ఈ ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రదానం చేయబోతున్న విషయం తెలిసిందే. ఏటా ఉగాది రోజున ఈ పురస్కారాలను అందజేయనున్నారు. గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డుల విధి విధానాలకు సంబంధించి బుధవారం దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. తెలుగుతో పాటు ఉర్దూ సినిమాలనూ పరిశీలిస్తామని, ఏప్రిల్లో అవార్డుల వేడుక ఉంటుందని చెప్పారు. గతంలో ‘సింహా’ అవార్డులకు దరఖాస్తు చేసుకున్నవారికి వారి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైక్యతా చిత్రం, బాలల చిత్రం, పర్యావరణం, చారిత్రక సంపద తదితర విభాగాల్లో ఎంపిక చేసిన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. వీటితో పాటు తొలి ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ఫిల్మ్ విభాగాల్లో కూడా అవార్డులను అందించనున్నారు.
