పన్నులపై ఒకడుగు వెనక్కు తగ్గిన ట్రంప్‌!

Apr 11,2025 05:54 #Articles, #edit page, #Trump, #Trump tariffs

డోనాల్డ్‌ ట్రంప్‌కు తత్వం తలకెక్కుతోందా! ప్రపంచ దేశాలతో రాజీకి వస్తున్నాడా!! మూడు నెలల పాటు తాను ప్రకటించిన పన్నుల యుద్ధాన్ని వాయిదా వేస్తున్నట్లు చేసిన ప్రకటన దేనికి సూచిక గతంలో మాదిరి ఈసారి కూడా చైనా మీద ఏదో ఒక సాకుతో వాయిదా లేదా సుంకాల తగ్గింపు చర్యలకు పాల్పడే అవకాశాలు లేకపోలేదు. ప్రపంచ మార్కెట్ల మీద చైనా ఎలాంటి గౌరవం ప్రదర్శించని కారణంగా 125 శాతం విధిస్తున్నట్లు, దాని మీద ఎలాంటి సంప్రదింపులు ఉండవని ట్రంప్‌ చెప్పటం మేకపోతు గాంభీర్యం తప్ప మరొకటి కాదు. యావత్‌ ప్రపంచం మీద పన్ను పోరు ప్రకటించిన అతగాడి నిర్వాకం కారణంగా స్టాక్‌మార్కెట్లు పతనమయ్యాయన్నది తెలిసిందే. మూడు నెలల వాయిదా గురించి కొద్ది రోజుల క్రితమే సామాజిక మాధ్యమంలో వచ్చిన వార్తలను ట్రంప్‌ యంత్రాంగం తోసి పుచ్చింది. మూడు నెలల వాయిదా ప్రకటనతో ప్రపంచ వ్యాపితంగా స్టాక్‌మార్కెట్లు కోలుకున్నాయి. చిత్రం ఏమిటంటే చైనా మీద విధించిన 125 శాతంపై వెనక్కు తగ్గేది లేదన్న తరువాత కూడా చైనా స్టాక్‌ మార్కెట్లు మిగతా వాటితో పాటు గురువారం నాడు పెరిగాయి. ఈ పూర్వరంగంలో చైనా మీద ప్రతి సుంకాలు ఎందుకు ప్రభావం చూపలేదు? పర్యవసానాలు ఏమిటి? అసలు ట్రంప్‌ ఎందుకు వెనక్కు తగ్గాడనే చర్చ, విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

మూడు నెలల వాయిదాకు దోహదం చేసిన అంశాలేమిటి? తమ మంత్రిత్వశాఖలు, వాణిజ్య ప్రతినిధితో 75 దేశాలు సంప్రదింపులు జరిపినట్లు ట్రంప్‌ చెప్పుకున్నాడు. రిపబ్లికన్‌ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ మనకు ఫోన్లు చేస్తున్న దేశాల వారు ప్లీజ్‌ ప్లీజ్‌ సర్‌ ఒప్పందం చేసుకోండి, నేను ఏదైనా చేస్తాను అని చెబుతున్నారన్నాడు. అబద్ధాలు, గొప్పలు చెప్పటంలో ఆరితేరిన ట్రంప్‌ గురించి తెలిసినప్పటికీ…చైనా మాత్రం తగ్గేదేలే అని చెప్పింది. మిత్ర పక్షంగా ఉన్న ఐరోపా సమాఖ్య 23 బిలియన్‌ డాలర్ల మేరకు అమెరికా వస్తువుల మీద పన్ను విధించనున్నట్లు ప్రకటించింది, కెనడా కూడా అదే బాటలో ఉంది. మనం అటూ ఇటూ ఏదీ చెప్పకుండా గోడమీద పిల్లి వాటాన్ని ప్రదర్శిస్తున్నాం. ఎక్కువ పన్నులు విధించిన దేశాల నుంచి సరకులను మనదేశానికి దిగుమతి చేసుకొని వాటిని తిరిగి ఎగుమతి చేయవద్దని మన వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ మన ఎగుమతిదార్లను హెచ్చరించారు. పిటిఐ వార్త మేరకు చైనా, ఇతర ఆసియన్‌ దేశాల సరకులను మన దేశం నుంచి ఎగుమతి చేయవద్దని చెప్పారట. అలా జరుగుతోందని గతంలో ఎన్నడూ మన ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పుడు అలా మాట్లాడారంటే ఎవరి మెప్పు పొందేందుకో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ మరో సందేహం కూడా తలెత్తుతోంది. గతంలో అలా చేసి ఉంటే అసలు నిజంగా మన ఎగుమతులు పెంచామని బిజెపి పాలకులు కొట్టుకుంటున్న డబ్బా మీదనే అనుమానం వస్తోంది.

అసలు పన్నుల వాయిదా నిర్ణయానికి దారితీసిందేమిటి? మొదటి కారణంగా చెప్పుకోవాలంటే ఏప్రిల్‌ ఐదున 150 సంస్థల పిలుపు మేరకు 20 లక్షల మంది జనం నిరసన ప్రదర్శనలు చేశారు. వెనక్కు తగ్గకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తొలుత మద్దతు ప్రకటించిన ద్రవ్య పెట్టుబడిదారులు, ఇతరులు కూడా పర్యవసానాలను చూసి వైఖరి మార్చు కుంటున్నారు. ఒక్కరంటే ఒక్క ఆర్థికవేత్త కూడా సానుకూలంగా మాట్లాడిన ఉదంతం లేదు. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత భారీగా పెరుగుతుందని ఆశించిన ఎలన్‌ మస్క్‌ సంపద ఇప్పటి వరకు 135 బిలియన్‌ డాలర్లు హరించుకుపోయింది. చైనా సహా ఎవరి మీదా పన్నులు వేయవద్దని, పునరాలోచించాలని ట్రంప్‌ను మస్క్‌ గట్టిగా కోరినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసింది. చైనా వెనక్కు తగ్గకపోగా ఐరోపా సమాఖ్య కూడా ప్రతిఘటనకు పిలుపు ఇచ్చింది. పన్నుల విధింపులో కీలక పాత్ర పోషించిస సలహాదారు పీటర్‌ నవారో, మరో కీలక సలహాదారు ఎలాన్‌ మస్క్‌ వీధులకెక్కి విమర్శించుకుంటున్నారు. ఈ పరిణామాలతో గోడ మీద పిల్లులు కూడా వ్యతిరేక శిబిరంలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వదేశంలో పెట్టుబడులు పెట్టి వస్తూత్పత్తి చేయాలన్న పిలుపుకు పెద్ద స్పందన కనిపించటం లేదు. మూడు నెలల కాలంలో లొంగుబాటును ప్రదర్శించే దేశాల మీద కొన్ని ఒప్పందాలను రుద్ది లబ్ధి పొందే ఎత్తుగడ కూడా దీని వెనుక ఉండవచ్చు. ఈ వ్యవహారం కూడా త్వరలోనే బట్టబయలు కానుంది, ఎవరు ఎలా స్పందిస్తారో తెలియదు. ఒకడుగు వెనక్కు వేసిన ట్రంప్‌ను దారికి తేవాలంటే అమెరికన్లు మరింతగా వీధుల్లోకి రావాలి. బాధిత దేశాలన్నీ సమైక్యం కావాల్సిన అవసరం ఉంది. పోరాడే వారే కాదు, జయచంద్రలు కూడా ఉన్నారు. ద్రోహానికి పాల్పడిన జయచంద్రను ఉపయోగించుకున్న వారే చివరికి హతమార్చారన్న కథ పునరావృతం అవుతుందా? చూద్దాం!

– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌ 

➡️