టాలీవుడ్.. బాలీవుడ్.. హాలీవుడ్.. ప్రపంచంలో సినిమా పరిశ్రమలు అనేకం ఉన్నా ఆధునీకతతో ఉన్న సమస్యలు నేడు సినిమా థియేటర్లు మూతపడే ప్రమాదం పొంచివుంది. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా ఇందులో కథానాయకుల దగ్గర నుంచి దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టులు ఇలా అందరీ పాత్రా ఉంది. ఇండిస్టీ నుంచి కొన్ని సమస్యలు ఉండగా, ఆయా ప్రభుత్వాల నుంచి మరికొన్ని చిక్కుముడులు కూడా ఉన్నాయి. వీటన్నింటికంటే కథానాయకుల రెమ్యూనరేషన్ డబుల్ డిజిట్కు మారటం ఒకటైతే… ఓటీటీ, పైరసీ భూతాలు వెంటాడుతుండటం తెలిసిందే. ఇక్కడ ఎవ్వరి బాధ్యత వారు పట్టించుకోకుండా రాజు గారి గంగాళాలో నీరు పోసిన చందంగా అందరూ వ్యవహరిస్తున్నారు. పరిశ్రమ పెద్దలు ఇండిస్టీలో సమస్యలపై నోరు మెదపరు. పైరసీ సమస్య చాలాకాలంగా సినీ పరిశ్రమను వేధిస్తోంది.
పారితోషికాలే ప్రధాన కారణమా?
సినిమా పరిశ్రమ ప్రారంభం నుంచి అప్పట్లో పాత తరం నటులు పారితోషికాలు సహేతుకమైన పద్ధతుల్లో తీసుకునేవారు. అలాంటి వారిలో ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు తదితరులు ఉండేవారు. ఆ తర్వాత తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి నటులు కొంతమేరకు సినిమా పరిశ్రమ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలంటూ భావించేవారు. ఇప్పుడు కొత్త జనరేషన్లో పెద్ద హీరోలకు రూ.50 కోట్లు నుంచి రూ.100 కోట్లు వరకూ రెమ్యూనరేషన్ ఉంటోంది. కథానాయకులతోపాటుగా ఆర్టిస్టులు, దర్శకులు కూడా ఇదే తరహాలో కోరుతున్నారు. పారితోషికాలు తడిచి మోపెడు అవుతుండటంతో నిర్మాతలకు నిర్మాణ వ్యయం వందల కోట్లలో పెరిగిపోతోంది. ఫలితంగా టిక్కెట్ల ధరలు ఆయా ప్రభుత్వాధిపతులను ఆశ్రయించి పెంచేసుకుంటున్నారు. నెలలో వచ్చే ఆదాయం వారం రోజుల్లోనే లాగేయాలనే తపన నిర్మాతల నుంచి వస్తోంది. దానికోసమే ప్రీమియర్లు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు ఇలా రక రకాల పేరుతో సినిమాలను ప్రదర్శిస్తూ అధికరేట్లు వసూలు చేస్తూ ప్రేక్షకుల జేబులు ఖాళీ చేయిస్తున్నారు. మామూలు రోజుల్లో ఉండే టిక్కెట్టు ధరలు విడుదలైన రోజు నుంచి వారం నుంచి 14 రోజుల వరకూ ఇలా ఎక్కువ ధరలకు అమ్ముకోవటానికి అవకాశం ఇస్తుండటంతో ప్రేక్షకులు సినిమాలకు వెళ్లటాన్ని తగ్గించేశారు.
సామాన్యులకు దూరం
గతంలో ప్రజలకు వినోద మాధ్యమంగా ఒక్క సినిమానే ఉండేది. సినిమా బాగుంటే ప్రేక్షకులు విరగబడి చూసేవారు. టికెట్ల ధరలు రూ.100 మించి ఉండేవి కాదు. ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని సినిమా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. అది ఒక్క థియేటర్లలోనే ప్రదర్శించేవారు. ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అంటూ రిలైజైన అతి తక్కువ రోజుల్లోనే, కొన్నయితే అదేరోజున ఇదే ప్లాట్ఫారలోకి వచ్చేస్తుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండటం లేదు. అదే సినిమా ఓటీటీ ప్లాట్ఫారలోనే చూసేస్తున్నారు. కుటుంబమంతా సినిమాకు వెళ్తే రూ.1000 నుంచి రూ.2000 అవుతున్న క్రమంలో ఓటీటీలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందరూ చూసేస్తున్నారు. గతంలో వినోదం నుంచి అన్ని తరగతుల కుటుంబాల్లో కొంత బడ్జెట్ కేటాయించేవారు. ఇప్పుడా బడ్జెట్ టిక్కెట్ల అధిక ధరలతో చాలక ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. సినిమా నిర్మాణ వ్యయాన్ని రాబట్టుకోవాలంటే ధరలు పెంచాల్సిందేనని నిర్మాతలు చెబుతుండగా, అంత ధరలు ఉంటే ప్రేక్షకులు ధియేటర్లకు ఎలా వస్తారంటూ ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా బుల్లితెరలో కొత్త, పాత సినిమాలు వెల్లువలా వస్తున్నాయి. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ టీవీల్లోనూ ఉంటోంది. ఫలితంగా థియేటర్లకు ప్రేక్షకులు నానాటికీ తగ్గిపోతున్నారు.
తినుబండారాలు, పార్కింగ్ భారమే!
థియేటర్ల ఆవరణలో గతంలో తినుబండారాల ధరలు అంతంతమాత్రంగానే ఉండేవి. సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్లు వచ్చిన తర్వాత ఏది తిందామన్నా రూ.100 పైబడే ఉంటున్నాయి. డ్రింకులు, తాగునీరు ధరలు కూడా అధికంగా ఉంటుతున్నాయి. ఏదైనా బయట నుంచి తీసుకెళ్లటానికి లేదు. లోపల విక్రయించింది ఎలా ఉన్నా తినటం తప్ప మరో మార్గం లేదు. కొంటే జేబుకు చిల్లు పడటం ఖాయం. వాహనాల పార్కింగ్ ధరలు కూడా గతంలో రూ.10 ఉండేది. ఇప్పుడు రూ. 20 పైబడి వసూలు చేస్తున్నారు.
పైరసీ కూడా కారణమే
గతంలో ఈ జాడ్యం లేదు. ఇటీవల బాగా పెరిగింది. సినిమా విడుదలైన గంటకే పైరసీ సీడీలు మార్కెట్లోనూ, సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏ సినిమా సినిమా మూడు, నాలుగు బాషల్లో విడుదల చేస్తుండటంతో ఎక్కడో ఒకచోట థియేటర్లలో పైరసీని ఎక్కిస్తున్నారు. ఇది ట్రెండింగ్ అవుతుండటంతో ప్రేక్షకులు కూడా వాటిని చూడటానికి అలవాటు పడుతున్నారు. పైరసీ నేరమని తెలుసు. కానీ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అయిపోతుంటాయి. వాటి నియంత్రణకు ఇండిస్టీ పెద్దలుగానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ముందుకు రారు. ఏదో పెద్ద సినిమా విడుదల సమయంలో ఒకటి, రెండు రోజులు హడావుడి చేసి ఆ తర్వాత మిన్నకుండి పోతుంటారు. ఇటీవల వచ్చిన ‘తండేల్’ సినిమా తమిళ వెర్షన్ పైరసీకి గురైంది. ఆ తర్వాత దాని తెలుగు వెర్షన్ కూడా వచ్చేసింది. అది హిట్ మూవీ కావటంతో కొంతైనా తట్టుకుంది. లేకపోతే నిర్మాత పరిస్థితి అథ:పాతాళానికి వెళ్లక తప్పదు. సినిమా పరిశ్రమలో పెద్దలుగా చలామణి అవుతున్న వారు చాలామంది ఉన్నారు. వారు ఇలాంటివి జరిగినప్పుడు ముందుకొచ్చి సమస్య పరిష్కారం దిశగా కృషిచేయాల్సివుంది. రాష్ట్రప్రభుత్వం కూడా పైరసీ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. ఇండిస్టీ, ప్రభుత్వం సమిష్టిగా కృషిచేసి పటిష్టమైన చట్టం చేస్తే పైరసీ భూతాన్ని కట్టడి చేయొచ్చు.