తెలుగు సినిమాకు పూర్వవైభవం తెస్తా : దిల్‌రాజు

‘తెలుగు సినిమాకు పూర్వ వైభవం తీసుకు రావటానికి అందరి సహకారం ఎంతో అవసరం. తెలంగాణా సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తా. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాతనే గుర్తింపు వచ్చింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా. ఈ పదవి నా బాధ్యతను మరింత పెంచింది. ఫిల్మ్‌ ఇండిస్టీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తా. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతోపాటు డిస్ట్రిబ్యూటర్ల సమస్యల పరిష్కారానికి నా వంతుగా కృషిచేస్తా’ అని దిల్‌రాజు హామీఇచ్చారు. తెలంగాణా ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత దిల్‌రాజు (వెంకట రమణారెడ్డి) ఆయన పదవీబాధ్యతలను బుధవారం చేపట్టారు. ఇటీవల ఆయన్ను తెలంగాణా ప్రభుత్వం ఈ పదవిలో నియమించింది. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన పై విధంగా మాట్లాడారు. తొలుత ఛాంబర్‌లోని తన ఛాంబర్‌లో సినీ ఇండిస్టీ ప్రముఖులు ఆయనను ఘనంగా సత్కరించారు. తనను ఈ పదవికి ఎంపిక చేసిన తెలంగాణా ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజున బాధ్యతలు స్వీకరించటం విశేషం. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు దిల్‌రాజుకు సోషల్‌మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన గేమ్‌ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల కానున్నాయి. నితిన్‌ నటిస్తున్న తమ్ముడు చిత్రానికి కూడా ఆయనే నిర్మాతగా వ్యవహ రిస్తున్నారు.

➡️