తెలంగాణ : మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గుర్తింపు, గౌరవం దక్కింది. చిరంజీవికి యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందిస్తోన్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 19వ తేదీన చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. ఈ తాజా ప్రకటనతో మెగా ఫ్యాన్స్ అంతా సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పుడు చిరంజీవికి యూకే ప్రభుత్వం ప్రకటించిన లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు జనసేన ఆవిర్భావ దినోత్సవం, హోలీ పండుగ వేళ … ఈ ప్రకటన మెగా ఫ్యాన్స్ లో జోష్ పెంచింది. ‘పునాదిరాళ్ళు’తో ఇండిస్టీలోకి అడుగుపెట్టారు చిరంజీవి. కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన, డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగించారు. బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేశారు. 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులతోపాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందించి గౌరవించింది. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఈ రికార్డు దక్కింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ కోసం వర్క్ చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్కు ఓకే చెప్పారు.
