సినీ హీరో అల్లు అర్జున్‌పై కేసు

Dec 5,2024 23:28 #death, #movies, #police case, #Pushpa-2
  • థియేటర్‌ యాజమాన్యంపైనా..

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : హైదరాబాద్‌ ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్‌ సంధ్య థియేటర్‌ ఘటనలో హీరోఅల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పుష్ప సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా అల్లు అర్జున్‌ సంధ్య థియేటర్‌కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్‌ టీమ్‌పై కూడా సెక్షన్‌ 105, 118 బిఎన్‌ఎస్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసినట్టు సెంట్రల్‌ జోన్‌ డిసిపి అక్షాంశ్‌ యాదవ్‌ తెలిపారు. ”బుధవారం రాత్రి 9.40 గంటలకు పుష్ప-2 ప్రీమియర్‌ షోను సంధ్య థియేటర్‌లో ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం పోలీసులకు లేదు. కనీసం థియేటర్‌ యాజమాన్యం కూడా సమాచారం ఇవ్వలేదు. యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. పబ్లిక్‌ను అదుపుచేసేందుకు థియేటర్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. రాత్రి 9.40 గంటలకు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్య థియేటర్‌ వద్దకు అల్లు అర్జున్‌ వచ్చారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపుచేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కిందపడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సిపిఆర్‌ చేసి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శ్రీతేజను కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని డిసిపి యాదవ్‌ తెలిపారు.

➡️