హైదరాబాద్ : సినిమా రంగుల ప్రపంచంలో ఎన్నో చరిత్రలు దీనావస్థలోనే ముగిసిపోయాయి. ఆకాశాన్నంటే తారల్లా వెలుగొందిన బతుకులు ఒక్కసారిగా కఠిక పేదరికాన్ని చవిచూశాయి. చాలామంది నటీనటులు ఇండస్ట్రీ లో పేరు తెచ్చుకున్నా … ఆర్థికంగా చితికిపోయి బతుకు వెళ్లదీస్తుంటారు. తెలుగు సీనియర్ నటి పావలా శ్యామల తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలు. చిరంజీవి, వెంకటేశ్, నాని, గోపీచంద్.. ఇలా చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు… కానీ ఆమె ఆర్థికంగా స్థిరపడలేకపోయారు. ప్రస్తుతం అనాథాశ్రమంలో బతుకు వెళ్లదీస్తున్నారు..!
గత కొన్నాళ్ల నుంచి పావలా శ్యామల దీనస్థితి గురించి ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది. నటుడు కాదంబరి కిరణ్ కూడా ఈమెకు మనం ఫౌండేషన్ తరఫున రూ.25 వేల వరకు సాయం చేశారు. ప్రస్తుతం వీల్ ఛైర్ కే పరిమితమైన పావలా శ్యామల.. తాజాగా ఓ రియాలిటీ షోకు వచ్చారు. ఆమె చెప్పిన మాటలు అక్కడివారందరినీ కంటతడిపెట్టించాయి.
” అందరు హీరోలతో నటించాను. అన్ని హిట్ సినిమాల్లో ఉన్నాను. కానీ చివరకు నా బతుకు ఇలా అవుతుందనుకోలేదు. ఇంతటి దుస్థితి వస్తుందని ఊహించలేదు. నా కష్టాలని చెప్పుకొని మిమ్మల్ని బాధపెట్టాలని మళ్లీ మీ ముందుకు రాలేదు. నేను బతికుండి మళ్లీ మిమ్మల్ని చూస్తానో లేదో అనే భయంతో, ఒకసారి మీకు కనిపించి మీ అభిమానం పొందాలని ఇప్పుడు వచ్చాను ” అని పావలా శ్యామల చెప్పడంతో అక్కడివారంతా కంటతడిపెట్టారు.