విష్ణు మంచు ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల బెంగళూరులో ఈవెంట్ నిర్వహించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు సినిమా విశేషాలు మాట్లాడారు. ‘కన్నప్ప ప్రమోషన్స్ను కన్నడ నేల నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉంది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మొదటిసారిగా కన్నప్ప చిత్రాన్ని చేశారు. ఆ తరువాత శివ రాజ్ కుమార్ చేశారు. తెలుగులో బాపు రమణ దర్శకత్వంలో కృష్ణంరాజు భక్త కన్నప్ప చేశారు. మళ్లీ ఇప్పుడు మేం కన్నప్ప కథను చెప్పబోతున్నాం. ఈ తరానికి ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏమిటో క్లియర్గా చూపించాలనే ఈ సినిమా చేస్తున్నాం. ఇండియా నుంచి టీంను న్యూజిలాండ్కు తీసుకెళ్లాం. ఇతర దేశాల నుంచి కూడా టెక్నీషియన్లను తీసుకొచ్చాం. నాకు ఈ కన్నప్ప ఎంతో ప్రత్యేకం’ అన్నారు.
