పిల్లలు బాగా ఇష్టపడేది డ్యాన్స్ చేయటం. కొద్దిగా ప్రోత్సహిస్తే కిర్రాక్ డ్యాన్స్లతో దుమ్ము దులిపేస్తారు. అదే డ్యాన్స్ మాస్టర్ వద్ద శిక్షణ ఇస్తే టాపు లేపేస్తారు. పాటకు తగ్గ రిథమ్తో డ్యాన్స్లు చేయటం పిల్లలకు బాగా ఇష్టం. పిల్లల్లో డ్యాన్స్ నైపుణ్యాన్ని వెలికితీయటం ద్వారా వారిని ప్రోత్సహించటానికి జాషువా సాంస్క ృతిక వేదిక శ్రీకారం చుట్టింది. సినిమాల్లోని కొత్త, పాటలు, జానపదాలు, సాంఘిక గేయాలు, కోలాట పాటలు ఏదైనా సంగీతానికి అనుగుణమైన బాణీతో పిల్లలు డ్యాన్స్ కడుతుండటం చూడముచ్చటగా సాగుతోంది.
విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె) సహకారంతో జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక సాహిత్య, సాంస్కృతిక, కళలను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యార్థినీ విద్యార్థుల్లో నిబిడీకృతమైన సృజనాత్మక శక్తులను వెలికితీసే అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగానే ఈ ఏడాది వేసవిని పురస్కరించుకుని ఆ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలోని విద్యాధరపురం రాయల్ పబ్లిక్ స్కూల్, సింగ్నగర్ ప్రకాష్నగర్ రుషి పబ్లిక్స్కూల్, కృష్ణలంక రాణీగారితోట బాలాజీనగర్ మహితా పబ్లిక్స్కూల్, క్రీస్తురాజపురంలోని అంబేద్కర్ పూలే భవన్లో ఈ శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇందులో వందలాది మంది వరకూ పలు బ్యాచ్లుగా శిక్షణలు పొందుతున్నారు.
కిర్రాక్ డ్యాన్స్లు… అదిరేటి స్టెప్పులు
వారంతా పిల్లలు.. డ్యాన్స్ల్లో దుమ్ములేపుతున్నారు. డ్యాన్స్ మాస్టర్లు స్పెప్పులు ప్రాక్టీస్ చేయిస్తుంటే పిల్లలు చాలా చక్కగా చూడముచ్చటగా నర్తిస్తున్నారు. కిర్రాక్ డ్యాన్స్లతో అదరగొడుతున్నారు. బ్రేక్, రాక్ డ్యాన్సులతో కేక పుట్టిస్తున్నారు. బేసిక్ మెథడ్స్ నుంచి అన్ని ఫండమెంటల్ స్టెప్స్ నేర్పిస్తున్నారు. డ్యాన్స్ నేర్చుకోవటానికి ఐదు నుంచి 75 సంవత్సరాలలోపు వయస్సు వారెవరైనా మూడు స్టెప్టులు ముందుగా నేర్చుకోవాలి. అందులో లెప్ట్లెగ్, రైట్ లెగ్ మూమెంట్స్, బాడీవేవ్స్ డిపరెంట్ మూమెంట్స్లో డ్యాన్స్ను నేర్పిస్తున్నారు. ఒన్టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవన్ ఎయిట్ అంటూ స్టప్పులు మూవెంట్స్ ఇస్తుంటే పిల్లలు చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సినిమాల్లోని పాత, కొత్త పాటలకు వీరు ఎంచక్కా డ్యాన్సులు చేసేస్తున్నారు. వెస్ట్రన్, జానపద పాటలకు కూడా చక్కగా స్టెప్పులు వేసేస్తున్నారు. వీరికి డ్యాన్స్ మాస్టర్లు విక్టర్ ఆదిత్య, క్రాంతికుమార్- తిలక్, గోపి, వాసుదేవరావు నేర్పిస్తున్నారు. బి.రాంబాబు, ఎన్.హరినారాయణ, ఎ.అనిల్కుమార్, పి.మురహరి, గంథం అంజిబాబులతో పాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విజయవంతానికి కృషిచేస్తున్నారు.
విజ్ఞానదాయకం.. దేశభక్తియుతం
విజయవాడలో నాలుగు కేంద్రాల్లో జరుగుతున్న ఈ డ్యాన్స్ సమ్మర్ క్యాంపులో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహపూరిత వాతావరణంలో పాల్గొంటున్నారు. సినిమాల్లో వేసే చెత్తడ్యాన్సులు కాదండోరు వీరు నేర్చుకునేది. కొన్నిచోట్ల పెళ్లిళ్లు, ఇతర సంబరాలు, ఉత్సవాల్లో మాదిరిగా వెలికి డ్యాన్సులు కాదు వీరు నేర్చుకునేది. పిల్లలకు విజ్ఞానం..సరికొత్త నైపుణ్యత పెంచేలా చక్కటి డ్యాన్సులు నేర్పిస్తున్నారు. రికార్డింగ్ డ్యాన్స్ల మాదిరిగా కాకుండా సందేశాత్మక పాటలకు డ్యాన్స్లు నేర్పిస్తున్నారు. విజ్ఞానదాయకమైన గీతాలను నిర్వాహకులు ఎంపిక చేయగా వాటినే నేర్పిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను గుర్తుచేసే పాటలను సైతం నేర్పిస్తున్నారు. ప్రతిరోజూ ఒక్కో సెంటరులో ఐదు గీతాలను నేర్పిస్తూ ఆ తర్వాత ప్రాక్టీస్ చేయిస్తున్నారు. జానపదం, వెస్ట్రన్, జాతీయ నాయకుడు, పండుగ, సామాజిక అంశాలపై పాటలను నేర్పిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9, సాయంత్రం 4 గంటలకు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఈ డ్యాన్స్ శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పిల్లలు సందడిగా ఈ శిబిరాల్లో పాల్గొంటూ క్రమశిక్షణతో మెలుగుతూ నృత్యాలు నేర్చుకుంటున్నారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు వీరికి సహకరిస్తుండగా పిల్లలే బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమాలు విజయవంతానికి కృషిచేస్తున్నారు.
15న ‘డ్యాన్స్ హంగామా’
టీవీలో డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ కోసం ఔత్సాహికులతో ‘ఢ’ పోగ్రాం నిర్వహిస్తుంటారు. అలాంటి పోగ్రామ్ను తలపించేలా ‘డ్యాన్స్ హంగామా’ కార్యక్రమాన్ని జాషువా సాంస్కృతిక సంస్థ ఏర్పాటు చేసింది. నాలుగు శిబిరాల్లో శిక్షణ పొందిన వారే కాకుండా మరికొంతమంది ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఈనెల 15వ తేదీతో ఈ డ్యాన్స్ శిబిరాలు ముగియనున్నాయి. పిల్లలే తమకు అవసరమైన మెటీరియల్ను సిద్ధం చేసుకుని ఆఖరి రోజున ఎంబివికెలోని చుక్కపల్లి పిచ్చియ్య ఎసి ఆడిటోరియంలో జరిగే వేడుకల్లో తమ ప్రతిభను ప్రదర్శించబోతున్నారు. ఇక్కడికి వచ్చే పిల్లలంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. అందుకే కేవలం రూ.100 ఫీజుతో ఈ డ్యాన్స్ శిక్షణను జాషువా సాంస్కృతిక వేదిక ప్రతినిధులు ఏర్పాటు చేయించారు. ఇవే కాకుండా నృత్యం, చిత్రలేఖనం, పాటలు ఇలా పలు రకాల కార్యక్రమాలతో పిల్లల్లో నిబిడీకృతమైన సృజనాత్మక శక్తులను వెలికితీయటానికి కృషి చేస్తోంది. పిల్లల్లో సృజనాత్మకతను హరించివేసే టీవీ, సెల్ సంస్కృతికి వ్యతిరేకంగా అభ్యుదయం..సామాజిక దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఈ క్యాంపులకు విద్యార్థినీ విద్యార్థులు చక్కగా హాజరవుతూ తమ ప్రతిభను మరింతగా పెంపొందించుకుంటున్నారు. జాషువా సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి గుండు నారాయణరావు, బాధ్యులు ఐజాక్ న్యూటన్ క్యాంపు నిర్వాహకులుగా వ్యవహరించారు.
విజ్ఞానదాయకంగా…
అమరావతి బాలోత్సవ కమిటీలు, జనవిజ్ఞాన వేదికల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిల్లల్లో వైజ్ఞానిక స్ఫూర్తిని పెంపొందించటానికి పలు సమ్మర్ క్యాంపులు కొనసాగుతున్నాయి. విజయవాడ వన్టౌన్లోని గొల్లపాలెం గట్టు ప్రాంతంలోని శ్రామిక భవన్లో అమరావతి బాలోత్సవ కమిటీ, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెస్ కోచింగ్, సైన్స్ ప్రయోగాలు, డ్రాయింగ్, పేపర్ క్రాఫ్ట్ అంశాలపై శిక్షణ కొనసాగుతోంది. మొగల్రాజపురంలోని బోయపాటి శివరామకృష్ణయ్య నగర పాలక సంస్థ పాఠశాలలో అమరావతి బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9 నుంచి పదో తరగతిలోకి వచ్చే విద్యార్థులకు గణితంపై అవగాహన కల్పిస్తున్నారు. ఎంబివికెలో ప్రతిరోజూ ఉదయం 7.30 గంటల నుంచి 9 గంటల వరకూ స్పోకెన్ ఇంగ్లీషు తరగతులు జరుగుతున్నాయి. కృష్ణాజిల్లా ఉయ్యూరులోని నాగళ్ల రాజేశ్వరమ్మ, జానకిరామయ్యల విజ్ఞాన కేంద్రంలో బాలల సంఘం ఆధ్వర్యంలో మ్యూజిక్, డ్యాన్స్, మ్యాజిక్, వైజ్ఞానిక అంశాలు, పిల్లలకు కథలు, డ్రాయింగ్, కళారూపాలపై శిక్షణ ఇస్తున్నారు. మొవ్వ మండలం చినముత్తేవితోపాటుగా పెనమలూరు మండలం యనమలకుదురులో కూడా వేసవి శిబిరాలు కొనసాగుతున్నాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపులు కొనసాగుతున్నాయి.