‘మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య సంబంధాలను కల్గివుంటారు. సహకారం, సృజనాత్మకతపై మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల ఇండిస్టీ ఎంతో ఉన్నతస్థాయికి చేరుకుంది. ప్రత్యేకంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడటానికి, అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైంది. ఈ విధంగా ప్రతి ప్రభుత్వంలోనూ మన పరిశ్రమ ద్వారా ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగిస్తూనే వస్తున్నాం. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సభ్యులందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించటంగానీ, వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకోవటం గానీ నివారించండి. కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి. మరికొన్ని విషాదకరమైనవి. వాటిపై చట్టం తన దారిలో తను న్యాయం చేస్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేస్తుంది. ఈ సమయంలో మనకు సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అనే సంగతి గుర్తించుకుందాం. ఏ సమస్య వచ్చినా, మనమంతా కలిసి వాటిని సమైక్యంగా ఎదుర్కొందాం’ అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షులు మంచు విష్ణు ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇటీవల జరిగిన పలు సంఘటనలను పురస్కరించుకుని ఆయన ఈ ప్రకటన చేశారు. సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డారు. కుటుంబంలో విబేధాలు రావటంతో మంచు ఫ్యామిలీలో కేసుల వరకూ గొడవలు వెళ్లాయి. దీంతో పలువురు చిత్ర పరిశ్రమ నుంచి తమ అభిప్రాయాలను సోషల్మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు చేసిన ప్రకటనపై తాజాగా అందరూ చర్చించుకుంటున్నారు.
