ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ జూబ్లిహిల్స్, బంజారాహిల్స్లోని దిల్ రాజు ఇళ్లతోపాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివిధ పత్రాలను పరిశీలించారు. అనంతరం, దిల్ రాజు సతీమణి వైగారెడ్డిని కారులో తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లను పరిశీలించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ కార్యాలయాలు, ‘పుష్ప 2’ చిత్రం నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలోనూ ఐటి సోదాలు జరిగాయి. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
