పెహల్గాం బాధిత మహిళలపై ట్రోల్‌ దాడులు

కాశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడిలో భర్తను కోల్పోయిన హిమాన్షి, తండ్రిని కోల్పోయిన ఆరతి మీనన్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వ్యక్తిత్వ హననం జరుగుతున్నది. భర్త వినయ్ నర్వాల్‌ మృతదేహం ముందు కూర్చుని విలపిస్తున్న హిమాన్షి నర్వాల్‌ ఫోటో ప్రపంచమంతా వైరల్‌ అయ్యింది. ఆ ఫోటో ఒక్కటి చాలు! దేశమంతటా ఉగ్రవాద వ్యతిరేకత వెల్లువెత్తడానికి. తండ్రిని కోల్పోయిన కేరళకు చెందిన ఆరతి మీనన్‌ తన పిల్లలను కాపాడుకున్న తీరు మానవత్వం వున్న ప్రతి ఒక్కరిని కన్నీరు కార్చేలా చేసింది. మన రాష్ట్రానికి చెందిన చంద్రమౌళిని మోకాళ్ళపై కూర్చోబెట్టి భార్య, కూతురు ఎదురుగానే తలలోకి బుల్లెట్లు దించిన తీరును వారు చెబుతుంటే మన ఎదురుగానే జరిగినంత భీతి కలిగింది. ఈ తల్లులు ఇంత శోకంలో కూడా దేశ హితం కోసం ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదో విచక్షణతో మాట్లాడారు. శాంతి కావాలి, ఉగ్రవాదాన్ని అంతం చేయండి, చంపిన వారు ముస్లింలే కానీ తిరిగి వెనక్కి రావడానికి సహయపడిన వారు కూడా ముస్లింలే, కాల్చిన వారి మతాన్ని బట్టి వ్యవహరించకండి…అని గొప్పగా హితవు పలికారు. మన దేశ గౌరవాన్ని మరో మెట్టు ఎక్కించారు. ఇలాంటి మహోన్నతులపై ఉన్మాదం తలకెక్కిన ముష్కరులు సభ్య సమాజం సిగ్గుపడేలా, నాగరికతను సింధూ నదికి దూరంగా విసిరేసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. వారు ఉగ్రవాద బాధితులన్న సానుభూతి, మహిళలన్న విజ్ఞత కోల్పోయి నీచాతినీచంగా ట్రోల్‌ చేస్తున్నారు. హిమాన్షిపై చేసిన ఒక క్రూరమైన పోస్టు ”ఈ…నీ కూడా …చంపితే అప్పుడు సపోర్టు చేసేది తురకలకి”, ”ఇదే తన భర్తను చంపడంలో సహాయం చేసింది”. ఆరతి మీనన్‌పై కూడా ఇలాంటి ఘోరమైన పోస్టులు పెడుతున్నారు. సాయుధ ఉగ్రవాదులు వారి ఆత్మీయులను బలిగొంటే, ఈ సోషల్‌ మీడియా ఉగ్రవాదులు వారి వ్యక్తిత్వాన్ని, వాక్‌ స్వాతం త్య్రాన్ని, దేశం పట్ల వారి నిబద్ధతను బలి తీసుకుంటున్నారు. ఉన్మాదం తలకెక్కిన వారి చేతిలో వున్న ఆయుధాలే కాదు, సామాజిక మాధ్యామాలు కూడా మనల్ని బలి తీసుకుంటాయి. వాటి నుండి వచ్చిన తూటాలు శరీరాన్ని ఛిద్రం చేస్తే, వీటి నుండి వచ్చే పోస్టులు మనసును ధ్వంసం చేస్తాయి. వాడు మతాన్ని అడిగి మరీ కాల్చేస్తే, వీడు మానవత్వాన్ని మొలకెత్తకుండా కాల్చేయజూస్తున్నాడు. బయటకు వేర్వేరుగా కనిపించే ఈ ఉగ్రవాదులు నిజంగా వేరు కాదు. వారి లక్ష్యం మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, మత ఘర్షణలు పెట్టడం, ప్రజల ఐక్యతను చీల్చడం. ఏప్రిల్‌ 22న జమ్ము కాశ్మీర్‌ పెహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని దేశం యావత్తు నిరసించింది, బాధితులను తమ కుటుంబ సభ్యులుగా భావించి విలపించింది. మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశమంతటా ఒకే కంఠంతో ఉగ్రవాద చర్యలను ఖండించింది. గతంలో ఎన్నడూ లేనంతగా కాశ్మీర్‌ ప్రజలు కూడా ఈ అమానుష కాండను తీవ్రంగా వ్యతిరేకించారు. అందరికంటే ముందుగా అక్కడ బంద్‌ పాటించారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలను అక్కున చేర్చుకున్నారు, మనో ధైర్యాన్ని ఇచ్చారు, తక్షణ సపర్యలు చేశారు. గాయపడిన వారిని కిలో మీటర్ల కొద్దీ మోసుకు వచ్చారు. చనిపోయినవారికి మార్చురీ వద్ద ఏర్పాట్లు చేసి శోక హృదయాలతో సాగనంపారు. బాధితులకు ఆశ్రయం ఇచ్చారు. కలిగిన దాంట్లోనే భోజనాలు పెట్టారు. ఉచితంగా ఆటో, ట్యాక్సీల్లో రైల్వేస్టేషన్‌, విమానాశ్రయాలకు చేర్చారు. ఇలాంటి కొన్ని సంఘటనలు సోషల్‌ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలిశాయి. బయటకు రాని, రికార్డు కాని అనేక రూపాల్లో స్థానికులు మతం, కులం, ప్రాంతం బట్టి కాకుండా సాటి మనుషులుగా, తమ అతిథులుగా అనుకుని స్పందించారు. మానవత్వంతో, భారతీయులమనే భావనతో చేశారు. వారికి తెలుసు ఉగ్రవాదానికి భిన్నంగా ప్రవర్తించినా, విమర్శించినా జరిగే పరిణామాలు ఏమిటో వారికి అనుభవంలో చాలా తెలుసు, అయినా ఎందుకు స్పందించారు. మేము వారు వేరువేరు, మతం చాటున ఒకే తీరుగా చూడద్దొండి అంటూ పర్యాటకులను వేడుకున్నారు. మనమంతా భారతీయులం అని గొంతెత్తి చాటారు.
ఆయుధాలు కలిగిన ఉన్మాదులతో తలపడితే ఏం జరుగుతుందో తెలిసి కూడా సయ్యద్‌ ఆదిల్‌ షా ను ఆత్మార్పణకు సిద్ధపడేలా చేసింది…ఒకవైపు కాల్పులు జరుగుతుంటే గాయపడిన పిల్లవాడిని 11 కి.మీటర్లకు పైగా వీపున మోసుకుంటూ హుస్సేన్‌ను ఆ కొండల్లో నడిచేలా చేసింది… నిజమైన మానవత్వం, అదే నిజమైన భారతీయత. కళ్ళ ముందు తమ వారిని కోల్పోయి దుఖ:ంలో వున్నవారికి ఈ దృశ్యాలు ఎక్కడో జీవితం పట్ల, దేశం పట్ల ప్రేమను, నమ్మకాన్ని నిలిపాయి. అందుకే ఇళ్ళకు తిరిగివచ్చిన బాధితుల్లో ఏ ఒక్కరూ కూడా స్థానిక ముస్లింలను ఒక్క మాట అనకపోగా వారిని అనేక విధాలుగా మెచ్చుకున్నారు.
ఇదే దేశంలోని సామాజిక మాధ్యమాల ముష్కరులకు కోపం తెప్పించింది. ఈ దాడులను ఆధారంగా చేసుకుని హిందూ, ముస్లిం మత ఘర్షణలు పెట్టాలనుకునే వారు విచక్షణ కోల్పోయేలా చేసింది. భర్తలను, తండ్రులను, అన్నలను కోల్పోయిన బాధితులంతా ఉగ్రవాదుల దుర్మార్గాలతో పాటు దేశీయ ముస్లింల మీద ఏదో రూపంలో విరుచుకుపడాలని భావించిన ఉన్మాదుల ఆగ్రహానికి కారణమైంది. హిమాన్షి ఏం మాట్లాడింది! ”నా భర్త ఎక్కడున్నా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని…దేశం మొత్తం అతని కోసం ప్రార్థించాలని…నేను కోరుకుంటున్నాను. ముస్లింలు లేదా కాశ్మీరీలను ప్రజలు వ్యతిరేకించాలని మేం కోరుకోవడంలేదు. మాకు శాంతి కావాలి, శాంతి మాత్రమే కావాలి. అయితే మాకు న్యాయం కావాలి”. ఈ వాఖ్యలు చేసిన ఆమెలో ఎంతటి స్థిరచిత్తం వుందో, ఎంతటి విజ్ఞత వుందో మెదడు వున్న ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసింది. తమ ఆయష్షు కూడా పోసుకుని నూరేళ్ళు బతకమని ఎన్ని హృదయాలు దీవించాయో! ఈ ఆణిముత్యాలు కొందరికి రుచించలేదు. ద్వేషంతో ఊగిపోయే కషాయ నెటిజన్లు ఆమెపై విరుచకు పడ్డారు. హిమాన్షి జెఎన్‌యు లో చదివిందని, తన భర్త మరణాన్ని సామాజిక, రాజకీయ నిచ్చెన ఎక్కడానికి ఒక అవకాశంగా చేసుకొని ఇలాంటి శాంతి సందేశాలు ఇస్తుందని, కాశ్మీరు హానీమూన్‌ ‘ఆమె ఏర్పాటు చేసిందని’ ప్రభుత్వం ఇచ్చే పరిహారం, పెన్షన్‌ ఆమెకు ఇవ్వకూడదని, ఆమెకు ముస్లిం స్నేహితులు వున్నారని, ‘ఆమె జాతి వ్యతిరేకి’, ‘వారి…సానుభూతిపరురాలు’ అంటూ తమ చేతికి, నోటికి అడ్డూ అదుపు లేకుండా పోస్టులు పెడుతున్నారు. ఈ దుర్మార్గంపై జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ స్పందించారు. ఇలాంటి పోస్టులు వెంటనే ఆపండి, మహిళకు తన అభిప్రాయాలు, ఆలోచనలు చెప్పే హక్కును కాలరాస్తారా? అంటూ ప్రశ్నించారు. ఏదైనా అంగీకారం లేదా భిన్నాభిప్రాయాన్ని ఎల్లపుడూ మర్యాదగా, రాజ్యాంగ హద్దులకు లోబడి స్పందించాలని చెప్పారు. కేరళకు చెందిన ఆరతి మీనన్‌ తన పిల్లలను వెంటబెట్టుకుని తండ్రితో కలిసి కాశ్మీరుకు వెళ్లింది. తన తండ్రిని కాల్చవద్దని ఉగ్రవాదులను ఎంతగా వేడుకున్నా కనికరించకుండా అతి సమీపం నుండి ఆయనను కాల్చేశారు. తీవ్ర విషాదంలో కూరుకుపోయిన ఆరతి మీనన్‌కు ఇద్దరు స్థానిక యువకులు అండగా నిలిచి ఆమె పిల్లలను చేరదీసి, ఆమె తండ్రి శవానికి పరీక్షలు పూర్తి చేయించి, ప్రయాణ ఏర్పాట్లు చేసి పంపారు. కేరళకు తిరిగివచ్చిన ఆరతి స్పందిస్తూ ”ఈ ప్రయాణం నాకు ప్రయమైన తండ్రిని దూరం చేసింది. కానీ ఇద్దరు సోదరులను ఇచ్చింది. ఒకరు డ్రైవర్‌ ముసాఫిర్‌, మరొకరు సమీర్‌. వారు ప్రతి విషయంలో నాకు తోడుగా నిలిచారు. తెల్లవారుజామున మూడు గంటల వరకు నా దగ్గరే వుండి నన్ను ఒక సోదరిగా చూసుకున్నారు” అని చెప్పింది. మతం-ఉగ్రవాదం- మానవత్వం వేర్వేరు అని తన అనుభవం నుండి చెప్పడాన్ని భారత్‌ మాతా కీ జై అనే వారు సహించలేకపోయారు. ”ఆమె లాంటి పిల్లలు పుట్టడం కంటే లేకుండా వుండటమే మంచిది”, ”ఆమె మాటలు అసహ్యకరం” అంటూ అత్యంత నీచంగా దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టారు.
ఇలాంటి పోస్టులు పెడుతున్నవారి ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ ఫోటోల్లో శ్రీరాముడు, ఆంజనేయస్వామి బొమ్మలు, కాషాయ జెండా, అఖండ భారత ఫోటోలు వుంటున్నాయి. ఇంత నీచంగా ట్రోల్‌ చేసే ధైర్యం వీరికి అక్కడి నుండే అందుతుంది. శీలం, జ్ఞానం, గర్భ సాంస్కారం, హిందూ సంస్కృతి, ‘నారీ శక్తి వందన్‌ చట్టం’, బేటీ బచావో’ అంటూ చెప్పే మాటలకు వీరి చేతలకు నకశిఖ పర్యంతమంత తేడా వుంది. కాశ్మీర్‌ దారుణంపై దేశమంతా ఉగ్రవాదం, దానికి ఆధారంగా వున్న పొరుగు దేశంపై ఆగ్రహావేశాలతో వుంటే, ఉగ్ర బాధితులనే బాధించగల వారిని మనుషులు అనగలమా? బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారి విడుదల ఉత్సవాలు, ఉత్తరప్రదేశ్‌ ఉన్నావోలో దళిత మహిళపై హత్యాచారానికి పాల్పడిన నేరగాళ్ళ ఊరేగింపు, కాశ్మీర్‌ కథువాలో ఎనిమిదేళ్ళ బాలికను గుడిలో అత్యాచారం చేసి చంపేసిన నిందితులు తల ఎత్తుకుని దేశ పాలకుల పక్కన నిలచిన ఫోటోలు, మణిపూర్‌లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన వీడియోలు దేశమంతా ప్రచారం చేయగలిగే నీచ మనస్తత్వం ఎవరికి వుంటుంది? ఆధునిక సమాజంలో ఉన్నత చదువులు చదివి స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పడానికి ప్రయత్నిస్తున్న అనేక మంది మహిళలు తీవ్రమైన సామాజిక మాధ్యమాల హింసకు గురవుతున్నారు. ప్రముఖ సామాజికవేత్తలు స్వాతి చతుర్వేది, అరుంధతీ రారు, గుజరాత్‌ ఫైల్స్‌ రచయిత రాణా ఆయూబ్‌, తులసీ చందు…ఇలా ఒక్కరేమిటి అనేక మంది ఇలాంటి హింసను నిత్యం అనుభవిస్తున్నారు.
హత్యాచారాలకు, హత్యలకు పాల్పడే ఉన్మాదులను వ్యతిరేకించినంత మాత్రాన ఈ సమస్య తీరదు. ఇలాంటి వారిని ఎందుకు శిక్షించడం లేదని దేశ పాలకులను ప్రశ్నించాలి. ఇలాంటి వారి వెనుక వున్న మతోన్మాద సంస్థలను నిలదీయాలి. బాధితుల పక్షాన నిలవాలి.

వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్‌

➡️