పోర్టుల కబ్జా – పాలక పార్టీల పాపాలు

కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్‌ లోని వాటాలను వైసిపి ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాక్కోవటం, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, అదానీ సోలార్‌ విద్యుత్‌ ముడుపుల వ్యవహారం గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాలక పార్టీలు వివిధ పేర్లు, ఒప్పందాలు, బదిలీలు, సంక్షేమం పేర సంపదను, ప్రజల ఆస్తులను ఎలా కొల్లగొడుతున్నాయో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ బినామీలకు, ఆప్తులకు, క్రోనీలకు ఆస్తులను ఎలా కట్టబెడుతున్నాయో, పేదల రేషన్‌ బియ్యాన్ని సైతం ఎలా బొక్కేస్తున్నాయో ప్రజలకు తేటతెల్లం చేస్తున్నాయి. కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్‌ మాదిరిగానే రాష్ట్రంలోని గంగవరం, కృష్ణపట్నం పోర్టులను అదానీ దౌర్జన్యంగా తన వశం చేసుకున్నారు. అదానీ భారీ అక్రమాలపై విచారణ జరుపుతామని రాష్ట్ర టిడిపి కూటమి ప్రభుత్వం మాట వరుసకు కూడా అనడం లేదు. అదానీ సోలార్‌ విద్యుత్‌ ముడుపులపై కూడా నోరు విప్పటం లేదు. ఎందుకని? రాష్ట్రంలో ఏలినవారు, ఏలుతున్న వారు పార్టీలుగా వేరైనా ప్రజల ఆస్తులను లూటీ చేయడంలోనూ, కార్పొరేషన్లకు, క్రోనీలకు కట్టబెట్టటంలో వీరి మధ్య ఎలాంటి తేడా లేదు. కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్‌ ఘటనలతో పాటు గంగవరం, కృష్ణపట్నం పోర్టుల బదలాయింపు పర్వంలో పాలక పార్టీల బండారాన్ని పరిశీలిద్దాం.

కాకినాడ సీ పోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కె.ఎస్‌.పి.ఎల్‌)ను, కాకినాడ సెజ్‌లో ఉన్న వాటాలను వైసిపి ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి అండతో వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌ రెడ్డి, అరబిందో సంస్థ యజమాని శరత్‌ చంద్రారెడ్డి భయపెట్టి బలవంతంగా బదలాయింపు చేసు కున్నారని వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వర రావు సిబిఐకి ఫిర్యాదు చేశారు. కాకినాడ సీ పోర్టు లోని రూ.2500 కోట్ల విలువగల వాటాలకు రూ.494 కోట్లు, కాకినాడ సెజ్‌లో వున్న రూ.1109 కోట్లు విలువ చేసే వాటాలకు కేవలం రూ.12 కోట్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. భయపెట్టి సంతకాలు చేయించుకొని ఆస్తులను బదలాయించుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఈ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి విచారణ చేపట్టింది.

అయితే ఇక్కడ కొన్ని విషయాలను మనం పరిశీలిస్తేనే ఈ అడ్డగోలు దోపిడీకి మూలం, బలవంతపు బదలాయింపులు, ఏ పార్టీ ఏమేం చేసింది, ప్రజల సంపదను యథేచ్ఛగా అభివృద్ధి పేర ఎలా కొల్లగొడుతున్నారో అర్థమౌతుంది. కాకినాడ సీ పోర్టును 1997లో రాష్ట్ర ప్రభుత్వం రూ.350 కోట్లతో తన సొంత నిధులతో నిర్మించింది. ఆ తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి 22 శాతం స్థూల రాబడిలో వాటాకి పరిమితమై ఒప్పందం చేసుకొని కారుచౌకగా 1999లో ఈ పోర్టును కార్నాటి వెంకటేశ్వరరావుకి ధారాదత్తం చేశారు. అప్పుడు ఆయన టిడిపికి చెందిన వ్యక్తిగా ప్రచారం జరిగింది. వాస్తవంగా అవినీతికి, ప్రజల ఆస్తుల లూటీకి ఇక్కడే బీజం పడింది. ఈ పోర్టును ప్రైవేటీకరించటాన్ని నాటి యాంకరేజ్‌ పోర్టు కార్మికులు తీవ్ర ఉద్యమం చేపట్టారు. ప్రైవేటీకరణ చర్యల వల్ల ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో యాంకరేజ్‌ పోర్టు నిర్వహిస్తున్న కార్గో హ్యాండ్లింగ్‌ సరుకులను ప్రైవేట్‌పరం చేసిన కాకినాడ సీ పోర్టులో ఎగుమతి చేయరని ఒప్పందం చేశారు. ఆ సరుకులు మినహా కొత్త కార్గోకి మాత్రమే పరిమితం అవుతుందని హామీ ఇచ్చారు. ఆ తరువాత ఈ హామీని అధికారంలో ఉన్న పార్టీల అండతో ఉల్లంఘించి చివరికి కేవలం బియ్యం ఎగుమతికే యాంకరేజ్‌ పోర్టును పరిమితం చేసి వేలాది మంది ఉపాధిని దెబ్బతీశారు.

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత కాకినాడ సీ పోర్టును కర్నాటి వెంకటేశ్వరావు నుండి బలవంతంగా వైసిపి రాజకీయ, పెట్టుబడిదారీ ముఠా గుంజుకుంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఉపాధి పేర కాకినాడ సెజ్‌ను, దీనికి అనుబంధంగా మరో ఎస్‌ఇజెడ్‌ పోర్టు నిర్మాణాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇందుకు 10,500 ఎకరాల భూములను రైతుల నుండి బలవంతపు సేకరణకు తెరలేపారు. ప్రజలు ఈ భూ దోపిడిని తీవ్రంగా ప్రతిఘటించారు. 2014 ఎన్నికల్లో సెజ్‌కి భూములు తీసుకోబోమని చంద్రబాబు నాయుడు ప్రజలకు వాగ్దానం చేసినా…తీరా గెలిచాక వారి ప్రభుత్వం బలవంతపు భూసేకరణను పాల్పడింది. 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా చంద్రబాబు వలె మాట ఇచ్చి రైతులను మోసం చేశారు. చివరకు జరిగిందేమిటి? కాకినాడ సెజ్‌ భూమి మొత్తం 10,500 ఎకరాలు కర్నాటి వెంకటేశ్వరావు, జిఎంఆర్‌కి కట్టబెట్టారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రైతుల భూములను అప్పనంగా పంచేసుకున్నారు. ఆ తరువాత వైసిపి అధికారంలోకి వచ్చాక జిఎంఆర్‌ 51.26 శాతం వాటాను అరబిందో యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో కాకినాడ ఎస్‌ఇజెడ్‌ పోర్టు కూడా అరబిందో పరమైంది. దీని వెనుక గూడా పెద్ద అవినీతి కథ నడిచినట్లు తెలుస్తున్నది.

విశాఖ ఎయిర్‌ పోర్టును మూసేసి భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టును పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో నిర్మించాలని చంద్రబాబు నాయుడు 2014లో ముందుకు తీసుకొచ్చారు. 5040 ఎకరాల భూసేకరణకు పాల్పడ్డారు. ఆ తరువాత 2700 ఎకరాలకు పరిమితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పోర్టు నిర్మాణం అప్పగిస్తే అత్యధిక ఆదాయ షేర్‌ ఇచ్చేలా ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ) ముందుకొచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. 2017లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోర్టు టెండర్లలో మొదటి స్థానంలో నిలిచింది. కానీ చంద్రబాబు ఎఎఐ టెండర్‌ను తిరస్కరించడమేగాక రద్దు చేసి ఆ తరువాత 2019లో జి.ఎం.ఆర్‌ కి కట్టబెట్టారు. దీనిని ఆనాడు వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యతిరేకించి రద్దు చేస్తామని 2019 ఎన్నికల్లో వాగ్దానం చేశారు. గెలిచిన తరువాత చేసిందేంటి?

జి.ఎం.ఆర్‌ సంస్థకు భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ను కట్టబెడుతూ 2020 జూన్‌లో ఒప్పందం చేశారు. ఆ తరువాత జిఎంఆర్‌ సంస్థ కాకినాడ సెజ్‌లో ఉన్న 51 శాతం వాటాను రూ.2610 కోట్లకు అరబిందో సంస్థకు అమ్మేసింది. ఈ సొమ్మును 2021లో రూ.1600 కోట్లు, ఆ తరువాత రెండు లేదా మూడేళ్లలో మిగిలిన సొమ్ము అరబిందో సంస్థ చెల్లిస్తుందని తెలిపారు. ఇదంతా పెద్ద గూడు పుఠాణి. భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌, కాకినాడ సెజ్‌ వాటా క్విడ్‌ ప్రో కో (నీకు అంత నాకు ఇంత)లా వుంది. ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు నోరు విప్పటంలేదు. ఎందుకంటే జి.ఎం.ఆర్‌ సంస్థ బిజెపి కి, టిడిపి కి అత్యంత సన్నిహితమైనది కాబట్టి. ఇక దేశంలోని ప్రైవేట్‌ పోర్టుల్లో అదానీ ముంద్రా పోర్టు తరువాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అతి పెద్దవి గంగవరం, కృష్ణపట్నం పోర్టులు. ఈ రెండిటినీ కాకినాడ సీ పోర్టు కంటే దారుణంగా 2021లో కేంద్ర బిజెపి అండతో అదానీ దౌర్జన్యంగా కబ్జా చేశారు. ఈ అడ్డగోలు దోపిడీపై టిడిపి కూటమి ప్రభుత్వం నోరు మెదపటం లేదు. ఎందుకని? అదానీ నరేంద్ర మోడీ సన్నిహిత క్రోనీ. టిడిపి కి కూడా మంచి మిత్రుడు. అందుకే అదానీ సోలార్‌ విద్యుత్‌ ముడుపుల పైనా స్పందించడంలేదు.

గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పిపిపి విధానంలో చంద్రబాబు ప్రభుత్వం 2003లో ముందుకు తీసుకొచ్చిన పోర్టు. వాస్తవంగా ఈ పోర్టును విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కి అనుబంధంగా సమీకృత పోర్టుగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంలోనే ఒక భాగం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గంగవరం పోర్టు నిర్మాణానికి ముందుకొచ్చినా ఆనాడు చంద్రబాబు తిరస్క రించారు. విశాఖ పోర్టు ట్రస్ట్‌ కూడా గంగవరంలో శాటిలైట్‌ పోర్టును నిర్మిస్తానని ప్రతిపాదించినా అంగీకరించలేదు. చివరికి డివిఎస్‌ రాజుకి పిపిపి కింద 30 ఏళ్ల ప్రాతిపదికన గంగవరం పోర్టును అప్పగించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 1000 ఎకరాల భూమి కేటాయించింది. ఆ తరువాత టిడిపి, బిజెపి ఏకమై స్టీల్‌ప్లాంట్‌పై ఒత్తిడి తెచ్చి మరో 2000 ఎకరాలు 2003లో డివిఎస్‌ రాజుకి కట్టబెట్టారు. ఆ సందర్భంగా కూడా గంగవరం పోర్టులో సొంత బెర్త్‌లను నిర్మించుకుంటామని స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం ప్రతిపాదించినా చంద్రబాబు నాయుడు ససేమిరా అంగీకరించ లేదు. పోర్టుకి భూమి ఇచ్చినందుకు పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటాగా చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ తరువాత డివిఎస్‌ రాజు తన 89.6 శాతం వాటాలోని 31.5 శాతాన్ని అమెరికా వార్‌బర్గ్‌ పింకస్‌ అనే ఈక్విటీ ఫైనాన్స్‌ సంస్థకి అమ్మేశారు.

అదానీ సంస్థ మొదట 2021లో అమెరికా ఈక్విటీ సంస్థ వాటాను కొనేసింది. ఆ తరువాత అదానీ (కాకినాడ సీ పోర్ట్‌ యజమాని కర్నాటి వెంకటేశ్వరావును భయపెట్టినట్లే) కేంద్ర బిజెపి నాయకత్వాన్ని రంగంలోకి దింపి ఆగమేఘాల మీద డివిఎస్‌ రాజు వాటా 58.1 శాతాన్ని దౌర్జన్యంగా బదలాయింపు చేసుకున్నారు. 2015 నాటికే గంగవరం పోర్టు విలువ రూ.13 వేల కోట్లుగా లెక్కగట్టారు. కానీ 2021లో కేవలం షేర్‌ ధరను ఏక పక్షంగా రూ.120గా లెక్క గట్టి రూ.6200 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. ఆ సొమ్ము కూడా పూర్తిగా ఇవ్వకుండా అదానీ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌లో 4.8 కోట్ల షేర్లను (షేర్‌ ధర రూ.754 చొప్పున) అంటగట్టారు. ఆ తరువాత వైసిపి ని మచ్చిక చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ 10.4 శాతం వాటాను ఎటువంటి బహిరంగ టెండర్లు లేకుండానే అక్రమ పద్ధతిలో రూ.645 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో మొత్తం గంగవరం పోర్టు అదానీ పరమైంది. ఈ దుర్మార్గపు ఆక్రమణపై ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం ఏమాత్రం స్పందించటం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వ వాటా అక్రమ బదలాయింపుపై విచారణ జరిపిస్తామని కూడా అనడంలేదు.

మరో పోర్టు కృష్ణపట్నం. ఈ పోర్టు కూడా 2003లో బిల్ట్‌-ఆపరేట్‌-షేర్‌-ట్రాన్స్‌ఫర్‌ (బిఓ ఎస్‌టి) ప్రాతిపదికన 30 ఏళ్ళపాటు నిర్వహించు కునేలా నవయుగ గ్రూప్‌ సంస్థకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది. గంగవరం పోర్టు లాగే ఈ పోర్టును కూడా నరేంద్ర మోడీ అండతో 2020లో అదానీ సొంతం చేసుకున్నారు. మొదట 75 శాతం వాటాను రూ.13,000 కోట్లకు ఒప్పందం చేసుకొని ఆ తరువాత 13 శాతం తగ్గించి రూ.12,000 కోట్లకు పరిమితం చేశారు. 2021లో ‘విశ్వ సముద్ర’ పేర ఉన్న 25 శాతాన్ని కూడా రూ.2800 కోట్లు చెల్లించి కృష్ణపట్నం పోర్టును అదానీ పూర్తిగా తన వశం చేసుకున్నారు. ఇప్పుడు దేశంలో పోర్టుల ద్వారా జరిగే ఎగుమతులు, దిగుమతుల్లో 35 శాతానికి అదానీ ఎదిగాడు. ఈ దోపిడీ అంతా కేంద్ర బిజెపి అండతో విచ్చలవిడిగా అదానీ సాగిస్తున్నారనటంలో ఎలాంటి సందేహం లేదు.

వ్యాసకర్త : డా|| బి. గంగారావు,సెల్‌ : 9490098792 /

 

➡️