”సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పూర్తిగా ప్రేమ కథా చిత్రం. సంక్రాంతి పండుగలో ఈ సినిమా బాగా అలరిస్తుంది. ఇంట్లోని కుటుంబ సభ్యులంతా సినిమాకు వెళ్లి హాయిగా చూడొచ్చు. మంచి కుటుంబ, ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధాలకు ఇందులో దర్శకుడు అనిల్ రావిపూడి ప్రాధాన్యత ఇచ్చారు. నాతోపాటుగా మిగతా నటీనటులంతా ఎంతో చక్కగా ప్రతిభ కనబర్చారు. అందరూ ఈ సినిమాను బాగా ఆదరించి విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్ వంటి సినిమాలు కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ‘దిల్’రాజు, శిరీష్లతో ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ‘మా సంక్రాంతికి వస్తున్నాం’ చూడండి..మామూలుగా ఉండదు’ అని నటుడు వెంకటేష్ అన్నారు. కథానాయకుడు వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈనెల 14న విడుదల కానుంది. మీనాక్షీచౌదరి, ఐశ్వర్యారాజేష్ కథానాయికలు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. మూవీట్రైలర్ విడుదల కార్యక్రమం నిజామాబాద్లో జరిగింది. నిర్మాత దిల్రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, కథానాయికలు మీనాక్షీచౌదరి, ఐశ్వర్యరాజేష్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ ప్రతినిధులంతా హాజరయ్యారు.