” మీ ఇద్దరినీ చంపేస్తా – రోడ్డుకీడుస్తా ” : విజయశాంతి దంపతులకు బెదిరింపులు

తెలంగాణ : ” మీ ఇద్దరినీ చంపేస్తా – రోడ్డుకీడుస్తా ” అని సినీ నటి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను బెదిరిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు విజయశాంతి దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగుచూసింది. విజయశాంతి భర్త శ్రీనివాస్‌ ప్రసాద్‌కు కొన్నాళ్ల క్రితం చంద్రశేఖర్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను సోషల్‌ మీడియాలో ప్రమోషన్స్‌ చేస్తానని చెప్పడంతో … విజయశాంతి అకౌంట్‌ మెయిన్‌టైన్‌ చేయాలని శ్రీనివాస్‌ కోరారు. కొద్దిరోజులపాటు విజయశాంతి గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేయాలని, పనితీరు నచ్చితే కాంట్రాక్ట్‌ చేసుకుందామని చెప్పారు. ఆ కాలానికి కూడా వారు అతడికి బాగానే డబ్బిచ్చారు. అయితే చంద్రశేఖర్‌ పనితీరు నచ్చకపోవడం, సరైన ఫలితాలు రాకపోవడంతో శ్రీనివాస ప్రసాద్‌ అతడిని ఆఫీసు నుంచి పంపించేశారు. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న చంద్రశేఖర్‌.. ఇటీవల శ్రీనివాస్‌ ప్రసాద్‌కు మెసేజ్‌ చేశాడు. డబ్బులు ఎప్పుడిస్తారంటూ నిలదీశాడు. కాంట్రాక్ట్‌ కుదుర్చుకోకుండానే డబ్బులు ఎలా ఇస్తామని ఆయన అడగ్గా అసభ్యంగా దూషించాడు. ఏదైనా ఉంటే ఆఫీసుకి వచ్చిన మాట్లాడాలని ఆయన చెప్పగా తాను రానని చెప్పాడు. మరోవైపు … తనకు డబ్బులు ఇవ్వాలంటూ విజయశాంతి భర్తకు చంద్రశేఖర్‌ మెసేజ్‌లు, మెయిల్స్‌ పంపుతూ వేధించసాగాడు. వాటికి శ్రీనివాస్‌ స్పందించకపోవడంతో.. చివరికి డబ్బులు ఇవ్వకపోతే నిన్ను, నీ భార్య విజయశాంతిని రోడ్డు మీదికి ఈడుస్తా.. ఇద్దరినీ చంపేస్తానంటూ చంద్రశేఖర్‌ బెదిరింపులకు దిగాడు. దీంతో విసిగిపోయిన విజయశాంతి దంపతులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️