న్యూఢిల్లీ : ప్రముఖ తెలుగు సిటీ నటుడు, హిందూపురం ఎంఎల్ఎ నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి బాలకృష్ణ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ప్రముఖ తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ కూడా పద్మ భూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న మొత్తంగా 139మందికి పద్మ అవార్డులను ప్రకటించగా, వారిలో 71మందికి సోమవారం అవార్డులను అందజేశారు. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రభృతులు హాజరయ్యారు. త్వరలో జరగబోయే మరో కార్యక్రమంలో మిగిలిన వారికి అందజేయనున్నారు. సోమవారం పురస్కారాలు స్వీకరించిన వారిలో ప్రముఖ హిందీ చిత్ర దర్శకుడు, నటుడు శేఖర్ కపూర్, ఆసియాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఎఐజి హాస్పిటల్స్ చైర్మన్ డి.నాగేశ్వర్రెడ్డి, వయొలిన్ విద్వాంసులు లక్ష్మినారాయణ సుబ్రమణ్యం ప్రభృతులు వున్నారు. వీరిలో నలుగురు పద్మ విభూషణ్ అందుకున్నారు. వారిలో సుజుకి మోటార్ మాజీ చీఫ్ ఒసాము సుజుకి (మరణానంతరం), సుబ్రమణ్యం, నాగేశ్వర్ రెడ్డి, మలయాళం రచయిత, చలన చిత్ర దర్శకులు ఎం.టి.వాసుదేవన్ నాయర్(మరణానంతరం) వున్నారు.
మొత్తంగా పదిమందికి పద్మ భూషణ్ అవార్డులు అందజేశారు. వారిలో నటులు నందమూరి బాలకృష్ణ, శేఖర్ కపూర్, ప్రముఖ తమిళ నటుడు ఎస్.అజిత్ కుమార్, గాయకుడు పంకజ్ ఉదాస్ (మరణానంతరం), బీహార్ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ (మరణానంతరం), మాజీ హాకీ ఆటగాడు పి.ఆర్.శ్రీజేష్, జైడస్ లైఫ్సైన్సెస్ ఛైర్పర్సన్ పంకజ్ పటేల్, ఫాదర్ ఆఫ్ ది పెంటియంగా అందరికీ చిరపరిచితులైన ఇండియన్ అమెరికన్ ఇంజనీర్ వినోద్ ధామ్ ఉన్నారు.
