సంధ్య థియేటర్‌ తొక్కిసలాట – శ్రీతేజ్‌కు అల్లు అరవింద్‌ పరామర్శ

తెలంగాణ : ‘పుష్ప-2’ సినిమా రిలీజ్‌ రోజున సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న విషయం విదితమే. తీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రిలో కాలాన్ని గడిపిన శ్రీతేజ్‌ … కొద్ది రోజుల క్రితం డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఇంకా పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం శ్రీతేజ్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు అల్లు అరవింద్‌ స్వయంగా శ్రీతేజ్‌ను పరామర్శించారు. రీహాబ్‌ సెంటర్‌కు వెళ్లిన అరవింద్‌ అక్కడి డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారి చికిత్సకు సహకరిస్తున్నాడని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా అరవింద్‌ మాట్లాడుతూ … శ్రీతేజ్‌ రోజురోజుకూ కోలుకుంటుండడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. త్వరలోనే అందరి మధ్య సాధారణ పిల్లవాడిగా ఉంటాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో శ్రీతేజ్‌కు ఏ అవసరం వచ్చినా ఆదుకుంటామని భరోసానిచ్చారు.

➡️