‘చావా’ సినిమా విడుదల నేపథ్యంలో రష్మిక పలు విషయాలను ముచ్చటించారు. జీవితాన్ని తాను సీరియస్గా తీసుకోనని చెప్పారు. ‘ప్రతి దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తే జీవితం చాలా కష్టతరమవుతుంది. అందుకే నేను దేన్నీ సీరియస్గా తీసుకోను. కాలంతోపాటు ముందుకు సాగుతాను. నిజాయితీగా నా పని చేసుకుంటూ పోతాను. ఎవరైనా సినిమా కోసం సంప్రదించినప్పుడు కథకు ప్రాధాన్యమిస్తా. కథ బాగుంటే నలుగురు పిల్లల తల్లిగానైనా నటిస్తాను. బామ్మ పాత్ర చేయడానికి కూడా వెనుకాడను. కథ నచ్చి అందులో నేను భాగం కావాలనుకున్నప్పుడు ఇలాంటి పట్టింపులు ఉండవు. నా సినిమాల విజయం వెనక ఎలాంటి ప్రణాళికలు లేవు. నేను పోషించిన పాత్రలు ప్రేక్షకులు ఇష్టపడుతున్నందుకు ఆనందంగా ఉంది. సినిమాల విజయం మన చేతిలో ఉండదు’ అని చెప్పారు. ప్రస్తుతం రష్మిక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ఫ్రెండ్’, సల్మాన్ఖాన్-మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘సికిందర్’, అలాగే ధనుష్-శేఖర్ కమ్ముల ఫిల్మ్ ‘కుబేర’ చిత్రాల్లో నటిస్తున్నారు.
