చిత్ర పరిశ్రమలో బాలనటులకు కొదవలేదు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్రనటులుగా కొనసాగుతున్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్బాబు, అల్లు అర్జున్ ఇలా చాలామంది నటులు బాలనటులుగా అరంగ్రేటం చేసిన వారే. ఆతర్వాత కెరీర్లో దూసుకుపోతూ ముందుకు సాగుతున్నారు. వారసత్వంగా కాకుండా మరికొందరు కేవలం ప్రతిభ ఆధారంగా బాలనటులుగా తెరపైకి వస్తూ సంచనాలు సృష్టిస్తున్న వారు సైతం ట్రెండ్ సెట్టర్లుగా మారుతున్నారు. ఇదే కోవలోకి సుకృతి శాంతి, రిత్విక్, గగనగీతిక, భానుప్రకాష్; రేవంత్ తదితరులు ఉన్నారు.
‘పిల్లలు..దేవుడు చల్లని వారే… కల్ల కపటమెరుగని కరుణామయులే’ అంటూ సాగే ఈ పాట ‘లేత మనసులు’ చిత్రంలోనిది. నాటికీ, నేటికీ ఆ పాట ఆ పాటమధురంగా తెలుగునాట మార్మోగు తూనేవుంది. నాటి సినిమాల్లో బాలల జీవనం, అవస్థలు వంటివి సినిమాల్లో పట్టిచూపేవి. ఇప్పుడు పెద్దలను తిట్టేవారిగానూ, జులుయిలుగా కొందరు బాలలను చూపుతుండటం కొంత ఇబ్బందికరంగానే ఉంటోంది. ఏ పాత్రల్లోనైనా ఒదిగిపోయి వాటిల్లో జీవించేలా నటించే సత్తా నేటి బాలబాలికలకు ఉంది. వారసత్వంగా వచ్చిన నటన, సిఫార్సులతో కాకుండా తమ సొంత ప్రతిభతో రాణించేందుకు ముందుకు దూకుతున్నారు. మాటతీరు, అభినయం, వ్యక్తీకరణలు అదుర్స్ అనేలా ఉంటున్నాయి. గతేడాది ఈ ఏడాది ఆరంభంలోనూ తెలుగు సినిమా పరిశ్రమలో కొత్తగా బాలనటుల హవా కొనసాగుతోంది. పిల్లలతో తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు చేస్తుండటంతో నిర్మాతలు, దర్శకులు బాలనటులను ప్రోత్సహిస్తున్నారు.
‘లక్కీ భాస్కర్’ సినిమాలో మెరిసిన రిత్విక్ చక్కగా నటించాడు. ఎంతో ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. డైలాగులు మర్చిపోకుండా చెబుతుండటం మరో గొప్ప విషయం. ముఖకవలికలు, మాటల తీరు బాగుండటంతో పలు సినిమాల్లో అతడికి ఛాన్సులు వస్తున్నాయి. జైలర్ సినిమాలో రజనీకాంత్ మనువడి పాత్రలో రిత్విక్ నటించారు. ఇతడికి ‘రిత్విక్ రాక్స్’ పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. తండ్రి జ్యోతిరాజ్ ఈ బాధ్యతలను చూస్తున్నారు. 2023 ఆగస్టు నాటికి రిత్విక్ రాక్స్ 2.36 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. నయనతార నటించిన 02 (ఆక్సిజన్) అనే సినిమాలోనూ కొడుకుగా నటించారు. ఆ తర్వాత కార్తీ హీరోగా వచ్చిన ‘సర్దార్’ సినిమాలోనూ కొడుకుగా నటించారు.
సుకుమార్ తనయి సుకృతి శాంతి సందేశాత్మకంగా, ప్రకృతి ప్రేమికురాలిగా ‘గాంధీతాత చెట్టు’లో నటించింది. ఆమె నటనకు ప్రేక్షకులే కాదు, సెలబ్రిటీలూ ప్రసంశలు కురిపించారు. సుకృతి నటనకుగానూ, ఉత్తమ బాలనటిగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. దర్శకురాలు పద్మావతి తీసిన చిత్రం ‘గాంధీతాత చెట్టు’. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24న ఈ సినిమా విడుదల చేశారు. ఇందులో సుకృతి ‘గాంధీ’ అనే పాత్రలో నటించింది. తనకిది మొదటి సినిమా. అయినా ఎక్కడా తడబడకుండా అద్భుతంగా నటించింది.
డాకు మహారాజ్ సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన బాల నటి ‘గగనగీతిక’. టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ‘పిట్ట కొంచెం… కూత ఘనం’ ఆనే సామెతను గుర్తు చేస్తూ… నాలుగున్నరేళ్ల ప్రాయంలోనే టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఇండిస్టీ దృష్టిని ఆకర్షించి… ‘లాయర్ విశ్వనాథ్’ చిత్రంతో బాలనటిగా అరంగేట్రం చేసిన ఈ చిచ్చరపిడుగు..రెండవ మూవీ . ఆర్.ఆర్.ఆర్, నారప్ప, 18 పేజీస్, తెల్లవారితే గురువారం’ తదితర చిత్రాల్లో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలతో తన ప్రతిభకు మరింత సానబెట్టుకుంది. 90′ శాతం మిడిల్ క్లాస్ బయోపిక్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్, ప్రేమ విమానం” చిత్రాలలోనూ నటించి మెప్పించారు. ‘ఓదెల రైల్వే స్టేషన్-2 చిత్రంలో తమన్నా చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తోంది. ఆయన తండ్రి శ్రీతేజ్ కూడా ఇండిస్టీలోనే ఉన్నారు. సంప్రదాయ కూచిపూడితోపాటుగా వెస్ట్రన్ డాన్స్ను కూడా సాధన చేస్తున్నారు.
ప్రతిభకు ఎల్లలు లేవని నిరూపిస్తున్నాడు ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమిల్లికి చెందిన భీమాల శ్రీనివాసరావు, దేవి దంపతుల కుమారుడు రేవంత్ పవన్ సాయిసుభాష్ (బుల్లిరాజు). సంక్రాంతికి వస్తున్నాంలో బాల నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అతడి వీడియోలను చూసినా దిల్రాజ్, అనిల్రావిపూడి ఇతడికి అవకాశం కల్పించారు.రేవంత్ నిడమర్రు మండలం బావాయిపాలెం చైతన్య పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ సినిమా కోసం మూడు నెలలపాటు సెలవులు సైతం పెట్టాడు. ఇదే గ్రామానికి చెందిన ఎంఎస్ నారాయణ హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు చానమిల్లికి చెందిన భీమాల రేవంత్ బాలనటుడిగా ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
కెజిఎఫ్ సినిమాలో నటించిన బాలనటుడు మాస్టర్ భానుప్రకాష్కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. భానుతోపాటుగా మాస్టర్ పుష్కర్లు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శిశిరంలో నటిస్తుండటం అందరి దృష్టి భానుపై పడింది. కెజిఎఫ్ 2లోనూ నటిస్తున్నారు. తండ్రి సురేష్ అమాస సినిమాలంటే ఇష్టం కావటంతో కొన్ని లఘు చిత్రాలు తీశాడు. వాటిలో ఒక చిత్రంలో చిన్న పిల్లాడి క్యారెక్టర్ కోసం ఎక్కడెక్కడో వెతికినా తగిన వాళ్లు దొరకలేదు. విసుగొచ్చి తన కొడుకుతోనే చేయించాడు. తొలి ప్రయత్నంలోనే యాక్టింగ్, డైలాగ్స్ అదరగొట్టాడు భాను. దీంతో అల్లు శిరీష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ల కోసం ప్రయత్ని స్తున్నారని తెలిసి అడిషన్స్కు తీసుకెళ్లగా వెంటనే అవకాశం ఇచ్చేశారు. ఎన్టీఆర్ : కథానాయకుడు, వెంకీమామ, సరిలేరు నీకెవ్వరు, లవ్స్టోరీ, గమనం ఇలా దాదాపు 30 సినిమాల్లో నటించాడు. తమ డబ్బింగ్ కూడా తానే చెబుతున్నాడు.