ఆరు నెలలు ఆగండి.. గురూజీ…

‘అల వైకుంఠపురంలో’ సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్టుకు అల్లు అర్జున్‌ (బన్నీ)-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్కు పూర్తయ్యింది. వీరిద్దరి మధ్య మలిదఫా చర్చలు జరిగాయి. తన సినిమాకు కాల్షీట్లు ఇస్తే ప్రాజెక్టు ప్రారంభిస్తానని త్రివిక్రమ్‌ చెప్పగా…మరో ఆరునెలలు ఆగాల్సిందిగా బన్నీ కోరారు. పుష్ప 2 సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని ఇండిస్టీలో ఇప్పటివరకూ ఊహాగానాలు వచ్చాయి. తాజాగా తమిళ దర్శకుడు అట్లీతో భారీ ప్రాజెక్టుకు బన్నీ అంగీకరించటంతో త్రివిక్రమ్‌తో సినిమా కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. జవాన్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన అట్లీతో సినిమా చేయబోతున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కు ప్రారంభం కానుంది. గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా మరో సినిమా చేయలేదు. ఆ సినిమా విడుదలకు ముందే బన్నీతో మరో సినిమా చేయబోతున్నానని ఆయన అప్పట్లోనే ప్రకటించారు. పాన్‌ ఇండియాస్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించే ఈ చిత్రంలో బన్నీ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. పుష్ప 2 విడుదలైన తర్వాత త్రివిక్రమ్‌ తన సినిమాను పట్టాలెక్కించాలనే వ్యూహంతో ఉన్నారు. ఆయన కంటే ముందు అట్లీ చిత్రాన్ని పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఇటీవల తనను కలిసిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఈ విషయాన్ని బన్నీ స్పష్టంచేశారు. వచ్చే ఏడాది అట్లీతోనూ, ఆ తర్వాత ఏడాది త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో చేయబోయే సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్‌ చేసుకున్నారు. దీనికోసం ఆరునెలలు ఆగాలని కోరగా త్రివిక్రమ్‌ కూడా అంగీకరించారు. ఏదైనా షూటింగ్‌ మధ్యలో గ్యాప్‌ వస్తే చెబితే కొంత పార్ట్‌ స్టార్ట్‌ చేస్తామని కూడా త్రివిక్రమ్‌ సలహా ఇచ్చారట. దీనికి బన్నీ అంగీకరించారు.

➡️