
బహిష్కరించిన బిఆర్ఎస్, ఆప్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యురో :ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి అవినీతే అతి పెద్ద శత్రువు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సెంట్రల్ హాలులో ఉభయసభల సభ్యుల నుద్దేశించి ఆమె ప్రసంగించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ద్రౌపది ముర్ము లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే మొదటిసారి. దేశం ఆత్మ నిర్భర్ భారత్గా ఆవిర్భవిస్తోందని చెప్పిన ఆమె ఆ ప్రస్తానానికి అవినీతే ఆటంకంగా మారిందని అన్నారు. అవినీతిపై తన ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని అన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడి, పరారయ్యే నేరగాళ్ళ ఆస్తులను జప్తు చేసేందుకు ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్ను తన ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అవినీతి రహిత దేశంగా మారే దిశగా భారత్ పయనిస్తోందన్నారు. వరుసగా రెండుసార్లు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విధానపరమైన వ్యూహాన్ని సమూలంగా మార్చే దృఢ నిశ్చయాన్ని ప్రదర్శిస్తుందన్నారు. 2047 నాటికి మన దేశాన్ని పూర్వ వైభవం, ఆధునిక కాలపు సువర్ణాధ్యాయాల అనుసంధానంతో నిర్మించాలని ఆకాంక్షించారు. నేడు ప్రపంచం మనల్ని చూస్తున్న తీరు అద్భుతమని తెలిపారు. గతంలో మనం ప్రపంచంపై ఆధారపడేవారమని, ఇప్పుడు ప్రపంచమే మనపై ఆధారపడుతోందని చెప్పారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపగలుగుతున్నామని చెప్పారు. పేదరికంలేని దేశాన్ని నిర్మించాలన్నారు. మధ్య తరగతి ప్రజలు కూడా సంపన్నులు కావాలన్నారు. సమాజానికి, దేశానికి దిశా నిర్దేశం చేయడానికి యువత, నారీశక్తి ముందు వరుసలో ఉండాలని తెలిపారు పన్ను చెల్లింపుదారులు తాము చెల్లించిన పన్ను రిఫండ్ కోసం గతంలో సుదీర్ఘ సమయం ఎదురు చూడవలసి వచ్చేదని తెలిపారు. నేడు ఐటిఆర్ ను దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే రిఫండ్ పొందగలుగుతున్నారన్నారు. నేడు పారదర్శకతతోపాటు జిఎస్టి ద్వారా పన్ను చెల్లింపుదారుల గౌరవ, మర్యాదలకు భరోసా లభిస్తోందని తెలిపారు. ఒక దేశం-ఒకే రేషన్ కార్డ్, జన్ ధన్-ఆధార్-మొబైల్ నంబర్ల అనుసంధానం వల్ల నకిలీ లబ్ధిదారులను తొలగించగలిగినట్లు తెలిపారు. అతి పెద్ద శాశ్వత సంస్కరణను అమలు చేశామని చెప్పారు. కొన్నేళ్ల నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డిజిటల్ ఇండియాతో శాశ్వత, పారదర్శక వ్యవస్థను సిద్ధం చేసిందన్నారు.
రక్షణ రంగంలో పెరిగిన ఎగుమతులు
ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా రక్షణ రంగంలో ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయని ద్రౌపది ముర్ము చెప్పారు. ఐఎన్ఎస్ విక్రాంత్ రూపంలో తొలి స్వదేశీ విమాన వాహక నౌక నావికా దళంలో చేరడం గర్వకారణమని తెలిపారు. మానవతావాద కర్తవ్యాలను నెరవేర్చగలిగే స్వయం సమృద్ధ దేశాన్ని మనం నిర్మించాలన్నారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బిఆర్ఎస్, ఆప్ బహిష్కరించాయి.