తెలంగాణ : ” విచక్షణ లేని వ్యక్తులతీరుపై అసహ్యం వేస్తోందని… తన కుమార్తె కన్నీళ్లు వారిని వెంటాడతాయి ” అని సినీనటి రేణుదేశాయి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనను అవమానపరిచేలా ఉన్న మీమ్స్ను చూసి తన కుమార్తె ఆద్య ఎంతో ఏడ్చిందని రేణుదేశాయి తెలిపారు. అలాంటి మీమ్స్ రూపొందించిన వారిపై ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా తీవ్రంగా ధ్వజమెత్తారు.
సినీ నటి రేణు దేశాయ్ ను అవమానపరిచేలా మీమ్స్..
జూన్ 12న ఎపి మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పవన్ తన భార్య, పిల్లలతో కలిసి మంగళగిరిలోని నివాసానికి బయలుదేరారు. మార్గమధ్యలో ట్రాఫిక్ జాం అవ్వడంతో రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి వారు సరదాగా ఫ్యామిలీ ఫొటో దిగారు. ఈ ఫొటోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో చక్కర్లు కొట్టింది. క్యూట్ ఫొటో అంటూ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. అయితే ఆ ఫొటోను ఉపయోగించి సినీ నటి రేణు దేశాయ్ ను అవమానపరిచేలా కొందరు వ్యక్తులు మీమ్స్ రూపొందించడంతో వారిపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులను చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్టు చేశారు.
తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న పోస్టు చూసి నా కుమార్తె విపరీతంగా ఏడ్చింది : రేణు దేశాయి
” ఆ ఫొటోను నేను ఏ విధంగా క్రాప్ చేస్తానని, ఎలా పోస్టు చేస్తానని మీమ్స్, జోక్లు పేల్చే భయంకరమైన వ్యక్తులూ … మీకూ ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును ఇన్స్టాలో చూసి నా కుమార్తె విపరీతంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోండి. ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా, ఇంటర్నెట్ అకౌంట్లను సులభంగా యాక్సెస్ చేసి, విచక్షణ లేని వ్యక్తులుగా ఎదుగుతున్న తీరును చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తోంది. ఈ రోజు నా కుమార్తె ఎంతో బాధ అనుభవించింది. ఆమె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయని గుర్తుంచుకోండి. పొలినా, మార్క్ సైతం ఇలాంటి విచక్షణ లేని కామెంట్లు, మీమ్స్తో ప్రభావితం అవుతారు. ఇలాంటి మీమ్ పేజీలను నిర్వహించేవారు సమాజంలో అత్యంత భయంకరమైన వ్యక్తులు. ఈ తల్లి శాపం మీకు కచ్చితంగా తగులుతుంది. ఈ పోస్టు చేయడానికి ముందు వంద సార్లు ఆలోచించాను. అయితే నా కుమార్తె కోసం, ఆమె అనుభవించిన బాధను దృష్టిలో ఉంచుకొని పోస్టు చేశాను ” అని రేణు దేశాయ్ పేర్కొన్నారు.