ముంబై : చెక్బౌన్స్ కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్ కోర్టు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకి మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2018లో రాంగోపాల్ వర్మపై చెక్బౌన్స్ కేసు నమోదైంది. మహేష్చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతుంది. కానీ ఒక్కసారి కూడా దర్శకుడు వర్మ విచారణకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాబోయే మూడు నెలల్లో వర్మ ఫిర్యాదు దారుడికి రూ. 3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లేదంటే మూడు నెలలు వర్మ సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించింది.
