రాష్ట్రంలో గత ప్రభుత్వం 117 జీవో తీసుకువచ్చి ఆరు రకాల పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు 117 జీఓ రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో ప్రస్తుత ప్రభుత్వం 117లో మార్పులు తెస్తామంటూ తొమ్మిది రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడానికి పూనుకొన్నది. ఈ మార్పుల్లో భాగంగా పాఠశాలకు ఒక్కొక్క రకం విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రకటించింది. దీంతో మళ్లీ ఉపాధ్యాయుల నుంచి ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్ల నుంచి, ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని సరిదిద్దాలి. ప్రాథమిక పాఠశాల అంటే ఒకటి నుండి ఐదు తరగతులు మోడల్ ప్రాథమిక పాఠశాల లేదా బేసిక్ ప్రాథమిక పాఠశాలగా కొనసాగించాలి. ఫౌండేషన్ స్కూళ్ల వల్ల, హైస్కూళ్లలో ప్రాథమిక తరగతులను మళ్లించడం వల్ల ప్రాథమిక విద్య మనుగడ సాధించడం కష్టతరమవుతోంది. కాబట్టి హైస్కూళ్ళలో ప్రాథమిక తరగతులు లేకుండా చూడాలి. ప్రాథమిక పాఠశాలలకు పూర్వ ప్రాథమిక విద్యను అనుసంధానం చేయాలి. ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరు ఏడు తరగతులు ఉన్న చోట నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మరియు 6,7,8 తరగతులు ఉన్న చోట 6 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జీవో 55 ప్రకారం కొనసాగించాలి. ప్రతి తరగతికి ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చూడాలి. విద్యార్థుల సంఖ్య 20 లోపు ఉన్నపుడు విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు టీచర్లను నియమించాలి.
– వాసిలి సురేష్, నెల్లూరు జిల్లా.