లక్ష్యం. ఆ క్రమంలోనే అది 1951లో భారతీయ జనసంఫ్‌ును స్థాపించింది. దాని స్థానంలో 1980లో భారతీయ జనతా పార్టీకి (బిజెపి) పునర్జన్మనిచ్చింది.
ఆర్‌ఎస్‌ఎస్‌కు రెండు నియమాలున్నాయి. ఒకటి-ముస్లింలు, క్రైస్తవులను ‘విదేశీ మతాల’కు చెందిన వారుగా పరిగణించడం. రెండు-కులం, వర్గం, లింగ ఆధారిత గుర్తింపుపై ఆధారపడిన అలనాటి స్వర్ణ గతాన్ని పునరుద్ధరించడం. ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉండడమే నేటి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన ఎజెండాగా కనపడుతుంది. అదేవిధంగా అది, దళితులు, ఇతర వెనుకబడిన తరగతుల వారిని, మహిళలను పూర్తిగా అణచి వేయడానికి పూనుకుంటుంది. సమాజంలోని ఈ వర్గాల పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ రెండు మార్గాల విధానాన్ని అవలంబిస్తుంది. ఒకవైపు బిజెపి ఈ వర్గాలకు హాని కలిగిస్తుంది. మరోవైపు సమాజంలోని ఈ వర్గాల వారికి సహకరించడానికి కొన్ని సంస్థలను స్థాపిస్తున్నది. ముస్లింలకు సంబంధించినంత వరకు, 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశ జనాభాలో వారు 14.2 శాతం ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌’ నినాదం ఇచ్చినప్పటికీ ముస్లింల అణచివేత చాలా స్పష్టంగా కనపడుతుంది. ముస్లింలలో ఒక వర్గం వారిని ముఖ్యంగా షియాలు, పాస్మండాలు, సూఫీల మద్దతు కోసం వారు రాష్ట్రీయ ముస్లిం మంచ్‌ (ముస్లింలకు జాతీయ వేదిక)ను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పార్లమెంట్‌ ఉభయ సభల్లో బిజెపికి 395 మంది ఎంపీలు ఉంటే వారిలో ఒక్క ముస్లిం కూడా లేడు. 57 మంది మంత్రులతో కూడిన మోడీ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మంత్రి లేడు. ముస్లింలపై అఘాయిత్యాలకు సంబంధించి చూద్దాం. గత పదేళ్ళలో ముస్లింలపై 2019 లో ఢిల్లీలో పెద్ద ఎత్తున హింస జరిగింది. ముస్లింలకు పౌరసత్వం ఇవ్వకుండా మినహాయించిన కొత్త పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎ) వ్యతిరేకంగా జరిగిన నిరసనల తరువాత ఆ హింస చోటు చేసుకుంది. ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ లెక్కల ప్రకారం చంపబడిన 53 మందిలో 38 మంది ముస్లింలే.
మొత్తంగా చూస్తే గోమాంసం సమస్యపై ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడం భయం, బాధ కలిగిస్తుంది. దాద్రీలో అఖ్లఖ్‌ హత్య నుండి రైల్లో జరిగిన జునైద్‌ హత్య వరకు దాదాపు 100 హత్య కేసులు నమోదు అయ్యాయి. ”వీటిలో 97 శాతం కేసులు, 2014 మే నెలలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాతనే నమోదయ్యాయి. నమోదైన 63 ఆవు సంబంధిత కేసుల్లో దాదాపు 32 కేసులు బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే నమోదయ్యాయ”ని బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక పేర్కొంది.
ముస్లింలను లక్ష్యం చేసుకునే సమస్యలు చాలానే ఉన్నాయి. పోలీస్‌ వ్యవస్థ, కోర్టులు లాంటి స్వతంత్ర సంస్థల్లోకి హిందూ జాతీయవాద బిజెపి పాలక ప్రభుత్వ పక్షపాత వైఖరి ప్రవేశించింది. అది, మైనార్టీ మతస్తులను బెదిరించి, వేధించి, దాడి చేసే విధంగా హిందూత్వ అల్లరి మూకలకు అధికారం ఇస్తుంది. వీరికి శిక్షల నుండి మినహాయింపు ఉంటుంది.
క్రైస్తవ సమాజం కూడా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నది. 1999లో పాస్టర్‌ గ్రాహం స్టీవార్డ్‌ స్టెయిన్స్‌ను సజీవ దహనం చేసిన ఘటనను, ప్రపంచ అమానుష చర్యల జాబితాకు చెందిన ఘటనగా నాటి భారత రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ పేర్కొన్నారు. విశ్రాంత న్యాయమూర్తి ఎ.పి.మూర్తి నాయకత్వంలోని నేషనల్‌ పీపుల్స్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసిన జ్యూరీ, ఈ కేసు విచారణను చేపట్టింది. ఈ హింసలో దాదాపు 100 మంది క్రైస్తవులు హత్యకు గురయ్యారు. 300 చర్చిలు ధ్వంసం చేయబడ్డాయి.
మిషనరీలు మత మార్పిడి కోసం ప్రయత్నం చేస్తున్నాయనే సాకుతో ప్రార్థనా సమావేశాలపై దాడులు జరుగుతున్న మారుమూల ప్రాంతాల్లో అడపాదడపా క్రైస్తవులపై దాడులు కొనసాగుతున్నాయి. ”23 జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. భారతదేశంలో మూడు రాష్ట్రాల్లోని 13 జిల్లాల్ని క్రైస్తవ మతాన్ని ఆచరించడానికి ప్రమాదకరమైన జోన్లుగా గుర్తించారని” ద సిటిజన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌ సంస్థ తెలిపింది. క్రైస్తవులు జీవించడానికి భారతదేశం పదవ అత్యంత ప్రమాద కరమైన ప్రాంతంగా గుర్తించారని ‘ఓపెన్‌ డోర్స్‌’ పేర్కొంది.
ఈ నేపథ్యంలో మోడీ, కొందరు క్రైస్తవ మత పెద్దల్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ”డిసెంబర్‌ 25వ తేదీన మోడీ క్రైస్తవ ప్రతినిధులను పరస్పర చర్చల కోసం, వారిని అభినందించడం కోసం ఆహ్వానించాడు. క్రైస్తవ సమాజం చేస్తున్న సామాజిక సేవను ప్రశంసించి, ఏసు క్రీస్తు బోధనలను ఆయన కొనియాడాడని” ఇండియన్‌ కరెంట్స్‌ పేర్కొంది. సేవల ద్వారా దళితుల మద్దతు పొందడానికి సామాజిక సామరస్య మంచ్‌ లాంటి కొన్ని సంస్థల్ని బిజెపి ప్రారంభిస్తుంది. విధానపరమైన విషయాల్లో అణగారిన వర్గాల కోసం చేపట్టాల్సిన చర్యలను దాట వేస్తుంది.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ, న్యాయం కోసం పిలుపును ఇస్తుంటే, బిజెపి విధానపరంగా అవకాశం ఉన్న చోట, భారతదేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రధాన సాధనంగా ఉపయోగపడే రిజర్వేషన్లను తొలగిస్త్తానంటోంది. గడచిన దశాబ్ద కాలంలో ఈ వర్గాల ఆర్థిక స్థితిగతులు మరింతగా దిగజారాయి. ”పట్టణ ప్రాంతాల్లో దళితులు, నైపుణ్యం లేని ఉద్యోగాలు, రెక్కల కష్టం చేసే ఉపాధిని పొందుతున్నారు. కేవలం 5 శాతం మంది దళితులు మాత్రమే భారతీయ రిజర్వేషన్‌ చట్టం నుండి ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రభుత్వ పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు దళితులకు సహాయపడుతుండగా, ప్రభుత్వం వాటిని సరైన రీతిలో పర్యవేక్షించడం లేదు, వాటిలో చాలా వరకు అమలుకు నోచుకోవని” ప్రముఖ విద్యావేత్త సుఖదేవ్‌ థోరత్‌ అన్నారు. వారి ఆర్థిక దుస్థితి దయనీయంగా ఉంది. ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది. బిజెపి చేస్తున్న వాగ్దానాలను అణగారిన వర్గాలు సీరియస్‌గా తీసుకోవడం లేదని యుసిఎ న్యూస్‌ నివేదిక తెలిపింది.

(‘న్యూస్‌ క్లిక్‌’ సౌజన్యంతో)

రామ్‌ పునియానీ
రామ్‌ పునియానీ
➡️