” ఇది ఇప్పటివరకూ ఎప్పుడూ అనుభవించని ఆందోళన ” : జాన్వీకపూర్‌

May 10,2025 11:39 #Actress Janhvi Kapoor, #post

ముంబయి : ” నేను ఇప్పటివరకూ ఎప్పుడూ అనుభవించని ఆందోళన ” అని హీరోయిన్‌ జాన్వీకపూర్‌ అన్నారు. భారత్‌ – పాక్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జమ్మూపై దాడులకు సంబంధించిన విజువల్స్‌ చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు ఆమె తెలిపారు. గురువారం పాకిస్థాన్‌ చేసిన డ్రోన్‌ దాడులు తనను ఎంతో బాధించాయన్నారు. దీనిపై తన ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. ” ఇది నేను ఇప్పటివరకూ ఎప్పుడూ అనుభవించని ఆందోళన. ఇన్ని రోజులు విదేశాల్లో ఇలాంటి దాడులు జరుగుతుంటే శాంతిని పాటించాలని కోరుకున్నాం. కానీ.. ఇప్పుడు అదే పరిస్థితి మనవరకు వచ్చింది. భారత్‌ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వదు. దశాబ్దాలుగా ఇలాంటి దాడులు ఎదుర్కొన్న తర్వాత.. ఇప్పుడు తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. మనది దూకుడు కాదు.. దశాబ్దాల బాధకు సమాధానం. మన సాయుధ దళాలు శత్రు దేశంపై వీరోచిత పోరాటం చేస్తున్నాయి. మనల్ని, మన భూమిని, మన సార్వభౌమత్వాన్ని మన సైనికులు రక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కూడా ఐక్యంగా ఉంటూ వారికి మద్దతు ఇద్దాం. దాయది దేశం అరాచకత్వాన్ని ఇకపై చూసీచూడనట్లు ఉండేది లేదని.. గట్టిగా బదులిస్తామని వారికి తెలిసొచ్చేలా చేద్దాం. ఈ యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నన్ను బాధిస్తోంది. త్వరలోనే దీనికి శాశ్వతంగా ముగింపు పలకాలని ఆశిస్తున్నాను. మన సైనికుల కోసం ప్రార్థిస్తుంటాను ” అని జాన్వీ పేర్కొన్నారు.

 

➡️