వరుణ్‌ తేజ్‌ లావణ్య త్రిపాఠి దంపతుల గుడ్‌ న్యూస్‌

తెలంగాణ : మెగా హీరో వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ క్రమంలో దంపతులు.. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఓ క్యూట్‌ ఫొటో కూడా పెట్టారు. ” జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాను. కమింగ్‌ సూన్‌ ” అని వరుణ్‌ తేజ్‌ క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతుండగా సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సమంత, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అల్లు స్నేహా కంగ్రాట్స్‌ అంటూ రిప్లయిలు ఇచ్చారు. 2017లో ‘మిస్టర్‌’ సినిమా కోసం వరుణ్‌ – లావణ్య తొలిసారి కలిసి నటించారు. అప్పుడే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ మరుసటి ఏడాది వచ్చిన ‘అంతరిక్షం’లోనూ ఈ జంట ప్రేక్షకులను మెప్పించింది. 2023 నవంబర్‌ 1న ఇటలీలోని టస్కానీ వేదికగా వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇటీవల లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ లో నటించారు.

➡️