Manoj – ‘ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా’ : మంచు మనోజ్‌

తెలంగాణ : ‘ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా’ అని మంచు మనోజ్‌ మీడియాతో అన్నారు. టాలీవుడ్‌ సీనియర్‌ హీరో మంచు మోహన్‌ బాబు కుటుంబంలో వివాదం రేగింది. తనపై దాడి చేశారని మంచు మనోజ్‌.. చిన్న కొడుకు మనోజ్‌తో ప్రాణ హాని ఉందని మోహన్‌ బాబు ఒకరిపై ఒకరు పోలీసుకు ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్‌ శివార్లలోని జల్‌పల్లిలో ఉన్న మోహన్‌ బాబు ఫామ్‌హౌస్‌ ‘మంచు టౌన్‌’కి మనోజ్‌తో పాటు మంచు విష్ణు కూడా బౌన్సర్లను పంపించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి బౌన్సర్లను బయటకు పంపించారు. అయితే తన అనుచరులను మాత్రమే పోలీసులు బెదిరిస్తున్నాడని మంచు మనోజ్‌ ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన అనుచరుల పేర్లు రాసుకొని మరీ బయటకు పంపిస్తున్నారని, వాళ్ల(మోహన్‌ బాబు, విష్ణు) బౌన్సర్లను మాత్రం లోపలికి పంపిస్తున్నారని ఆరోపించారు. ‘నేను డబ్బు కోసమో, ఆస్తుల కోసమో పోరాటం చేయడం లేదు.. ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాను. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. న్యాయం కోసం అందరిని కలుస్తాను’ అని మంచు మనోజ్‌ మీడియాతో తెలిపారు. అనంతరం భార్యతో కలిసి మోహన్‌బాబు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.

➡️