వెన్నెముక, గుండె, క్లోమం…ఒక్కొక్కటిగా ఆయన అవయవాలన్నీ బలహీన పడ్డాయి. జైలులో ఒంటరిగా అండా సెల్లో ఉంచారు. నిరంతర నొప్పి, తరచుగా మూర్ఛపోవడం, మూత్ర సమస్యలు… ఇవన్నీ జీవితంలో భాగమై చివరికి ఆయనను భౌతికంగా లేకుండా చేశాయి. ఆయన విషాద మరణం రాజ్యాధికారాన్ని ప్రశ్నించే వారికి నేర న్యాయ వ్యవస్థ అందించే కఠినమైన సవాళ్లను బహిర్గతం చేస్తుంది. మానవ హక్కుల కోసం ఉద్యమించిన విద్యావేత్త, సామాజిక క్రియాశీలత కలిగిన మేధావి ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాను ఈ వ్యవస్థ తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద మోసపూరిత ఆరోపణలకు పదేళ్ల క్రూరమైన ఖైదు అనుభవించాల్సి వచ్చింది. ఆయన ఒక్కసారి కాదు. రెండుసార్లు నిర్దోషిగా విడుదల అయినప్పటికీ, అందిన స్వేచ్ఛ మాత్రం స్వల్పకాలికం!
బొంబాయి హైకోర్టు ఐదున్నరేళ్ల ఏకాంత నిర్బంధం తర్వాత జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. అయితే 24 గంటల తర్వాత, ఆ ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించడం, స్వేచ్ఛను హరించడం 90 శాతం వికలాంగ రాజకీయ ఖైదీగా మరింత కష్టతరమైన విషయం. గత పదేళ్లుగా ఆయన ఎదుర్కొన్న జైలు శిక్ష ఆయనను జీవచ్ఛవంగా మార్చివేసింది.
ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని గడ్చిరోలి జిల్లా కోర్టు 2017లో దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుండి ఆయన నాగ్పూర్ సెంట్రల్ జైలులో ఒంటరిగా నిర్బంధించబడ్డాడు.
సాయిబాబా జీవితాంతం విద్యార్థులకు బోధించడానికి ఇష్టపడేవారు. అంతేగాక, నిరంతరం అత్యంత అణగారిన ప్రజల కోసం తపనపడ్డారు. వెనుకబడిన వర్గాలు చైతన్యవంతం కావడానికి విద్య అవసరం. దాని కోసం, వారికి నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలి. విద్య మాత్రమే కాదు, నాణ్యమైన విద్య ఉండాలనే సంకల్పంతో ముప్పై ఐదు సంవత్సరాలు బోధనను తన ఆయుధంగా మలచుకున్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ తీరు చూస్తుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు దూరమవుతున్నట్లు కనిపిస్తున్నదని ఆయన ఆందోళన చెందారు. సమాన విద్యావకాశాలు పూర్తిగా మృగ్యమై పోయాయని మదన పడ్డారు. దళిత ఆదివాసీ విద్యార్థులకు పేరెన్నిక గల సంస్థలు, విశ్వవిద్యాలయాలలో ప్రవేశం లేదు. ఒకవేళ ప్రవేశం లభించినా వారు విశ్వవిద్యాలయాలలో నిరంతరం వివక్షకు గురవుతున్నారు. దీంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
ఆయన విషాద మరణం రాజ్యాధికారాన్ని ప్రశ్నించే వారికి నేర, న్యాయ వ్యవస్థ అందించే కఠినమైన సవాళ్లను బహిర్గతం చేస్తుంది. ప్రొఫెసర్ సాయిబాబా కవి, రచయిత, నిష్ణాతుడైన ఉపాధ్యాయుడు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ క్యాంపస్లో మండల్ కమిషన్ ఆందోళన ఉధృతంగా సాగుతున్న సమయంలో ప్రొఫెసర్ సాయి బాబా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫ్రంట్తో అనుబంధం కలిగి ఉన్నారు. రిజర్వేషన్లకు అనుకూలంగా క్యాంపస్లో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు.
ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం నుండి వచ్చిన ప్రొఫెసర్ సాయిబాబా ఎం.ఏ ఇంగ్లీష్ అభ్యసించడానికి సెంట్రల్ యూనివర్శిటీలో చేరారు. తరువాత ఇఫ్లూ లో పోస్ట్ డాక్టరల్ స్టడీస్ పూర్తి చేశారు. సాయిబాబా జీవితాంతం పలు ఉద్యమాలతో సంబంధం కలిగి ఉన్నారు. ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. మానవ హక్కుల సమస్యలపై పనిచేశారు. 1993లో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 35 రోజుల సుదీర్ఘ నిరాహారదీక్షలో సాయిబాబా భాగమయ్యారు. కర్కశ ప్రభుత్వం ఆయన పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించింది.
కడుపు నిండా దు:ఖం గుండెల నిండా ఆవేశం వున్నది కానీ నిస్సహాయులుగా వున్నాం. తీర్పులకు న్యాయానికి సంబంధం లేని దేశంలో, ఏ దిక్కు వెళ్ళాలో తెలిసినా బలహీనంగా ఉన్నాం. సాంస్కృతిక పక్షవాతంతో మెదళ్ళు చచ్చుబడిపోయి వున్నాం. పెద్దగా కదల్లేక పోతున్నాం, మెదల్లేక పోతున్నాం. గొంతు విప్పలేక పోతున్నాం. ఏమిటి ఘోరం? ఈ శిక్షలేమిటి? ఎన్నో ఉరితీతలకు సమానమైన అండా సెల్లో చక్రాల కుర్చీతో ఏకాంత వాసం! ప్రాణాల్ని పీల్చే శీతల వాయువుల దాడిలో.. గజదొంగలు పడ్డ దేశంలో… వాళ్ళందరి నుంచి నిన్నెలా రక్షించుకోవాలో నిన్నెలా మిగుల్చుకోవాలో తెలియ లేదు బాబా!
ఇది నిస్సహాయుల ఆత్మఘోష.
– డా.ఎం.సురేష్ బాబు,
సెల్ :9989988912