తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి పూర్తి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ 1932, ఫిబ్రవరి 6వ తేదీన విడుదలైంది. హెచ్ఎం రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత కూడా. మొదటి హిందీ టాకీ చిత్రం నిర్మించిన స్టూడియోలోనే ఈ తెలుగు టాకీ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో సురభి నాటక సమాజం వారు ఈ ‘భక్త ప్రహ్లాద’ నాటకాన్ని ఎక్కువగా ప్రదర్శించేవారు. ఆ నాటక సమాజం వాళ్లని అప్పట్లో బొంబాయికి పిలిపించి ఈ చిత్రానికి కావాల్సిన కథ, తీసే ప్రణాళికను చిత్ర యూనిట్ రూపొందించింది. ఈ సినిమా తీయటానికి అప్పట్లో రూ.18 వేలు వ్యయం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గురువారంనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తున్నామని ప్రధాన కార్యదర్శి జెవి మోహన్గౌడ్, అధ్యక్షులు ఎఎం రత్నం ఒక ప్రకటనలో తెలిపారు.
