‘థగ్లైఫ్’ తో దర్శకుడు మణిరత్నం మల్టీస్టారర్కు సరికొత్త అర్థం చెప్పబోతున్నారని కమల్హాసన్ అన్నారు. ఇటీవల జరిగిన ఎఫ్సీసీఐ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘థగ్లైఫ్’ ఓ మల్టీస్టారర్. ఇందులో చేస్తున్న నటీనటులు భవిష్యత్లో గొప్ప స్టార్స్ అవుతారు. అలాంటివాళ్లను ఈ మూవీలో భాగం చేయడం వల్లే ఇది మల్టీస్టారర్ అయింది. ఇలా అగ్ర నటులు, యువ నటుల కలబోతగా మూవీ తీయాలన్నది మణి ఆలోచన. దానిని నాతో పంచుకున్న వెంటనే నాకూ నచ్చింది. అందుకే ఇది కార్యరూపం దాల్చింది. ఇక ఇందులో అనేక పాత్రలున్నాయి. మలయాళం, హిందీ, తెలుగు సినిమాల్లోని విలక్షణ నటులు ఆయా పాత్రల్లో కనిపిస్తారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటులు మనకు ఉన్నారు. ప్రతిఒక్కరికీ ఒక్కో సామర్థ్యం ఉంది. అది వారికే సొంతం’ అని కమల్హాసన్ పేర్కొన్నారు. శింబు, త్రిష, నాజర్, అభిరామి, జోజూజార్జ్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, మహేశ్ మంజ్రేకర్, అలీ ఫజల్ వైయాపురి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వేసవి కానుకగా జూన్ 5న ఈ మూవీ విడుదల చేయనున్నారు.
