తెలుగు సినిమా స్టార్ రైటర్ బుర్రా సాయిమాధవ్ మనసు కవి ‘ఆత్రేయ రచనా పురస్కారం’ అందుకున్నారు. తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఆధ్వర్యంలో యువ కళావాహిని నిర్వహణలో ఆచార్య ఆత్రేయ 104వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ రాధా రాణి, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం, ట్రాన్స్పోర్టు కమిషనర్ సిఎల్ఎన్ గాంధీ, సాహితీవేత్త పి.జ్యోతి, కళారత్న ఎస్వి రామారావు, యువ కళావాహిని ఉపాధ్యక్షులు ఎంఎ హమీద్, యువ కళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ తదితరులు ఈ పురస్కారాన్ని డాక్టర్ బుర్రా సాయిమాధవ్కు అందజేశారు. తొలుత జరిగిన సభకు సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. ముఖ్యఅతిథిగా తెలంగాణా హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జి.రాధారాణి మాట్లాడుతూ ఆత్రేయ మనస్సు, ప్రేమ అంశాలుగా ఎన్నో గీతాలు రాసి తెలుగు వారి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచారని గుర్తుచేశారు. లంక లక్ష్మీనారాయణ స్వాగతం పలికారు. దర్శకుడు రాజా వన్నెంరెడ్డి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. తొలుత అహో ఆంధ్ర భోజ ఆత్రేయ సినీ పాటలను సంధ్య వర్ణిణి, రేవతి, పవన్ మధురంగా గానం చేశారు.
