లక్ష్మీపూర్ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ధ్రువ, చైతన్య అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ధ్రువ బడిలో చెప్పిన పాఠాలు, మాటలు శ్రద్ధగా వినేవాడు. చైతన్య మాత్రం ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను, మాటలను అసలు వినేవాడు కాదు.
పరీక్షలు ముగిసి వేసవి సెలవులు వచ్చాయి. సెలవుల్లో ఏం చేయాలో ఉపాధ్యాయులు వివరంగా చెప్పారు. ‘ఎండలో బయట ఎవరూ తిరగకూడదు అని, అలా తిరిగితే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందన్నా’రు. సెలవుల్లో కథల పుస్తకాలు చదవడం, రాయడం, బొమ్మలు గీయడం, తయారుచేయడం, డైరీ రాయడం లాంటి పనులు చేయాల’ని సూచించారు. ‘పిల్లలు స్కూలు లైబ్రరీలో పుస్తకాలు చదువుకోవచ్చు’ అని చెప్పారు. అలాగే ఎండాకాలంలో మూగజీవాలకు నీళ్లు పెడుతూ ఉండాల’న్నారు.
సెలవులు ప్రారంభమైన నాటి నుండి ధ్రువ బడిలో మాస్టార్లు చెప్పిన పాఠాలు తు.చ తప్పకుండా చేశాడు. లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదివాడు. ఎండలో తిరక్కుండా ఇంట్లోనే ఉండి బొమ్మలు గీయడం, కథలు రాయడం నేర్చుకున్నాడు. చైతన్య మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఎండకి బయటికి వెళ్లి ఆడుకున్నాడు.
స్నేహితుడు అలా తిరగడం ధ్రువకి నచ్చలేదు. ఎలాగైనా తనలో మార్పు తీసుకురావాలని అనుకున్నాడు. ఒక రోజు ధ్రువ కూడా చైతన్యతో కలిసి బయటికి వెళ్లాడు. అప్పుడు కొన్ని ఆవులు, గేదెలు చెట్ల కింద సేదతీరుతున్నాయి. వాటి దరిదాపుల్లో ఎక్కడా నీళ్ల తొట్టెలు లేవు. ‘ఇక్కడ నీళ్ల బకెట్లు పెడదాం చైతన్య’ అన్నాడు ధ్రువ. ‘ఏం అవసరం లేదు. వాటి యజమానులు ఆ పని చూసుకుంటారు. మనం ఇంటికి వెళదాం పదా!’ అన్నాడు చైతన్య. ఆ మాటలు పట్టించుకోకుండా ధ్రువ వాటికి నీళ్లు పెట్టాడు. అప్పుడే అటువైపు వచ్చిన ఓ పెద్దాయన ధ్రువ చేసిన పనిని మెచ్చుకున్నాడు.
ఆ తరువాత ధ్రువ ఇంటికి వెళ్లాడు. చైతన్య మాత్రం ఎండలో బాగా ఆడాడు. చాలా దాహం వేస్తుంది. నాలుక తడి ఆరిపోతుంది. స్పృహ కోల్పోయేలా ఉంటుంది. ఇంతలో అటువైపు వచ్చిన ధ్రువ వెంటనే చైతన్యను చెట్టు నీడకి తీసుకెళ్లాడు. అక్కడ కుండలోని నీటిని ఇచ్చాడు. కాస్త తేరుకున్నాక ఇంటికి తీసుకెళ్లాడు. ధ్రువ చేసిన సహాయానికి చైతన్య కృతజ్ఞతలు చెప్పాడు. ఇదే మంచి సమయమని ధ్రువ చైతన్యతో మాస్టార్లు చెప్పిన మాటలు మరోసారి చెప్పాడు. ఆ మాటలతో చైతన్య ఆలోచనల్లో పడ్డాడు. ఇకనుంచి ధ్రువతో కలిసి ఉంటానని, తను చేసే అన్ని మంచి పనుల్లో తాను కూడా పాల్గొంటానని మాట ఇచ్చాడు. చైతన్యలో మార్పు వచ్చినందుకు ధ్రువ చాలా సంతోషించాడు.
– తల్లెల కీర్తి, 8వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
లక్ష్మీపూర్, ఆదిలాబాద్ జిల్లా.