దాసరి పేరుతో ఉత్తమ డైరెక్టర్‌ అవార్డులివ్వాలి

May 5,2025 21:18 #Film Industry

తెలుగు సినిమా చరిత్రలో శతాధిక చిత్రాలు తెరకెక్కించిన తొలి దర్శకునిగా గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించుకున్న దర్శకరత్న దాసరి నారాయణ రావు పేరు మీదుగా ఉత్తమ డైరెక్టర్‌ అవార్డును ప్రకటించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రధాన కార్యదర్శి జెవి మోహన్‌గౌడ్‌, సినిమారంగ ప్రముఖులు, మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహనకృష్ణ కోరారు. తెలుగు చిత్ర దర్శకరత్న దాసరి నారాయణరావు 78వ పుట్టినరోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. అమరావతిలోని ఎపి ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోహన్‌ గౌడ్‌, మధుమోహనకృష్ణ మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమ వైభవానికి దాసరి ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు. పరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరా బాద్‌కు తరలివచ్చిన తర్వాత నిలదొక్కుకునేందుకు శక్తివంచన లేకుండా పనిచేశారన్నారు. కోశాధికారి ఎం.శ్రీనాథరావు, కార్యవర్గ సభ్యులు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, గుంటూరు జిల్లా కోఆర్డినేటర్‌ పిచ్చిరెడ్డి, ఛాంబర్‌ సభ్యులు పరిటాల రాంబాబు, అమ్మా రమేష్‌, బిగ్‌బ్యాంగ్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంలో ఎపి ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆ జిల్లా కోఆర్డినేటర్‌ సాయిపవన్‌ సుంకర, భువనేశ్వరి ఫిలిం స్టూడియోస్‌ తరపున నిర్మాత భువన, నరసింహులు, దేవాప్రశాంత్‌, రామకృష్ణారెడ్డి, నాగ మునీంద్ర, పరుచూరి భవానీ రవిశంకర్‌, మహిళా ప్రతినిధి రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఒన్‌టౌన్‌లోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఎపి ఫిల్మ్‌ ఇండిస్టీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఎపిమా) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్‌ నటులు పిల్లా ప్రసాద్‌, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకరన్‌, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, కళారంగ ప్రముఖులు గోళ్ల నారాయణరావు తదితరులు మాట్లాడారు. తోరం రాజా, వీరంకి వెంకట నరసింహారావు, పోలుదాసు రంగ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️