తెలంగాణ : సినీ హీరో అల్లు అర్జున్ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించారు. తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి లోపలికి వెళ్లారు. సుమారు 20 నిమిషాల పాటు ఆస్పత్రిలో ఉన్న అల్లు అర్జున్.. వైద్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఆసుపత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదైన నేపథ్యంలో …. పరామర్శకు వెళ్లద్దని లీగల్ టీమ్ చెప్పడంతో శ్రీతేజ్ వద్దకు రాలేదని ఇటీవల అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్మీట్లో తెలిపారు. తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు. గత నెల 4న ‘పుష్ప2’ బెనిఫిట్ షో సందర్భంగా … హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆ బాలుడిని కిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ ఆర్థికసాయం ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.కోటి, పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షల చెక్కులను ఇటీవల దిల్ రాజు ద్వారా ఆ కుటుంబానికి అందజేశారు.